Heavy Rain Alert: ఆకాశానికి చిల్లు పడ్డట్లే.. మళ్లీ కుండపోత వర్షం.. మహబూబాబాద్, ఖమ్మం, విజయవాడలో హై అలర్ట్..

|

Sep 07, 2024 | 11:46 PM

తెలుగు రాష్ట్రాలు ఇప్పటికే భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలం అవుతున్నాయి.. ఈ క్రమంలోనే.. తెలంగాణలోని మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వర్షం బీభత్సం సృష్టిస్తోంది.. అటు విజయవాడలోనూ భారీ వర్షం కురుస్తోంది.. భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి.

Heavy Rain Alert: ఆకాశానికి చిల్లు పడ్డట్లే.. మళ్లీ కుండపోత వర్షం.. మహబూబాబాద్, ఖమ్మం, విజయవాడలో హై అలర్ట్..
Weather Forecast
Follow us on

తెలుగు రాష్ట్రాలు ఇప్పటికే భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలం అవుతున్నాయి.. ఈ క్రమంలోనే.. తెలంగాణలోని మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వర్షం బీభత్సం సృష్టిస్తోంది.. అటు విజయవాడలోనూ భారీ వర్షం కురుస్తోంది.. భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో వరద ప్రమాదం పొంచి ఉండటంతో ముంపు ప్రాంతాల వాసులతో పునరావాస కేంద్రాలకు తరలించాలని ప్రభుత్వాలు అధికారులను ఆదేశించాయి. ముంపు ప్రాంతాల్లో ఇప్పటికే అలర్ట్ జారీ చేశారు. పోలీసులను అధికారులను మోహరించి చర్యలు తీసుకుంటున్నారు.

మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా కుండపోత వాన కురవడంతో ఖమ్మం నగరంలో హై అలర్ట్ ప్రకటించారు. మహబూబాబాద్ పట్టణంలో 18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.. చిన్నగూడూరు మండలంలో జిల్లెళ్ల వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది.. గుండంరాజుపల్లి-చిన్నగూడూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.. నెల్లికుదురు మండలంలో ఆలేరు దగ్గర వంతెన పైనుంచి వరద ప్రవాహం కొనసాగుతోంది.. మహబూబాబాద్-తొర్రూర్‌ మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది..

ఇటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సైతం భారీ వర్షం కురుస్తోంది.. ఖమ్మం తల్లాడలో 12.1 సెం.మీ వర్షపాతం నమోదు కాగా.. భద్రాద్రి కొత్తగూడెం చంద్రుగొండలో 9.1 సెం.మీ వర్షం కురిసింది.. ఖమ్మం రఘునాథపాలెంలో 8.9 సెం.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. కాగా.. భారీ వర్షాలు.. మున్నెరుకు వరద ముప్పు ప్రమాదం పొంచి ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు.. మంత్రులు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు అధికారులను అప్రమత్తం చేయడంతో ముంపు ప్రాంతాల వాసులను సరుక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మైక్ ల ద్వార ప్రచారం చేస్తూ.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచిస్తున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హుటాహుటిన ఖమ్మం వెళ్లి.. అధికారులతో భేటీ అయ్యారు.

వీడియో చూడండి..

ఇదిలాఉంటే.. విజయవాడలోనూ భారీ వర్షం కురుస్తోంది.. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు.. ముంపు ప్రాంతాల వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. బుడమేరుకు వరద ప్రవాహం పెరుగుతుండటంతో అధికారులు జిల్లా అధికారులతో కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాలతో పల్లపు ప్రాంతాల్లోకి వరద నీరు చేరే అవకాశం ఉందని.. బాధితులను పునరావాస శిబిరాలకు తరలించాలని కలెక్టర్‌ సృజన సూచించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..