
యూసుఫ్గూడ, నవంబర్ 20: లిఫ్టులో ఇరుక్కొని ఐదేళ్ల బాలుడు మృత్యువాతపడ్డాడు. ఈ విషాద ఘటన బుధవారం (నవంబర్ 19) హైదరాబాద్లోని అమీర్పేట్ సమీపంలో ఉన్న ఎల్లారెడ్డిగూడలో చోటుచేసుకుంది. మధురానగర్ ఠాణా పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం..
ఎల్లారెడ్డిగూడలోని కీర్తి అపార్ట్మెంట్స్ ఐదో అంతస్తు జి–బ్లాక్లో బల్లి నరుసునాయడు, ఐశ్వర్య దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు చైత్విక్, హర్షవర్ధన్ ఉన్నారు. మధురానగర్ కాలనీలోని శ్రీనిధి స్కూల్లో చైత్విక్ ఒకటో తరగతి, హర్షవర్ధన్ (5) యూకేజీ చదువుతున్నారు. ఎప్పటి మాదిరిగానే బుధవారం సాయంత్రం తల్లి ఐశ్వర్య పాఠశాల నుంచి ఇద్దరు కుమారిని తీసుకువచ్చింది. ఆ తర్వాత ముగ్గురూ ఐదో అంతస్తుకు వెళ్లారు. తల్లి, పెద్ద కుమారుడు చైత్విక్ ఇంట్లోకి వెళ్లగా చిన్న కుమారుడు హర్షవర్ధన్ (5) మాత్రం లిఫ్టు దిగలేదు. అంతలోనే లిఫ్ట్ ముందుభాగంలోని స్ప్రింగ్ డోర్ మూసుకుపోవడంతో ఒక్కసారిగా లిఫ్ట్ కదిలి కిందకి వెళ్లింది. ఈ క్రమంలో ఎలా జరిగిందో తెలియదుగానీ గ్రిల్స్ మధ్యలో బాబు శరీరం ఇరుక్కుపోయి.. ఐదో అంతస్తు నుంచి కొద్దిగా కిందికి వచ్చి లిఫ్ట్ ఆగిపోయింది.
వెంటనే తల్లి ఐశ్వర్య, అపార్ట్మెంట్ వాసులు వెంటనే పరుగెత్తుకొచ్చి చూడగా దారుణ ఘటన కనిపించింది. లిఫ్ట్ గ్రిల్స్ మధ్య ఇరుక్కుని బాలుడు విగత జీవిగా కనిపించాడు. వెంటనే బాలుడిని బయటకు తీసినా ప్రయోజనం లేకపోయింది. ఛాతీ భాగం ఒత్తిడికి గురికావటంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. వెంటనే బంజారాహిల్స్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా.. అక్కడి వైద్యులు పరీక్షించి అప్పటికే బాలుడు మృతి చెందినట్లు నిర్ధారించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.