
హైదరాబాద్, జూన్ 3: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. బుధవారం, గురువారాల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ముఖ్యంగా ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండతో సహా మొత్తం 18 జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు వాతావరణ కేంద్రం ‘ఆరెంజ్’ అలర్ట్ జారీ చేసింది. మిగిలిన జిల్లాల్లోనూ చెదురు ముదురు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆయా ప్రాంతాల్లో బలమైన ఈదురు గాలులు వీస్తాయని, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
మరోవైపు కేరళ, తమిళనాడు రాష్ట్ర తీరాన్ని నైరుతి రుతుపవనాలు రేపటిలోగా తాకే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఈ క్రమంలో మంగళవారం రాత్రి నుంచే పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో రాత్రంతా ఎడతెరిపి లేకుండా వాన దంచికొట్టింది. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలంలో అత్యధికంగా 7.9 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది. ఇదే జిల్లాలోని తల్లాడలో 6 సెంటీమీటర్లు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట 4 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది. మరోవైపు 27 జిల్లాలో 40.2 నుంచి 44.7 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు సైతం రికార్డయ్యాయి. వచ్చే రెండు రోజులు భారీ వర్షాలు పడనున్న నేపథ్యంలో రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
ఇక ఏపీలో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు పిడుగులతో కూడిన వర్షాలు పడుతుంటే మరోవైపు ఎండలు తీవ్రంగా ఉన్నాయి. ద్రోణి ప్రభావంతో బుధవారం గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, పోలవరం, కాకినాడ, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 42-44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యే అవకాశం ఉంది.