
తెలుగు రాష్ట్రంలో చలిపులి పంజా విసురుతోంది. ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ అధికారులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. చలి గాలుల తీవ్రత కొనసాగుతుందని.. మరో రెండు రోజులు రాష్ట్రంలో ఇదే పరిస్థితి ఉంటుందని తెలిపారు. ఉదయం, సాయంత్రం ప్రయాణం చేసే వాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. వృద్ధులు, చిన్నారుల పట్ల మరింత జాగ్రత్త తీసుకోవాలని సూచిస్తున్నారు. ఆదిలాబాద్,నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదిలాబాద్లో 6.2 డిగ్రీలు, మెదక్లో 7.2, హనుమకొండలో 8.6, నిజామాబాద్ 11.4, హైదరాబాద్లో 12.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శని,ఆదివారాల్లోనూ ఇదే పరిస్థితి ఉంటుంది వాతావరణశాఖ అధికారులు తెలిపారు. 32 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్, దాని పరిసర ప్రాంతాల్లో చాలా చోట్ల సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. రానున్న రెండు మూడు రోజులు చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని తెలిపింది.
ఇటు ఏపీని చలి వణికిస్తోంది. మరీ ముఖ్యంగా మన్యం జిల్లాలను గజగజలాడిస్తోంది. సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలే నమోదవుతుండటంతో బయటకు రావాలంటే జంకుతున్నారు. పాడేరు, అరకులో 4 డిగ్రీల టెంపరేచర్ నమోదవ్వడంతో వాటర్ గడ్డకడుతోంది. వ్యవసాయ భూముల్లోని నీరు కూడా గడ్డ కట్టడంతో రైతులెవ్వరూ ఉదయాన్నే పొలాల వైపు వెళ్లట్లేదు. మినుములూరులో 4 డిగ్రీలు, చింతపల్లిలోనూ 5.5 డిగ్రీల కనిష్ణ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం 9 గంటలు దాటినా మంచు తెరలు వీడట్లేదు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..