Revanth Vs Nirmala Sitharaman: ‘వీక్‌ హిందీ’ అని నిర్మలా కామెంట్.. రేవంత్ నుంచి ఊహించని ఆన్సర్

లోక్‌సభలో హైడ్రామా నడిచింది. మోదీ హాయాంలో దేశ ఆర్ధిక వ్యవస్థ దిగజారిందని కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి విమర్శించడంతో ఎదురుదాడికి దిగారు ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్‌. తనను అవమానించే రీతిలో నిర్మలా మాట్లాడారని రేవంత్‌ మండిపడ్డారు.

Revanth Vs Nirmala Sitharaman: ‘వీక్‌ హిందీ’ అని నిర్మలా కామెంట్.. రేవంత్ నుంచి ఊహించని ఆన్సర్
Revanth Reddy VS Nirmala Sitharaman
Follow us

|

Updated on: Dec 12, 2022 | 9:03 PM

లోక్‌సభలో హైడ్రామా నడిచింది. రూపాయి పతనంపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి, కేంద్ర ఆర్థిక నిర్మలా సీతారామన్ మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. తనకు హిందీ భాష రాదందూ నిర్మలా తక్కువ చేసి మాట్లాడారని రేవంత్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తాను తక్కువ కులం వాడినంటూ రేవంత్ వ్యాఖ్యానించారు. దీంతో అలాంటి పదాలు వాడొద్దని వారించారు స్పీకర్. సభలో కులమతాలు, భాష గురించి ప్రస్తావన తీసుకురావొద్దని సూచించారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సోమవారం  రూపాయి విలువ పతనంపై ప్రశ్నోత్తరాల సమయంలో రేవంత్‌ రెడ్డికి ప్రశ్న అడిగే అవకాశం లభించింది. ఈ సమయంలో మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు రూపాయి ఐసీయూలో ఉందని చెప్పారని.. ఆ విషయాన్ని ప్రస్తావించే ప్రయత్నం చేశారు రేవంత్. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు స్పీకర్. అసలు ప్రశ్న అడగాలని సూచన చేశారు. ఈ క్రమంలోనే తనను డిస్టబ్ చేయొద్దని కోరారు రేవంత్. రేవంత్ ఆ మాట అనడంపై తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు స్పీకర్. స్పీకర్‌ పట్ల ఎలా వ్యవహరించాలో నేర్చుకోవాలని సూచించారు. ఆపై రేవంత్ తన ప్రశ్న అడిగారు. డాలర్‌తో రూపాయి మారకం విలువ 66 వద్ద ఉన్నప్పుడు, ఐసీయూకి వెళ్లినట్లు అప్పట్లో మోదీ పేర్కొన్నారన్న ప్రకటనను ఉటంకించారు. ఈ లెక్కన ఇప్పుడు రూపాయి 83.20 మారకం వద్ద ఉన్నప్పుడు, అది మార్చురీ వైపు వెళుతున్నట్లు అనిపిస్తుందన్నారు. మార్చురీ నుండి ఆరోగ్యంగా రూపాయిని ఇంటికి తీసుకురావడానికి ప్రభుత్వం వద్ద ఏదైనా కార్యాచరణ ప్రణాళిక ఉందా? ప్రశ్నించారు.

ఈ క్రమంలోనే రేవంత్ ప్రశ్నపై ఆర్థిక మంత్రి నిర్మలా స్పందిస్తూ.. కాంగ్రెస్ సభ్యుడు వీక్ హిందీలో ప్రశ్న అడిగారని.. తన హిందీ కూడా వీకే అని.. అలాంటి వీక్ హిందీలోనే ఆన్సర్ ఇస్తా అన్నారు. అప్పటి మోదీ కామెంట్స్ ఉటంకించే ముందు.. అప్పటి ఆర్థిక సూచీలను కూడా మైండ్‌లో ఉంచుకోవాలన్నారు. ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ పరుగులు పెడుతోందని తెలిపారు. కరోనా వైరస్, రష్యా-ఉక్రెయిన్ వార్ కారణంగా ఇబ్బందులు ఉన్నా భారత్‌ రాణిస్తోందన్నారు. ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థను చూసి పార్లమెంట్‌లో కొందరు అసూయపడుతున్నారని ఆమె అన్నారు.  ఆమె తన హిందీ గురించి మాట్లాడటంపై రేవంత్ మరలా స్పందించారు. ఈ క్రమంలో తాను ‘తక్కువ కులం’ వాడినని.. తనకు స్వచ్చమైన హిందీ రాదని.. వారికి బాగా వస్తుందన్నారు. దీంతో కుల మతాల ప్రస్తావన తీసుకురావొద్దని స్పీకర్ గట్టిగా మందలించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం