Adilabad: ప్రారంభమైన పత్తి కొనుగోలు.. క్వింటాకు ఎంత ధర నిర్ణయించారంటే
ఆదిలాబాద్ మార్కెట్లో పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. 8నుంచి 12శాతం తేమ ఉన్న పత్తిని కొనుగోలు చేస్తున్నారు వ్యాపారులు. తేమ శాతంపై రైతుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డీటేల్స్ తెలుసుకుందాం పదండి..
పత్తి కొనుగోళ్లపై తెలంగాణలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఆదిలాబాద్ పత్తి కొనుగోలు మార్కెట్లో 24 గంటల తర్వాత ఎట్టకేలకు కాటన్ కొనుగోలు ప్రారంభమైంది. క్వింటాల్కు 6వేల 840 రూపాయల ధర నిర్ణయించి.. వ్యాపారులు పత్తి కొనుగోళ్లు ప్రారంభించారు. తొలి రోజు పత్తి అమ్మకాల్లో ప్రతిష్టంభనతో సోమవారం నుండి నిరవధికంగా పత్తి కొనుగోళ్లు చేపడుతామన్నారు అధికారులు. పత్తి రైతులకు పలు సూచనలు చేశారు.
ప్రైవేట్ వ్యాపారులు, అధికారులు కుమ్మక్కై రైతులను నిలువునా ముంచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతులు. తేమ శాతం 8నుంచి 12 శాతం ఉన్న కాటన్ మాత్రమే కొనుగోలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రెండు రోజుల క్రితం లోడ్ చేసిన ట్రాక్టర్లలో తేమ శాతం కనీసం 18శాతం వరకూ మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నారు.
పత్తి కొనుగోళ్లు, రైతులు ఇబ్బందులపై మాజీ మంత్రి కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ స్పందించారు. తెల్ల బంగారం తెల్లబోతుందన్నారు. బోనస్ మాట దేవుడెరుగు..మద్దతు ధరకే దిక్కులేదన్నారు. పత్తి రైతు దళారుల చేతిలో చిత్తవుతున్నాడని.. సీసీఐ కొర్రీలు పెట్టి కొనుగోళ్లు నిలిపివేసిందని ప్రభుత్వంపై మండిపడ్డారు. రైతన్న ఆగమైతుంటే ప్రభుత్వం పత్తా లేదు.పత్తి కొనుగోలుపై ప్రభుత్వానికి శ్రద్ధ లేదని విమర్శించారు కేటీఆర్. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్న బుద్ధి లేదన్నారు.
ఏపీలోని కర్నూలు మార్కెట్కు పోటెత్తిన ఉల్లి
కర్నూలు వ్యయసాయ మార్కెట్కు ఉల్లి పంట పోటెత్తింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఈ ఏడాది ఉల్లి దిగుబడి గణనీయంగా పెరిగింది. కర్నూలు జిల్లాలో దాదాపు 25 వేల హెక్టార్లలో ఉల్లి సాగు చేశారు రైతులు. ఎక్కువ రోజులు పొలంలో ఉంచితే పంట కుళ్లిపోతుంది. ఆలస్యమైతే ధర పతనమవుతుంది. దీంతో రైతులు వాహనాల్లో ఉల్లిని మార్కెట్కు తరలించారు. ఉల్లి లోడ్తో ఉన్న వాహనాలు వ్యవసాయ మార్కెట్ నుంచి కొత్త బస్టాండ్ వరకు క్యూలో పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది.
క్వింటాల్ ఉల్లి ధర గరిష్టంగా 4వేల 6వందల 39 రూపాయలు ఉండగా.. మధ్య ధర 3 వేల 888 రూపాయలుగా ఉంది. ఇతర మార్కెట్ లలో కూడా ఇదే ధర పలుకుతుండటంతో రైతులు కర్నూలు లోనే విక్రయిస్తున్నారు.