Crime News: వారం క్రితం మరణం.. పూడ్చిన శవాన్ని బయటకు తీసి మరీ..
సాధారణంగా ఎవరైనా మరణిస్తే 24 గంటల్లోపు పోస్ట్మార్టం నిర్వహిస్తారు. కానీ ఇక్కడ మాత్రం ఈనెల 12వ తేదీన అనుమానాస్పద స్థితిలో మరణించిన ఓ వ్యక్తి అంత్యక్రియలు జరిగిన వారం రోజుల తర్వాత పోస్టుమార్టం నిర్వహించారు. అవును ఖననం చేసిన డెడ్ బాడీని బయటకుతీసి మరీ శవ పరీక్షలు నిర్వహించారు. అసలు ఎందుకు వారం తర్వాత పోస్ట్మార్టం నిర్వహించారో తెలుసుకుందాం పదండి.

మృతుడి భార్య తన బంధువులతో కలిసి కొట్టి చంపిందన్న ఫిర్యాదు మేరకు పోలీసులు స్పందించి ఫోరెన్సిక్ సిబ్బందితో పాతిపెట్టిన డెడ్ బాడీని బయటకు తీసి శివపరీక్షలు చేసిన ఘటన జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం గంగాపురం గ్రామంలో జరిగింది. అంత్యక్రియలు నిర్వహించిన డెడ్ బాడీని బయటకు తీసి పోస్టుమార్టం నిర్వహించారు అధికారులు. వివరాల్లోకి వెళ్తే.. సురేష్ అనే వ్యక్తికి కవిత అనే మహిళతో 14 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం కూడా ఉన్నారు. బ్రతుకుతెరువు కోసం హైదరాబాద్ వెళ్లి దమ్మాయిగూడ పరిధిలోని అంబేద్కర్ నగర్ లో నివాసం ఉంటూ పెయింటర్ గా పనిచేస్తున్నాడు.
అయితే ఈనెల 12 న తేదీన సురేష్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు మృతదేహాన్ని తన స్వగ్రామం గంగాపూర్కు తరలించారు. సహజమరణంగానే భావించిన కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు సిద్ధమయ్యారు. ఈ మేరకు మృతదేహానికి స్నానం చేయించే సమయంలో శరీరంపై తీవ్రగాయాలు కనిపించాయి. అప్పుడు అనుమానం వచ్చింది. కానీ బంధువులంతా రావడంతో అంత్యక్రియలు నిలిపివేసే పరిస్థితి లేక అంతిమ సంస్కారాలు నిర్వహించి ఖననం చేశారు కుటుంబ సభ్యులు.
అయితే సురేష్ ఒంటిపై గాయాలు ఉండడంతో అతని మృతిపై అనుమానం వచ్చిన బాధిత తల్లి లక్ష్మి జవహర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.దీంతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పూడ్చిన డెడ్ బాడీని బయటకి తీసి ఫోరెన్సిక్ వైద్యబృందంతో పోస్టుమార్టం నిర్వహించారు. అయితే మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిర్వహించామని, పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత క్లారిటీ వస్తుందని పోలీసులు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
