Telangana Rains: దంచి కొడుతున్న వర్షం.. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు..

|

Sep 01, 2024 | 1:05 PM

మరో 24 గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న ఐఎండీ హెచ్చరికలతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం అయింది.. భారీ వర్షాలపై సీఎం రేవంత్‌ రెడ్డి అత్యవసర సమీక్ష నిర్వహించారు.

Telangana Rains: దంచి కొడుతున్న వర్షం.. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు..
CM Revanth Reddy
Follow us on

తెలంగాణలో వాయుగుండం ఎఫెక్ట్ తో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. మహబూబాబాద్, ఖమ్మం, వరంగల్, నల్లగొండ, ఆదిలాబాద్ సహా పలు ప్రాంతాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరద పోటెత్తుతోంది.. రోడ్లు, లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఎక్కడ చూసినా వరద నీరే కనిపిస్తోంది.. ఈ తరుణంలో మరో 24 గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న ఐఎండీ హెచ్చరికలతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం అయింది.. భారీ వర్షాలపై సీఎం రేవంత్‌ రెడ్డి అత్యవసర సమీక్ష నిర్వహించారు. మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, దామోదర రాజనర్సింహా, జూపల్లి కృష్ణారావుతో పాటు అధికారులతో సీఎం రేవంత్‌ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సీఎస్, డీజీపీ సహా ఉన్నతాధికారులందరూ.. అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్‌ ఆదేశించారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూచించారు. ఎప్పటికప్పుడు సమాచారాన్ని సీఎంవోకు పంపాలని.. వరద ప్రాంతాల్లో తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దంటూ సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఏ అవసరం ఉన్నా అధికారులకు ఫోన్‌లో సమాచారం ఇవ్వాలన్నారు. ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ కార్యకర్తలు వరద సహాయక చర్యల్లో పాల్గొనాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

చెరువులు, కుంటలపై నిరంతర నిఘా పెట్టాలి..

హైదరాబాద్‌లో కూడా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మున్సిపల్ సెక్రటరీ దాన కిషోర్ ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వర్షాల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ.. జలమండలి, హైడ్రా అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. గ్రేటర్‌ పరిధిలో ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా చూడాలన్నారు. పాత భవనాల్లోని ప్రజలను గుర్తించాలని.. లోతట్టువాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. చెరువులు, కుంటలపై నిరంతర నిఘా పెట్టాలన్నారు. జలాశయాల్లో నీటిమట్టాలను ఎప్పటికప్పుడు గమనించాలని సూచించారు. నాలాల దగ్గర హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. తాగునీరు కలుషితం కాకుండా చర్యలుచేపట్టాలన్నారు.

భారీవర్షాల నేపథ్యంలో హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. పలు ప్రాంతాలను రంగనాథ్‌ పరిశీలించిన రంగనాధ్.. వర్షపునీరు నిలబడిన ప్రదేశాల్లో సిబ్బందికి పలు సూచనలు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..