Hyderabad: వెనక నుండి బైక్ తో కొట్టాడు…కింద పడగానే ఇతడు చేసిన పనికి… అంతా షాక్

హైదరాబాద్‌ దోమలగూడలో రోడ్డుపై నడిచే వ్యక్తిని బైక్‌తో ఢీకొట్టి, అతని వద్ద ఉన్న రూ.2.5 లక్షలను దోచి పరారైన ఘటనలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బాధితుడు స్వల్ప గాయాలతో ఆస్పత్రికి తరలించబడ్డాడు. పోలీసులు ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, సీసీటీవీ ఫుటేజీ, టెక్నికల్ ఆధారాలతో నిందితుడిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

Hyderabad: వెనక నుండి బైక్ తో కొట్టాడు...కింద పడగానే ఇతడు చేసిన పనికి... అంతా షాక్
Accused

Edited By: Ram Naramaneni

Updated on: Dec 05, 2025 | 8:08 PM

హైదరాబాద్‌ దోమలగూడలో రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న వ్యక్తిని బైక్‌తో ఢీకొట్టిన దుండగుడు, అతని వద్ద ఉన్న భారీ నగదును లాక్కుని పరారైన ఘటన కలకలం రేపింది. గురువారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనలో అశోక్‌నగర్‌ ప్రాంతానికి చెందిన వెంకటేశ్వరరావు అనే ప్రైవేట్‌ సంస్థ ఉద్యోగి దోపిడీకి గురయ్యాడు. సమాచారం ప్రకారం.. వెంకటేశ్వరరావు అశోక్‌నగర్‌లోని ఒక బ్యాంక్‌ నుంచి రూ.2.5 లక్షలు డ్రా చేసుకుని ఇంటికి వెళ్తుండగా, దోమలగూడ వద్దకు చేరుకున్న సమయంలో వేగంగా వచ్చిన గుర్తు తెలియని బైకర్‌ అతన్ని ఢీకొట్టాడు. ఢీకొట్టడంతో కిందపడిన వెంకటేశ్వరరావు తేరుకోకముందే, దుండగుడు అతని వద్ద ఉన్న నగదు సంచి దోచుకుని బైక్‌పై అక్కడి నుంచి పైగా చిందేశాడు.

గాయపడ్డ బాధితుడికి స్థానికులు సహాయం చేసి పోలీసులకు సమాచారం అందించారు. స్వల్ప గాయాలతో ఉన్న వెంకటేశ్వరరావును సమీప ఆస్పత్రికి తరలించారు. ఘటనపై అతను ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిని పట్టుకునేందుకు ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు. పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీతో పాటు టెక్నికల్‌ ఆధారాలను సేకరిస్తున్నారు. బైక్‌ నంబర్‌, పారిపోయిన మార్గం, అనుమానాస్పద కదలికలు తదితర వివరాలను ఖరారు చేయడానికి ప్రత్యేక టెక్నికల్‌ టీమ్‌లు రంగంలోకి దిగాయి. నగరంలోని ప్రధాన రహదారులు, చెక్‌పోస్టుల్లో తనిఖీలు ముమ్మరం చేశారు.

“నిందితుడిని త్వరలోనే గుర్తించి అరెస్ట్ చేస్తాం. దోచుకున్న నగదు కూడా స్వాధీనం చేసుకుంటాం” అని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఇటీవల నగరంలో ఇలాంటి రోడ్డు దోపిడీ ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో, పెద్ద మొత్తంలో నగదు తీసుకెళ్లేవారు తప్పనిసరిగా మరొకరిని వెంట తీసుకెళ్లడం, సురక్షిత వాహనాలను ఉపయోగించడం మంచిదని పోలీసులు సూచిస్తున్నారు.