Telangana: తెగించి కొట్లాడడం తెలంగాణ రక్తంలోనే ఉంది.. పార్లమెంట్ లో బీజేపీని దోషిగా నిలబెట్టాలి.. ఎంపీలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం

తెగించి కొట్లాడుడు తెలంగాణ (Telangana) రక్తంలోనే ఉందని సీఎం కేసీఆర్ ఉద్ఘాటించారు. తెగించి కొట్లాడితేనే తెలంగాణ వచ్చిందని వెల్లడించారు. మన పోరాటంలో నిజాయతీ ఉన్నప్పుడు, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పోరాటం చేస్తున్నపుడు ఎక్కడి దాకా...

Telangana: తెగించి కొట్లాడడం తెలంగాణ రక్తంలోనే ఉంది.. పార్లమెంట్ లో బీజేపీని దోషిగా నిలబెట్టాలి.. ఎంపీలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం
Telangana CM KCR
Follow us

|

Updated on: Jul 16, 2022 | 9:46 PM

తెగించి కొట్లాడుడు తెలంగాణ (Telangana) రక్తంలోనే ఉందని సీఎం కేసీఆర్ ఉద్ఘాటించారు. తెగించి కొట్లాడితేనే తెలంగాణ వచ్చిందని వెల్లడించారు. మన పోరాటంలో నిజాయతీ ఉన్నప్పుడు, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పోరాటం చేస్తున్నపుడు ఎక్కడి దాకా పోవాలో అక్కడి దాకా పోవాల్సిందేనని స్పష్టం చేశారు. బీజేపీకి (BJP) వ్యతిరేకంగా సాగే టీఆర్ఎస్ పోరాటంలో వచ్చే అన్ని పక్షాలను సరైన దిశగా ఫ్లోర్ కో-ఆర్డినేషన్ చేసుకుంటూ నిరసనలను చేపట్టాలని, పార్లమెంట్ లోని రాజ్యసభా, లోక్ సభ పక్ష నేతలను సీఎం కేసీఆర్ ఆదేశించారు. సోమవారం నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో శనివారం ప్రగ‌తి భ‌వ‌న్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ పార్లమెంట‌రీ పార్టీ స‌మావేశం జరిగింది. పార్లమెంట్ స‌మావేశాల్లో అనుస‌రించాల్సిన వ్యూహంపై సీఎం కేసీఆర్ (CM KCR) ఎంపీల‌కు దిశానిర్దేశం చేశారు. తెలంగాణ ఏర్పడిన 8 సంవత్సరాలలో రాష్ట్ర విభజన హామీలు సహా పలు హక్కులను తొక్కిపెడుతున్న బీజేపీ అసంబద్ధ వైఖరిని, కలిసొచ్చే విపక్ష ఎంపీలతో సమన్వయం చేసుకొని ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి సూచించారు.

తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కక్షపూరిత వైఖరిని తీవ్రంగా నిరసిస్తూ పార్లమెంట్ ఉభయ సభల్లో గళం విప్పాలి. ప్రగతిశీల రాష్ట్రమైన తెలంగాణను ప్రోత్సహించడం మాని, తెలంగాణ అభివృద్ధి పట్ల కేంద్ర ప్రభుత్వం ద్వేషపూరితంగా వ్యవహరించడాన్ని ఎండగట్టాలి. పార్లమెంటు సమావేశాల సందర్భంగా అవసరమైతే నేనూ ఢిల్లీకి వస్తా. విపక్ష పార్టీల అధినాయకులు, ఎంపీలతో చర్చలు జరుపుతాం. పార్లమెంటు సమావేశాల్లో కేంద్రం ప్రవేశపెట్టనున్న పలు ప్రజా వ్యతిరేక బిల్లులను నిర్ద్వందంగా తిరస్కరించాలి. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాల వల్ల దేశం అన్నిరంగాల్లో అభివృద్ధి నిలిచిపోయింది. కాబట్టి భారత పౌరులుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై పోరాడాల్సిన అవసరం ఉంది. అందుకు పార్లమెంటు ఉభయ సభలే సరైన వేదికలు. ఆర్ధిక క్రమశిక్షణతో అభివృద్ధి చెందుతున్న తెలంగాణను మోడీ ప్రభుత్వం ఏనాడూ ప్రోత్సహించలేదు. దేశంలోని 22 రాష్ట్రాల అప్పులు తెలంగాణ కంటే ఎక్కువగా ఉన్నాయి. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఒక్క రోజు కూడా, ఒక్క పైసా కూడా డిఫాల్ట్ కాకుండా తిరిగి చెల్లించిన ట్రాక్ రికార్డు తెలంగాణ సొంతం. తెలంగాణకు వ్యతిరేకంగా కేంద్రం తీసుకునే నిర్ణయాలు బీజేపీ సోషల్ మీడియా గ్రూపులకు ఎలా చేరుతున్నాయో బీజేపీ నాయకత్వం స్పష్టం చేయాలి. దేశానికి, రాష్ట్రాల మధ్య గోప్యంగా ఉండాల్సిన ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా లీక్ చేసి, తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దుష్ప్రచారం చేయడం దారుణం. ఇదంతా ఒక పకడ్బందీ పథకం ప్రకారం జరుగుతోంది.

        – కేసీఅర్, తెలంగాణ ముఖ్యమంత్రి

ఇవి కూడా చదవండి

విద్యుత్ సంస్కరణల పేరుతో కేంద్రం తమకు అయినవారికి దోచిపెట్టేందుకు రాష్ట్రాలమీద ఒత్తిడి తేవడంపై సీఎం కేసీఆర్ మండిపడ్డారు. దీనిపై కేంద్రాన్ని నిలదీయాలని ఎంపీలకు సూచించారు. తెలంగాణ ఏర్పాటైన నాటి నుంచీ ప్రతిసారీ నీతి ఆయోగ్ ప్రశంసిస్తోందని, అత్యుత్తమ ప్రగతిని సాధిస్తున్న రాష్ట్రాలను కేంద్రం ప్రోత్సహించాలని పలుమార్లు నీతి ఆయోగ్ వంటి సంస్థలను చేసిన సిఫారసులను ఉద్దేశపూర్వకంగా బుట్ట దాఖలు చేసిందని, దీనిపై కూడా నిలదీయాలని సీఎం అన్నారు. దేశంలో ఏ మూలన అభివృద్ధి సాధిస్తున్నా అది దేశ జీడీపీకే సమకూరుతుందన్నారు. దేశంలో కేవలం 8 రాష్ట్రాలే ఎక్కువ శాతం దేశ జీడీపీకి కంట్రిబ్యూట్ చేస్తున్నాయని, అందులో తెలంగాణ కూడా ఒకటని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ నుంచి 8 ఏళ్లల్లో కేంద్రానికి పోయింది ఎంత? కేంద్రం నుంచి తెలంగాణకు వచ్చిన నిధులెన్ని? అనే లెక్కలు పరిశీలిస్తే సామాన్యులకు కూడా కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు చేస్తున్న అన్యాయం ఏమిటో అర్ధమవుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు.

ఆదాయ పన్ను సహా, వ్యాపార, వాణిజ్య, జీఎస్టీ తదితర పన్నుల రూపంలో తెలంగాణ నుంచి కేంద్రానికి అందుతున్న 3 లక్షల 65 వేల 737 కోట్లు రూపాయలు కాగా, కేంద్రం నుంచి తెలంగాణకు అందుతున్నవి కేవలం 1 లక్ష 96 వేల 449 కోట్లు మాత్రమేనని, ఇదే విషయంపై కేంద్రాన్ని నిలదీయాలని సీఎం కేసీఆర్ ఎంపీలకు వివరించారు. ఇందులో అన్ని రాష్ట్రాలకు వచ్చినట్లుగానే రాజ్యాంగ బద్దంగా తెలంగాణకు కేంద్రం నుంచి వస్తున్న నిధుల్లో సెంట్రల్ డెవల్యూషన్ పద్దు కింద వచ్చినవి రూ.1,17,797 కోట్లు అని చెప్పారు. దీనిని బట్టి చూస్తే కేంద్రం తెలంగాణకు అందిస్తున్న ప్రోత్సాహం ఏపాటిదో తెలుస్తోందన్నారు. ఏటా ఎఫ్.ఆర్.బి.ఎం లిమిట్ ను కేంద్రం ప్రకటిస్తుందని, ఆ తర్వాతే రాష్ట్రాలు కేంద్రం ప్రకటనపై ఆధారపడి వారి వారి బడ్జెట్లను రూపొందించుకుంటాయని, ఈ నేపథ్యంలో తెలంగాణ ఎఫ్.ఆర్.బి.ఎం లిమిట్ రూ.53,000 కోట్లు అని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం తర్వాత మాట మార్చడం ఏంటని ప్రశ్నించారు. పార్లమెంట్ ఉభయ సభల్లో బీజేపీని నిలదీసేందుకు అవసరమైన అన్నిరకాల ప్రజాస్వామిక పద్ధతులను అనుసరించాలని సీఎం దిశా నిర్దేశం చేశారు

ఎఫ్.ఆర్.బి.ఎం నిబంధనలు కేంద్రానికి ఒకమాదిరి, రాష్ట్రాలకు మరోమాదిరి ఉండటం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని సీఎం అన్నారు. రాష్ట్రాల జీ.ఎస్.డి.పి.లో ఎఫ్.ఆర్.బి.ఎం పరిధిని 3శాతంగా పరిమితి విధించి, కేంద్రం మాత్రం 6.4శాతంగా నిబంధనలు సడలించడం ఎక్కడి న్యాయమన్నారు. ఎఫ్.ఆర్.బి.ఎం చట్టం వచ్చిన 19 ఏండ్ల కాలంలో కేవలం ఒక్క ఏడాది తప్పితే మిగిలిన 18 ఏండ్లలో ఒక్కనాడు కూడా కేంద్రంలోని ప్రభుత్వాలు ఎఫ్.ఆర్.బి.ఎం నిబంధనలు పాటించలేదనే సంగతిని పార్లమెంటు దృష్టికి తేవాలన్నారు. మోడీ ప్రభుత్వం ప్రారంభమైన కాలం నుంచి ఈ విధానం మరింత లోపభూయిష్టంగా మారి, ప్రతి ఏటా ఎఫ్.ఆర్.బి.ఎం పరిమితులను తనకుతానే సడలించుకుంటూ తన ఇష్టారాజ్యంగా అప్పులు తెస్తూ, దేశాన్ని దివాళా తీస్తున్నదని సీఎం అన్నారు. ఎఫ్.ఆర్.బి.ఎం సవరణల పేరుతో కేంద్రం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నదని ముఖ్యమంత్రి ఆరోపించారు. దేశాన్ని దివాళా తీసే దిశగా.. ఆర్ధిక వ్యవహారాల నిర్వహణలో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అత్యంత దారుణంగా విఫలమైందని సీఎం దుయ్యబట్టారు.

‘‘ అంటే మిమ్నల్ని అడిగేవారు ఎవరూ లేరని అనుకుంటున్నరా? దేశంలో రాష్ట్రాలు భాగస్వామ్యం కాదా? రాష్ట్రాలను హద్దుల్లో పెడుతున్న కేంద్రం ఇష్టానుసార చర్యల్ని రాష్ట్రాలు ఎందుకు నిలదీయకూడదు? రాష్ట్రాలకు మిమ్నల్ని ప్రశ్నించే హక్కు ఎందుకు ఉండదు? మీ అసంబద్ధ చర్యల వల్ల దేశం ఆగమైతే రాష్ట్రాలు ఆగమైనట్లు కాదా? దేశంలోని రాష్ట్రాలన్నీ ఇదంతా చూస్తూ మౌనంగా ఉండాలా? మీరు కూర్చున్న కొమ్మను నరుక్కునే విధంగా కేంద్రం అనుసరిస్తున్న క్షమించరాని నేరాలను చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు’’. స్వాతంత్ర్యం వచ్చిన 67 ఏండ్లలో దేశం అప్పు రూ. 56 లక్షల కోట్లు ఉంటే కేవలం తన 8 ఏండ్ల పాలనలో రూ.100 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి దించిన ఘనత మోడీ ప్రభుత్వానికే దక్కుతుంది. రూపాయి పతనం, విపరీతంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు, ఇవే బీజేపీ పాలనలో ఉన్నాయి. తాగునీరు, విద్యుత్, కనీస మౌలిక వసతులు అందించలేరు. దేశ రాజధాని ఢిల్లీలోనే మంచినీళ్లకూ, విద్యుత్ కు కరవు ఉంది. నాటి నెహ్రూ నుంచి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ వరకూ ఈ దేశ ప్రధానులుగా పనిచేసిన వారెవరూ కూడా ప్రభుత్వరంగ సంస్థలను స్థాపించారే తప్ప, అమ్మకానికి పెట్టలేదు. పెట్టుబడుల ఉపసంహరణ పేరుతో ఒక మంత్రిత్వశాఖనే ఏర్పాటు చేసిన ఘనత బీజేపీకే దక్కింది. ప్రభుత్వరంగ సంస్థలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కారు చౌకగా తెగనమ్ముతుండటం సిగ్గుచేటు.

      – కేసీఆర్, తెలంగాణ ముఖ్యమంత్రి

ప్రభుత్వరంగ సంస్థల అమ్మకాలకు ప్రోత్సాహకాలందిస్తూ, ప్రజల సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్న నరేంద్ర మోడీ అత్యంత అనర్హుడైన ప్రధానిగా సీఎం కేసీఆర్ దుయ్యబట్టారు. స్వార్ధపూరిత రాజకీయాల కోసం రాష్ట్రాలను, దేశ ప్రజలను ఆర్థికంగా, సామాజికంగా, అన్నిరకాలుగా పీడిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రాలకు హక్కుగా అందాల్సిన పన్నుల వాటాను సెస్సుల రూపంలో దొంగిలించి, బ్యాంకులకు వేలాది కోట్లు ఎగ్గొట్టిన కార్పొరేట్ శక్తుల పట్ల మౌనం వహించడం వంటి దుర్మార్గాలను ఉపేక్షించేది లేదని సీఎం స్పష్టం చేశారు. తెలంగాణ రైతులు పండిస్తున్న ధాన్యాన్ని కొనకుండా కేంద్రం అనుసరిస్తున్న దుర్మార్గ వ్యవహారంపై ఎంపీలతో సీఎం కేసీఆర్ చర్చించారు. వడ్లు పండించమని ఒకసారి, వద్దని మరోసారి, కొంటామని ఒకసారి, కొనడం లేదని మరోసారి, అటు ఢిల్లీ బీజేపీ, ఇటు గల్లీ బీజేపీ నేతలు ద్వంద్వ వైఖరిని అవలంబించడం దుర్మార్గమని మండిపడ్డారు. రైతులను, మిల్లర్లను, రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్ర ఇబ్బందులకు, అయోమయానికి గురిచేస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ గోల్ మాల్, రైతు వ్యతిరేక విధానాలపై పోరాడాలని ఎంపీలకు, సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.

రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి నేటి వరకు తెలంగాణ అత్యంత పారదర్శకంగా, బాధ్యతాయుతంగా, జవాబుదారీతనంతో గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని (నరేగా) అమలు చేస్తోందని ప్రశంసించిన కేంద్రం నేడు మాట మార్చి కుట్రపూరితంగా వ్యవహరించడం సిగ్గుచేటని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. ఇప్పటికే కేంద్రం పశ్చిమ బెంగాల్ లో నరేగా పథకాన్ని రాజకీయ దురుద్దేశంతో రద్దు చేసిందని, తెలంగాణాలో కూడా ఇలాగే నరేగాను రద్దు చేసేందుకు కుట్రలు చేస్తోందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మత విద్వేషాలు రెచ్చగొట్టి ప్రగతి బాటలో నడవాల్సిన యువత మెదళ్లను కలుషితం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ విదేశీ మారక నిల్వలు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయని ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. త్వరలో డాలర్ విలువ 100 రూపాయలకు చేరుకునే పరిస్థితులు దాపురించాయని ఆర్ధికవేత్తలు హెచ్చరిస్తున్నారని, అవేమీ పట్టని మోడీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ప్రముఖ విదేశీ కంపెనీలు దేశాన్ని విడిచి ఎందుకు వెళుతున్నాయో ప్రధాని సమాధానం చెప్పాలని సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు.

        పరమత సహనం, శాంతి, సౌభ్రాతృత్వం ఫరిఢవిల్లాల్సిన దేశంలో అశాంతి ప్రబలే సూచనలు దాపురించాయి. బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న దుర్మార్గ విధానాలు సమాఖ్య స్పూర్తికి, లౌకికవాదానికి గొడ్డలిపెట్టుగా మారుతున్నాయి. దేశంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు వ్యతిరేకంగా కొనసాగుతున్న బీజేపీ అప్రజాస్వామిక విధానాలను నిరసిస్తూ పార్లమెంటు వేదికగా దేశ ప్రజల ఆకాంక్షలను చాటేలా గళం విప్పాలి. ప్రజల విశ్వాసాన్ని కోల్పోయి, పాలనలో పూర్తిగా విఫలమైన బీజేపీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభమైందనే విషయాన్ని పార్లమెంటు సాక్షిగా గుర్తు చేయాలి. కేవలం 30 శాతం పైచిలుకు ఓట్లతోనే అధికారంలోకి వచ్చిన సంగతి మరువద్దని, మిగిలిన 70శాతం మంది దేశ ప్రజానీకం బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారనే విషయాన్ని గుర్తు చేయాలి. ప్రజా వ్యతిరేకత ఉద్ధృతమైతే పార్లమెంటు మూకుమ్మడిగా రాజీనామా చేసిన సందర్భాలూ ఉన్నాయి. అదే పరిస్థితిని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎదుర్కోక తప్పదు. ఇప్పటికే అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిన పలు అంశాలకు చెందిన డిమాండ్లతోపాటు, ఎస్టీ రిజర్వేషన్ల పెంపుపై ఉభయ సభల్లో కేంద్రాన్ని నిలదీయాలి. ఈ జాప్యానికి బీజేపీని దోషిగా నిలబెట్టాలి.

           – కేసీఆర్, తెలంగాణ ముఖ్యమంత్రి

పార్లమెంటు ఉభయ సభల్లో టీఆర్ఎస్ ఎంపీలు గళం విప్పనున్న ముఖ్యాంశాలు :

1. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులకు నిధుల విడుదల 2. ధాన్యం సేకరణ విషయంలో సమస్యలు 3. తెలంగాణ తీసుకొనే రుణాలకు కేంద్రం అనుమతులివ్వకుండా కొర్రీలు 4. కేంద్ర ఆర్ధికశాఖ పెండింగ్ నిధులు –(రూ.33,818.31 కోట్లు) విడుదల చేయాలి. 5. ఏపీ పునర్విభజన చట్టం కింద తెలంగాణకు చేయాల్సి ఉన్న పెండింగ్ సమస్యలు 6. కృష్ణా నదీ జలాల సమస్య 7. పవర్ సెక్టార్ సమస్యలు 8. జి.ఎస్.టి. సంబంధిత సమస్యలు 9. కంటోన్మెంట్ రోడ్ల సమస్యను కేంద్రం పరిష్కరించాలి. 10. ఆదిలాబాద్ లో సిమెంట్ పరిశ్రమను తెరవాలి. 11. హైదరాబాద్ లోని కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల భూములను రాష్ట్రానికివ్వాలి. 12. గిరిజన సంక్షేమ స్కాలర్ షిప్స్ విడుదల 13. తెలంగాణలో కేంద్ర విద్యాసంస్థలను వెంటనే ఏర్పాటు చేయాలి. 14. ఎస్టీ, బీసీ, మైనారిటీలకు రిజర్వేషన్ల పెంపునకు అనుమతించాలి. 15. రీజినల్ రింగ్ రోడ్ నోటిఫికేషన్ కేంద్రం వెంటనే విడుదల చేయాలి. 16. కేంద్ర పరిధిలోని చేనేత, వస్త్ర పరిశ్రమ సమస్యలను పరిష్కరించాలి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
దంతాల ఆరోగ్యంకోసం బ్రష్ చేయడానికి, బ్రష్‌కు నియమాలున్నాయని తెలుసా
దంతాల ఆరోగ్యంకోసం బ్రష్ చేయడానికి, బ్రష్‌కు నియమాలున్నాయని తెలుసా
బిగ్‌బాస్‌ కంటే ఎక్కువ టీఆర్పీ ఉన్నమెట్రో..!లొల్లి మళ్లీ మొదలైంది
బిగ్‌బాస్‌ కంటే ఎక్కువ టీఆర్పీ ఉన్నమెట్రో..!లొల్లి మళ్లీ మొదలైంది
ఆ బ్లాక్ బస్టర్ హిట్ మిస్సైన చిరు..
ఆ బ్లాక్ బస్టర్ హిట్ మిస్సైన చిరు..
నేడు ఈ యోగంలో కాలభైరవుడిని పూజించండి.. ఇంట్లో ఆనందం నెలకొంటుంది
నేడు ఈ యోగంలో కాలభైరవుడిని పూజించండి.. ఇంట్లో ఆనందం నెలకొంటుంది
అతి చవకైన డ్రైఫ్రూట్‌ .! ఇలా తింటే శరీరంలోని ప్రతి భాగాన్ని బలంగా
అతి చవకైన డ్రైఫ్రూట్‌ .! ఇలా తింటే శరీరంలోని ప్రతి భాగాన్ని బలంగా
సిద్ధార్థ్ రాయ్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..
సిద్ధార్థ్ రాయ్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెడుతున్నారా? సెబీ కొత్త ఆర్డర్‌
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెడుతున్నారా? సెబీ కొత్త ఆర్డర్‌
కస్టమర్లకు అలర్ట్‌.. మే నెలలో సగం రోజులు బ్యాంకులు బంద్‌
కస్టమర్లకు అలర్ట్‌.. మే నెలలో సగం రోజులు బ్యాంకులు బంద్‌
ఫ్రిడ్జ్‌లో పెట్టినా అల్లం ఎండిపోతుందా.. ఇలా నిల్వ చేయండి
ఫ్రిడ్జ్‌లో పెట్టినా అల్లం ఎండిపోతుందా.. ఇలా నిల్వ చేయండి
గోండు కటీర గురించి విన్నారా..? గోధుమ బంకతో ఊహించని ప్రయోజనాలు
గోండు కటీర గురించి విన్నారా..? గోధుమ బంకతో ఊహించని ప్రయోజనాలు