హమ్మయ్య.. ఏపీ, తెలంగాణలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మారుతోంది. నైరుతి రుతుపవనాలు విస్తరిస్తుండటంతో పాటు ద్రోణి ప్రభావం కారణంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో అనేక ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు పిడుగులు, ఈదురుగాలుల సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం కొనసాగుతోంది.. ఓ వైపు వర్షాలు కురుస్తుండగా.. మరోవైపు ఎండలు దంచికొడుతున్నాయి. శనివారం చాలా ప్రాంతాల్లో ఈదురుగాలులతో వర్షాలు కురిశాయి.. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. రుతుపవనాలు మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తున్నాయని.. దీని ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం.. తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అక్కడక్కడ భారీ వర్షాలు సైతం కురిసే అవకాశం ఉంది. దీంతోపాటు ఉరుములు, మెరుపులతో 40 నుంచి 50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగుళాంబ గద్వాల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలో వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వచ్చే రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉందని తెలిపింది. హైదరాబాద్ లో సైతం భారీ వర్షం కురిసే అవకాశం ఉందని.. అప్రమత్తంగా ఉండాలని అలర్ట్ జారీ చేసింది.. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. వర్షాలపై సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్రెడ్డి.. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో హైఅలర్ట్గా ఉండాలని అధికారులను ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ముంపు ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలన్నారు.
ఆంధ్రప్రదేశ్లోని ఈ ప్రాంతాల్లో వర్షాలు..
ఇదిలాఉంటే.. ఆంధ్రప్రదేశ్ లో కూడా వర్షాలు కురుస్తాయని అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. నైరుతి రుతుపవనాలు ప్రభావంతో ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా మేఘవృతమైన వాతావరణంతో పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఈదురుగాలులు, ఉరుములతో వర్షం పడే సమయంలో ప్రజలు చెట్ల క్రింద,భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడొద్దని సూచించారు.
ఆదివారం (14-06-26) శ్రీకాకుళం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మిగతా 23 జిల్లాల్లో కొన్నిప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని .. అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
