
భద్రాచలం, జూన్ 23: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలో మూఢనమ్మకాల పేరుతో మృతదేహాలను ఇంట్లోకి రానివ్వకుండా ఇంటి యజమాని గేట్ కు తాళం వేసి అడ్డుకోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్ల మండల కేంద్రంలో విద్యుత్ శాఖలో లైన్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న దూడల శ్రీనివాస్ భద్రాచలం పట్టణంలోని వెంకటేశ్వర కాలనీలో కుటుంబంతో అద్దె ఇంట్లో ఉండి నివసిస్తుండగా గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటన జరిగి నాలుగు నెలలు గడవక ముందే 21 తేదీ ఆదివారం ములకలపల్లి వద్ద జరిగిన కారు ప్రమాదంలో శ్రీనివాస్ కుమారుడు సాయి ప్రకాష్, కోడలు సంధ్య, మనవడు మోక్షిత్ మృతి మృతి చెందారు.
మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం వెంకటేశ్వర కాలనీలోని అద్దె ఇంటికి అంబులెన్స్ లో తీసుకురాగ, మృతదేహాలను ఇంట్లోకి తీసుకురావద్దని ఇంటి యజమాని సాంబశివరావు గేటుకు తాళం వేయడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. యజమానికి స్థానికులు ఎంత నచ్చజెప్పినా వినకుండా మొండికేయడంతో పోలీసులు పిర్యాదు చేస్తామన్న యజమానికి చలనం లేదు. అద్దె ఇంట్లో ఉన్న వాళ్లు వరుసగా మృతి చెందడంతో కీడు జరిగిందని మూఢనమ్మకంతో గేటుకు తాళం తీయకుండా మొండికేశాడు.
దీంతో దూడల శ్రీనివాస్ కోడలు పుట్టినిల్లు పురుషోత్తమపట్నం గ్రామం సమీపంలో ఉండడంతో మూడు మృతదేహాలను అక్కడికి తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. ఇంటి యజమాని తీరుపై సిపిఎం నాయకులు బాలనర్సారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఇంటి యజమానులు తమ మానవత్వాన్ని చాటేలా ప్రవర్తించాలని కోరారు.