
పుణ్యక్షేత్రాల దర్శనానికి వెళ్లినప్పుడు అక్కడ ఆలయాలకు స్థోమత కొద్ది విరాళాలివ్వడం సాధారణం. ధనవంతులైతే లక్షల్లో విరాళిస్తుంటారు. అదే కొన్ని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు అన్నదానం లేదా ఇతర సౌకర్యాల కల్పన కోసం పెద్ద పెద్ద సంస్థలు లేదా, ప్రముఖ వ్యాపార, పారిశ్రామిక వేత్తలు కోట్లలో కూడా విరాళాలు ఇస్తారు. ఉదాహరణకు తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి, ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామివార్లు, శ్రీశైలం వంటి ఆలయాలకు ప్రముఖులు దర్శనాలకు వచ్చినప్పుడు ఆలయ అభివృద్ధి, నిర్వహణ కోసం విరాళాలు ఇస్తూ ఉంటారు. సాధారణంగా పెద్దమొత్తంలో నగదు ఇచ్చినప్పుడు లేదా చెక్కు రూపంలో ఇచ్చినప్పుడు వాటిని ఆలయ అధికారులకు అందజేస్తారు. పేరు తెలియకూడదని ఎవరైనా భావిస్తే నగదు హుండీల్లో వేస్తారు. చాలావరకు చెక్కులను హుండీలో వేయకుండా నేరుగా అధికారులకు అందజేస్తారు. తాజాగా తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అలంపూర్ జోగులాంబ అమ్మవారి ఆలయంలో హుండీ లెక్కింపు చేపట్టిన అధికారులకు ఓ చెక్కు కన్పించింది. అది చూసిన అధికారులు ఒక్కసారిగా అవాక్కయ్యారు.
అలంపూర్ జోగులాంబ అమ్మవారి ఆలయం హుండీ లెక్కిస్తున్న సమయంలో నాణేలను, నోట్లు, ఇతర కానుకలను సిబ్బంది వేరువేరుగా లెక్కించారు. ఈ క్రమంలో వారికి ఓ చెక్కు కనపడింది. దానిపై ‘అక్షరాలా వంద కోట్ల రూపాయలు’ అని రాసి ఉంది. దీంతో సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వందకోట్ల విలువైన చెక్కును హుండీలో చూసి ఆశ్చర్యపోయారు. పైగా దానిపై ఆర్మీ జవాన్ల కోసం అని రాసి ఉంది. ఇంత మొత్తం విరాళంగానా అని అనుమానం వచ్చిన ఆలయ అధికారులు ఆ చెక్కు విషయమై ఆరా తీసారు. దీంతో అసలు విషయం బయటపడింది. ఆ చెక్కు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు ( ఏపీజీవీబీ) వరంగల్ శాఖకు చెందినదిగా గుర్తించారు.
ఆ చెక్కు హుండీలో వేసిన వ్యక్తి ఖాతాలో కేవలం రూ.23 వేల మాత్రమే ఉన్నట్లు తేలింది. మరో షాకింగ్ విషయం ఏంటంటే.. చెక్కు హుండీలో వేసిన సదరు వ్యక్తి అలంపూర్ మండలానికి చెందినవాడిగా గుర్తించారు. ఆ వ్యక్తికి మతిస్థిమితం లేదని తెలిసింది. ఈ ఘటనకు సంబంధించి కోర్టు అలంపూర్ కు చెందిన వ్యక్తిని ఆస్పత్రిలో చేర్చాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. దీంతో పోలీసులు అతడిని హైదరాబాద్లోని ఎర్రగడ్డ ఆసుపత్రిలో చేర్పించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..