పెగడపల్లి, ఏప్రిల్ 2: పరీక్షల్లో ఫెయిల్ అయ్యానని మనస్తాపం చెందిన ఓ విద్యార్ధిని నిండు జీవితానికి ముగింపు పలికింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన తెలంగాణలోని కరీంనగర్లో చోటు చేసుకుంది. తల్లిదండ్రులు, ఎస్సై రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం..
కరీంనగర్ పెగడపల్లి మండలంలోని మద్దులపల్లి గ్రామనికి చెందిన డిగ్రీ విద్యార్థిని పూసల వైష్ణవి (20) స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు కాలేజీలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలో వైష్ణవి రెండు, మూడో సెమిస్టర్ పరీక్షల్లో రెండు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైంది. ఆదివారం రాత్రి ఇంట్లో ఎవరూలేని సమయంలో పురుగుల మందు ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు గమనించి హుటాహుటీన జగిత్యాల ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే వైష్ణవి మృతి చెందింది. దీంతో తల్లీదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతురాలి తండ్రి రాజేశం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసకుని దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు.
పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లిన ఓ రైతు విద్యుదాఘాతంతో మృతి చెందిన ఘటన లింగాపూర్లో సోమవారం (ఏప్రిల్ 1) చోటు చేసుకుంది. సీఐ రాజ్కుమార్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పిట్టల సంపత్ (36) అనే రైతుకు 20 గుంటల పొలం ఉంది. దీనితోపాటు మరో 2 ఎకరాల పొలం కౌలుకు తీసుకొని వరి సాగు చేస్తున్నాడు. ఈ క్రమంలో రెండు రోజులుగా పొలానికి నీరు పెట్టే విద్యుత్తు మోటారు సరిగ్గా పనిచేయడం లేదు. దీంతో స్వీచ్ బోర్డు వద్దకు వెళ్లి ఆఫ్ చేస్తున్న క్రమంలో విద్యుదాఘాతానికి గురయ్యాడు. కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా సంపత్ మార్గం మధ్యంలోనే మరణించాడు. సంపత్ భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.