
నా అనే వాళ్ళు లేకపోతే అది ఎంతో కష్టమో అనుభవించే వారికే తెలుస్తుంది. ఉండడానికి ఇల్లు లేక.. ఉన్న పెంకుటిల్లు కూలిపోవడంతో, ఇల్లు కట్టుకునే స్థోమత లేక తనకున్న బాత్రూమ్లోనే నివాసం ఉంటుంది ఓ వృద్ధురాలు. సిద్దిపేట జిల్లా జగదేపూర్ మండలం పీర్లపల్లి గ్రామానికి చెందిన శ్రీపతి బాలమ్మ – చంద్రయ్య దంపతులు చిన్న పెంకుటింటిలో నివాసం ఉండే వారు. భర్త చంద్రయ్య 13 సంవత్సరాల క్రితం చనిపోవడంతో బాలమ్మ ఒంటరిదయ్యింది. కూలీ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తుంది. కొన్నేళ్ల క్రితం తనకున్న పెంకుటిల్లు కూడా కూలిపోవడంతో నివాసం ఉండడానికి నిలువ నీడ లేకుండా పోయింది. ఇల్లు కట్టుకొనే స్థోమత లేకపోవడంతో బాత్రూంలోనే జీవనం కొనసాగిస్తూ వస్తుంది.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయినా తనకున్న స్థలంలో ఇల్లు కట్టుకునే స్థోమత కూడా బాలమ్మకు లేకపోయింది. ప్రభుత్వం చొరవ తీసుకుని తనకు ఒక్క చిన్న ఇల్లు కట్టించాలని ఆవేదన వ్యక్తం చేస్తుంది. నిలువ నీడ లేక బాత్రూమ్లో జీవనం కొనసాగిస్తున్న బాలమ్మకు ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించి ఇల్లు నిర్మించి ఇవ్వాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరారు.