
హైదరాబాద్, మే 14: ఓ వాహనం నిండా కొబ్బరి పీచు మూటలు నింపి ఎంతో పకడ్భందీగా ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి తరలిస్తున్నారు. ఏ మాత్రం విలువ చేయని కొబ్బరి పీచును ఎందుకింత జాగ్రత్తగా తరలిస్తున్నారా? అని కొందరు యువకులు మాటు వేసి వెంబడించారు. వాహనం మీదకు చేరుకుని మీద ఉన్న కొబ్బరి మూటల్లో ఒకటి తొలగించి చూశారు. లోపలి దృశ్యం చూసి అవాక్కయ్యారు. వెంటనే ఆలస్యం చేయకుండా పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటన యాదాద్రి జిల్లా భువనగిరి పట్టణ శివారులో మంగళవారం (మే 13) తెల్లవారుజామున చోటు చేసుకుంది. అసలింతకీ వాహనంలో ఏముందంటే..
ఒడిశా నుంచి హైదరాబాద్కు కొబ్బరి పీజుతో వస్తున్న లోడ్ను కొందరు అడ్డుకుని తనిఖీ చేశారు. లోడ్ పైన మాత్రం కొబ్బరి పీజు మూటలు పెట్టి లోపల అక్రమంగా గోవులను తరలిస్తున్నట్లు గుర్తించారు. వాహనంలో మూగ జీవాలను అక్రమంగా తరలిస్తుండగా బజరంగ్దళ్, గో రక్షదళ్లకు చెందిన సభ్యులు కొందరు మంగళవారం తెల్లవారుజామున గుర్తించారు. ఆ వాహనాన్ని యాదాద్రి జిల్లా భువనగిరి పట్టణ శివారులో అడ్డుకున్నారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వాహనాన్ని స్వాధీనం చేసుకొన్నారు.
అందులోని నిందితుడు మరిశెట్టి సతీశ్ను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై లక్ష్మీనారాయణ తెలిపారు. వాహనంలోని దాదాపు 16 గోవులను హైదరాబాద్లోని జియాగూడ గోశాలకు తరలించి.. అక్కడ వాటికి మేత, నీళ్లు అందించారు. నిందితుడు సతీశ్ తూర్పుగోదావరి జిల్లా చెందిన వాడిగా పోలీసులు గుర్తించారు. అదే వాహనంలోని మరో ఇద్దరు పరారైనట్లు పోలీసులు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.