Telangana: ఎంత తాగావ్ బ్రో.. మందుబాబు రీడింగ్ చూసి పోలీసులకే మైండ్ బ్లాంక్
ఈ మధ్యకాలంలో తాగి వాహనాలు నడపడం పరిపాటిగా మారింది. తాగి ఇష్టానుసారం బండ్లు నడిపి ప్రాణాలను బలిగొంటున్న ఘటనలు ఎన్నో ఉన్నాయి. తాజాగా హైదరాబాద్లో ఓ మందుబాబును పట్టుకున్న పోలీసులు.. అతను ఎంత తాగాడో రీడింగ్ తీయగా.. దెబ్బకు షాక్ అయ్యారు.

పోలీసులు పట్టుకుని ఫైన్లు విధిస్తున్నా మందుబాబుల్లో ఏ మాత్రం మార్పు రావడం లేదు. తాజాగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో భాగంగా చాంద్రాయణగుట్ట పరిధిలో పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఈ సమయంలో అక్కడికి వచ్చిన ఓ ఆటో డ్రైవర్కు బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ చేయగా మద్యం సేవించినట్టు తేలింది. అంతేకాకుండా మిషన్లో 200 పాయింట్లు వచ్చింది. దీంతో ఆటోవాలా హంగామా అంతాఇంతా కాదు. జీవితంలో తీరని అన్యాయం జరిగిపోయినట్టు సీన్ క్రియేట్ చేశాడు.
ఒక్క బీర్ తాగానని, ఒక్క బీర్కే 200 పాయింట్లు ఎలా వస్తుందంటూ ఆటో అద్దానికి తల బాదుకుంటూ ఏడ్చేశాడు. చాలాసేపటి వరకు పోలీసులతో వాగ్వాద్వానికి దిగాడు. ఆ తర్వాత వెంటనే ఎమోషనల్ డ్రామా మొదలుపెట్టాడు. తాను పేదవాడినంటూ వదిలేయాలని పోలీసులను ప్రాధేయపడ్డాడు. అతడి పరిస్థితిని చూసి అక్కడున్న వారిలో కొంతమంది నవ్వుకుంటూ.. చూస్తూ ఉండిపోయారు. కానీ పోలీసులు మాత్రం అతని హంగామాను పట్టించుకోకుండా విధి నిర్వహణలో నిమగ్నమయ్యారు. మద్యం సేవించినట్లు స్పష్టంగా రికార్డవ్వడంతో డ్రైవర్ను వదిలిపెట్టకుండా కేసు నమోదు చేశారు. అతని లైసెన్స్ వివరాలు తీసుకుని కేసు నమోదు చేశారు.
ఇటీవల కాలంలో మద్యం సేవించి వాహనాలు నడిపేవారి సంఖ్య భారీగా పెరిగిపోతుండటంతో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను ఎక్కువ చేస్తున్నారు. అయినా మందుబాబుల్లో మాత్రం ఏమాత్రం మార్పు కనపడటం లేదు. చాలా మంది పోలీసుల్ని చూసినా కూడా బెదరడం లేదు. నిర్భందంగా బీర్లు తాగి బండ్లను రోడ్డెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు మరింత కఠినంగా వ్యవహరిస్తున్నా మందుబాబులు వాటిని సీరియస్గా తీసుకోవడం లేదు. ఈ తరహా ఘటనలు సామాన్య ప్రజల ప్రాణాలకు ప్రమాదంగా మారుతున్నాయి. ఒక్కోసారి వీరి నిర్లక్ష్యానికి మిగతా ప్రజలు బలి అవుతున్నారు. అలాంటి ప్రమాదాలను తగ్గించేందుకు పోలీసులు నిరంతరం తనిఖీలు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
