హృదయ విదారక ఘటన.. వీధిలో ఏదో వస్తువును పీక్కుతింటున్న కుక్కలు! దగ్గరికెళ్లి చూడగా..
మృత శిశువు తల కుక్కలు పీక్కు తింటున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. దుర్గంధం రావడంతో పరిసర ప్రాంత ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ పసికందు తల భాగం ఎక్కడి నుంచి వచ్చింది..? అనే అంశాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

భద్రాద్రి కొత్తగూడెం, మే 13: ఏ తల్లి కన్నబిడ్డో.. ఏ పేగు బంధమో కానీ.. మృత శిశువు తల కుక్కలు పీక్కు తింటున్న ఘటన చూసి స్థానికులు షాక్ కి గురయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలోని బొల్లోరిగూడెంలో హృదయ విదారక ఘటన కలకలం రేపింది. ఓ పసికందు తల భాగాన్ని కుక్కలు పీక్కు తింటుండగా స్థానికులు గమనించి గట్టిగా అరవడంతో శునకాలు అక్కడి నుంచి పారిపోయాయి. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
పాల్వంచ బొల్లోరిగూడెంలో ఉదయం స్థానికులు భయానక దృశ్యాన్ని చూసి ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. వీధిలో కుక్కలు ఏదో వస్తువును పీక్కు తింటుండటాన్ని గమనించిన ప్రజలు దగ్గరికి వెళ్లి చూడగా అది పసికందు తల భాగమని గుర్తించారు. వెంటనే స్థానికులు కుక్కలను తరిమేయగా అవి అక్కడి నుంచి పారిపోయాయి. ఘటనతో ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దుర్గంధం రావడంతో ఇంటి యజమానులు, కాలనీవాసులు భయాందోళనలకు గురవుతున్నారు. పసికందు అవశేషాలు ఎక్కడి నుంచి వచ్చాయి..? ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు అక్కడ పడేశారా..? లేక మరేదైనా ఘటన జరిగిందా..? అనే కోణాల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఆధారాలు సేకరిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.




