HYD Metro: హైదరాబాద్ మెట్రో ఫేజ్-IIకు నిధులు ఇవ్వండి.. కేంద్రమంత్రికి సీఎం రేవంత్ విజ్ఞప్తి!
హైదరాబాద్ నగరంలో మెట్రో విస్తరణపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ మేరకు గురువారం ఢిల్లీలో కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరంలోని మెట్రో ఫేజ్-IIకు సత్వరమే నిధులు మంజూరు చేయాలని కోరారు.

తెలంగాణలో అధికారంలోకి వచ్చి ఇప్పటికే ఏదాదిన్న పాలనను పూర్తి చేసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ది దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే హైదరాబాద్ మెట్రో విస్తరణపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇప్పటికే మెట్రో ఫేజ్-2 రూట్ను ప్రకటించిన ప్రభుత్వం మెట్రో విస్తరణ పనులు ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే గురువారం ఢిల్లీలోని కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ నివాసంలో ఆయనతో భేటీ అయిన సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ మెట్రో ఫేజ్-IIకు సత్వరమే నిధులు మంజూరు చేయాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కోరారు.
అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరంలో 76.4 కిలోమీటర్ల పొడవైన మెట్రో ఫేజ్-II అవసరం ఎంతో ఉందని సీఎం కేంద్ర మంత్రికి తెలియజేశారు. రూ.24,269 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఉమ్మడి ప్రాజెక్టుగా చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని వివరించారు. మెట్రో ఫేజ్-II సాకారమైతే నగరంలో రాకపోకలు వేగంగా సాగడంతో పాటు రహదారులపై రద్దీ తగ్గుతుందని.. సుస్థిరాభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి ఖట్టర్కు తెలిపారు.
పట్టణ వ్యవహారాల శాఖ సూచన మేరకు అవసరమైన సవరణలు చేసి ప్రాజెక్టు డీపీఆర్ సమర్పించిన విషయాన్ని కేంద్ర మంత్రికి సీఎం గుర్తు చేశారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్-II ఆవశ్యకతను దృష్టిలో ఉంచుకొని ఇతర శాఖల నుంచి అవసరమైన అనుమతులు ఇప్పించాలని కేంద్ర మంత్రికి సీఎం విజ్ఞప్తి చేశారు. సమావేశంలో రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీలు మల్లు రవి, రఘువీర్ రెడ్డి, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏ.పి.జితేందర్ రెడ్డి, మెట్రో ఎండీ ఎన్.వి.ఎస్.రెడ్డి, కేంద్ర ప్రాయోజిత ప్రాజెక్టుల సమన్వయ కార్యదర్శి డాక్టర్ గౌరవ్ ఉప్పల్ తదితరులు తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




