
హైదరాబాద్ ఉస్మానియా జనరల్ హాస్పిటల్ (OGH) వైద్యులు అరుదైన గ్లైకోజెన్ స్టోరేజ్ డిసీజ్ (GSD) టైప్ IIIతో బాధపడుతున్న 1 సంవత్సరం 10 నెలల చిన్నారికి విజయవంతంగా కాలేయ మార్పిడి నిర్వహించారు. ఈ శస్త్రచికిత్స 28 ఏప్రిల్ 2026న సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగంలో జరిగింది. GSD టైప్ III (కోరి/ఫోర్బ్స్ వ్యాధి) అనేది ఒక వంశపారంపర్య జీవక్రియ వ్యాధి. శరీరంలో గ్లైకోజెన్ను గ్లూకోజ్గా మార్చే ఎంజైమ్ లోపం వల్ల కాలేయం, కండరాలలో గ్లైకోజెన్ పేరుకుపోతుంది. దీని వల్ల హైపోగ్లైసీమియా, కాలేయం వాపు, కండరాల బలహీనత వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. మాస్టర్ మొహమ్మద్ అఫాన్ అనే బాలుడు అధిక ఆకలి, కడుపు ఉబ్బరం, ఉదయం నీరసం వంటి లక్షణాలతో ఆసుపత్రికి వచ్చాడు. పరీక్షల్లో తక్కువ రక్త చక్కెర స్థాయులు, అధిక ట్రైగ్లిజరైడ్స్, పెరిగిన కొలెస్ట్రాల్, కాలేయం విస్తరణ గుర్తించారు. బయాప్సీ, జన్యు పరీక్షల ద్వారా GSD టైప్ III నిర్ధారణ అయ్యింది.
చికిత్సలో భాగంగా బాలుడి తండ్రి నుండి సుమారు 240 గ్రాముల ఆరోగ్యకరమైన కాలేయ కణజాలాన్ని తీసుకుని మార్పిడి చేశారు. సుమారు 14 గంటలపాటు సాగిన ఈ శస్త్రచికిత్సకు ప్రొఫెసర్ మధుసూదన్ నేతృత్వం వహించారు. శస్త్రచికిత్స తర్వాత చిన్నారి ఆరోగ్యం స్థిరంగా ఉండి,మళ్లీ హైపోగ్లైసీమియా సమస్యలు కనిపించలేదని వైద్యులు తెలిపారు. ఈ చికిత్స సాధారణంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో రూ.50 నుంచి 60 లక్షలు ఖర్చవుతుండగా ఆరోగ్య శ్రీ కింద పూర్తిగా ఉచితంగా నిర్వహించడం విశేషం. అలాగే మార్పిడి తర్వాత అవసరమైన ఇమ్యునోసప్రెసెంట్ మందులు కూడా ప్రభుత్వమే అందిస్తోంది. భారతదేశ ప్రభుత్వ ఆసుపత్రుల్లో GSD టైప్ IIIకి కాలేయ మార్పిడి నిర్వహించిన అరుదైన మరియు మొట్టమొదటి కేసుగా ఇది రికార్డ్ సృష్టించింది.