UPSC సివిల్స్ ప్రిలిమ్స్ 2026లో అర్హత సాధించారా? ఐతే మెయిన్స్కు ఉచిత శిక్షణ మీకోసమే..
UPSC 2026 Mains Free Coaching: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2026 ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులైన గిరిజన అభ్యర్థులకు మెయిన్స్ పరీక్షల కోసం ఉచిత శిక్షణ అందించనున్నట్లు రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ వెల్లడించింది. అర్హులైన అభ్యర్థులు రాజేంద్రనగర్లోని ఐఏఎస్ ఎస్టీ స్టడీ సర్కిల్ను సంప్రదించాలని సూచించింది..

హైదరాబాద్, జూన్ 23: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2026 ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులైన గిరిజన (ఎస్టీ) అభ్యర్థులకు మెయిన్స్ పరీక్షల కోసం ఉచిత శిక్షణ అందించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ ప్రత్యేక కార్యదర్శి బీఎం సంతోష్ వెల్లడించారు. సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో గిరిజన యువత అధిక సంఖ్యలో విజయం సాధించేందుకు ఈ ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
అర్హత కలిగిన అభ్యర్థులు జూన్ 22, 23 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రాజేంద్రనగర్లోని ఐఏఎస్ ఎస్టీ స్టడీ సర్కిల్ను సంప్రదించాలని సూచించారు. మెయిన్స్ పరీక్షకు అవసరమైన అంశాలపై నిపుణుల ద్వారా శిక్షణ, మార్గదర్శకత్వం అందించనున్నట్లు తెలిపారు.
సివిల్స్ మెయిన్స్ పరీక్షకు సిద్ధమవుతున్న గిరిజన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు. శిక్షణ కార్యక్రమానికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం 6281766534 ఫోన్ నంబర్ను సంప్రదించాలని సూచించారు.
UPSC మెయిన్స్ 2026 DAF దరఖాస్తులు ప్రారంభం.. జూన్ 28 వరకే అవకాశం
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2026 ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల కోసం డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్ (DAF) సమర్పణ ప్రక్రియను ప్రారంభించింది. ఈ ఏడాది నోటిఫై చేసిన 1016 సివిల్ సర్వీసెస్ పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలను కమిషన్ జూన్ 15న రోల్ నంబర్ల వారీగా, జూన్ 17న పేర్ల వారీగా ప్రకటించింది. ప్రిలిమ్స్లో ఉత్తీర్ణత సాధించి మెయిన్స్ పరీక్షకు ఎంపికైన మొత్తం 13,343 మంది అభ్యర్థులు జూన్ 28, 2026 వరకు అధికారిక వెబ్సైట్ upsconline.nic.in ద్వారా డీఏఎఫ్ను సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియలో భాగంగా అభ్యర్థులు తమ వ్యక్తిగత, విద్యార్హతల వివరాలను నమోదు చేయడంతో పాటు పరీక్ష రుసుము రూ.200 చొప్పున చెల్లించాలి. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్లూబీడీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు. డీఏఎఫ్ సమర్పించిన అభ్యర్థులకే సివిల్ సర్వీసెస్ మెయిన్ పరీక్ష అడ్మిట్ కార్డులు జారీ చేయబడతాయని UPSC స్పష్టం చేసింది. కాబట్టి మెయిన్స్కు అర్హత సాధించిన అభ్యర్థులు నిర్దేశిత గడువులోగా దరఖాస్తు చేయాలని కమిషన్ సూచించింది.




