Hyderabad: పొద్దుపోయి ఇంటికొచ్చిన యజమాని.. అనుమానమొచ్చి షాప్ సీసీటీవీ కెమెరా చూడగా

ఓ పాన్ షాప్‌లో దొంగలు పడ్డారు. షాప్‌లో ఉన్న విలువైన సామాగ్రిని దోచుకెళ్లారు. కౌంటర్‌లో ఉంచిన డబ్బులను కూడా చోరీ చేశారు. ఇది తెలుసుకున్న షాప్‌ యజమాని లబోదిబోమంటున్నాడు. ఇలా ఈ షాప్‌లో దొంగతనం జరగడం ఒకటి, రెండు సార్లు కాదు.. ఏకంగా నాలుగు సార్లు. దొంగతనం గురించి పోలీసులకు ఫిర్యాదు చేసినా..

Hyderabad: పొద్దుపోయి ఇంటికొచ్చిన యజమాని.. అనుమానమొచ్చి షాప్ సీసీటీవీ కెమెరా చూడగా
Telugu News

Edited By:

Updated on: Apr 14, 2026 | 11:19 AM

హైదరాబాద్ నగరంలోని మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధి లక్ష్మీగూడ ప్రాంతంలో ఉన్న ఒక పాన్ షాప్‌లో దొంగతనం ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. సీసీటీవీ కెమెరా ఫుటేజ్‌లో ఇద్దరు యువకులు దొంగతనం చేస్తూ స్పష్టంగా కనిపించారు. ఈ నెల 13వ తేదీ తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో దొంగలు పాన్ షాప్‌లో చోరీకి పథకం వేశారు. మూసి ఉన్న షాప్ షట్టర్‌ను పైకి ఎత్తి గుట్టుచప్పుడు కాకుండా లోపలికి చొరబడ్డారు. పాన్ షాప్‌లో సాధారణంగా ఉండే సామాగ్రిని ఎత్తుకెళ్లడానికి ప్రయత్నించారు. ముందుగా అక్కడ రెండు వైపులా బిగించి ఉన్న కెమెరాలను తొలగించే ప్రయత్నం చేశాడు అందులో ఓ దొంగ. తాము చేసే దొంగతనం బయటికి రాకుండా ముందు జాగ్రత్త చర్యగా కెమెరాలను బలంగా లాగడం స్పష్టంగా రికార్డయింది.. వారి ముఖాలు కూడా మరింత స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆపై కొంత సామాగ్రిని, డబ్బాలో దాచిపెట్టిన నగదుని దొంగిలించారు.

ఈ ఘటనకు సంబంధించి షాప్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన పాన్ షాప్‌ సామాగ్రితో పాటు దాదాపు రూ.5 వేల నగదు పోయిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. తన షాప్‌లో ఇది మొదటి దొంగతనం కాదని, ఇదివరకే నాలుగు సార్లు దొంగతనం జరగడంతో తీవ్రంగా నష్టపోయాయని ఆ షాప్ యజమాని చెప్పడం గమనార్హం. సీసీ ఫుటేజ్ ఆధారంగా దొంగలను పట్టుకుని, తన నగదును తనకు తిరిగి ఇప్పించాలని కోరుతున్నాడు. సీసీ కెమెరాలు బిగించుకున్నప్పటికీ తన షాప్‌లో దొంగతనాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నానని, మరోసారి ఇలాంటివి జరగకుండా పోలీసులే కఠిన చర్యలు చేపట్టాలని షాప్ యజమాని విజ్ఞప్తి చేశాడు.

ఇది చదవండి: ప్రామిసరీ నోటు మీద ఈ ఒక్కటి రాయకపోతే.. మీ డబ్బు అస్సలు తిరిగిరాదు..

 

Follow Us