CPI Narayana Comments: తెలంగాణ మంత్రి ప్రశాంత్రెడ్డిపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. లంకలో పుట్టినోల్లంతా రాక్షసులే అన్న తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి నాలుక కోయాలి అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసే ఎవరివైనా సరే ఊరుకునేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణానది నీళ్ల విషయంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి కూర్చుంటే సమస్య పరిష్కారమవుతుంది తప్ప ఒకరినొకరు తిట్టుకుంటే నీళ్లు రావు అని అన్నారు. హుజూర్ నగర్ ఉపఎన్నికల్లో గెలవడానికి కేసీఆర్ ఆంధ్రావాళ్ళని తిట్టే ఎత్తుగడ వేస్తాడని, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాత్రిపూట రహస్యంగా మాట్లాడుకుంటారు తప్ప ఇలాంటి నీళ్ల సమస్యల్లో కలిసి పగలు కూర్చుని మాట్లాడుకోరు అని ఆరోపించారు.
దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక శక్తులతో కలిసి సీపీఐ పని చేస్తోందని, ఉత్తరప్రదేశ్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలో బీజేపీ ఓడిపోయింది. 2024లో పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. రాష్ట్రపతి అభ్యర్థిగా శరద్ పవార్ నిలబడుతున్నారు. బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ కలిసి రాష్ట్రపతిగా శరద్ పవార్ ని గెలిపిస్తే బీజేపీ పతనం ప్రారంభమయినట్టే.. అంటూ విమర్శించారు. పెట్రోల్, డీజిల్ ని కేంద్రం జీఎస్టీ పరిధిలో ఎందుకు కలపడం లేదని ప్రశ్నించారు. దేశంలో పెట్రోల్, డీజిల్ పై పన్నులు ఎత్తేస్తే కేవలం లీటర్ 40 రూపాయలకు వస్తుందని, వెనిజులా, ఇరాన్ ఇరాన్ నుంచి పైప్ లైన్ వేసి పెట్రోల్ భారతదేశానికి తెచుకోవచ్చని, కానీ అమెరికా ఒత్తిడితో మాత్రమే వారి దగ్గర కొనుగోలు చేయడం లేదని నారాయణ ఆరోపించారు. జమ్మూ కశ్మీర్లోని భూముల్ని రిలయన్స్ లాంటి సంస్థలకు దోచి పెట్టడానికి ఆర్టికల్ 371ని ఎత్తేశారని, జమ్మూకాశ్మీర్ మీద ప్రేమతో ఆర్టికల్ 371ను ఎత్తేయలేదని అన్నారు.