
లోక్సభ ఎన్నికలకు సంబంధించి తెలంగాణలో ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థులను దశల వారీగా ప్రకటిస్తున్నాయి. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు 17 స్థానాలకు అభ్యర్థులను డిక్లేర్ చేయగా.. అధికార కాంగ్రెస్ ఆచితూచి వ్యవహరిస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించడమే లక్ష్యంగా టీ.కాంగ్రెస్ దూకుడు పెంచుతోంది. దశలవారీగా అభ్యర్థులను ప్రకటిస్తూ కనీసం 14 స్థానాల్లోనైనా జెండా ఎగరేయాలని వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 8 జాబితాలు విడుదల చేసిన కాంగ్రెస్.. తెలంగాణకు సంబంధించి 13 స్థానాల్లో క్యాండేట్లను ప్రకటించింది. మరో నాలుగు స్థానాల్లో అభ్యర్థుల ప్రకటన పెండింగ్ పడుతూ వస్తోంది. హైదరాబాద్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. ఈ నాలుగు స్థానాల్లోనూ పోటీ ఎక్కువగా ఉండడంతో అధిష్టానంతో చర్చించి పేర్లు ఖరారు చేసేందుకు టీ.కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలోనే.. తెలంగాణలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్ఛార్జులను నియమించింది టీ.కాంగ్రెస్. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీ ఆదేశాల మేరకు పార్లమెంట్ నియోజకవర్గాలకు మంత్రులు, సీనియర్ నేతలను ఇన్ఛార్జ్లుగా నియమిస్తూ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిండెంట్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాలు జారీ చేశారు.
ఇదిలావుంటే.. తెలంగాణకు సంబంధించి మూడు జాబితాలు రిలీజ్ కాగా.. ఫస్ట్ లిస్ట్లో నలుగురు, సెకండ్ లిస్టులో ఐదుగురు, మరోలిస్టులో నలుగురు మొత్తం.. 13 మంది పేర్లను ప్రకటించింది కాంగ్రెస్.
మహబూబ్నగర్- వంశీచంద్రెడ్డి, జహీరాబాద్- సురేశ్షెట్కార్, మహబూబాబాద్- బలరామ్నాయక్, నల్గొండ- కుందూరు రఘువీర్రెడ్డి, మల్కాజ్గిరి- సునీతా మహేందర్రెడ్డి, సికింద్రాబాద్- దానం నాగేందర్, చేవెళ్ల- రంజిత్రెడ్డి, నాగర్కర్నూల్- మల్లు రవి, పెద్దపల్లి- గడ్డం వంశీకృష్ణ, ఆదిలాబాద్- ఆత్రం సుగుణ, నిజామాబాద్- తాటిపర్తి జీవన్రెడ్డి, మెదక్- నీలం మధు, భువనగిరి- చామల కిరణ్కుమార్రెడ్డి పేర్లను ఫైనల్ చేశారు.
మొత్తంగా… పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా టీ.కాంగ్రెస్ దూసుకెళ్తోంది. దానిలో భాగంగా.. దశల వారీగా అభ్యర్థులను ప్రకటిస్తున్న కాంగ్రెస్.. తాజాగా.. 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు మంత్రులు, సీనియర్ నేతలను ఇన్ఛార్జులుగా నియమించింది. అయితే.. పోటీ ఎక్కువగా ఉండడంతో పెండింగ్లోనున్న వరంగల్, కరీంనగర్, హైదరాబాద్, ఖమ్మం ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తుందో చూడాలి.
ఇదిలాఉంటే.. ఢిల్లీలో ఇవాళ కాంగ్రెస్ సీఈసీ సమావేశం జరగనుంది. కాంగ్రెస్ సీఈసీ సమావేశానికి రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరుకానున్నారు. పెండింగ్ లో ఉన్న నాలుగు పార్లమెంట్ స్థానాలను ఇవాళ ఫైనల్ చేయనున్నారు. పెండింగ్లో ఖమ్మం, వరంగల్, కరీంనగర్,హైదరాబాద్ ఉన్నాయి. ఈ స్థానాలకు సాయంత్రం లోగా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది..
ఇదిలాఉంటే.. సికింద్రాబాద్ స్థానంలో అభ్యర్థిని మార్చనున్నట్లు సమాచారం.. ఇప్పటికే దానం నాగేందర్ ను అభ్యర్థిగా ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానం.. తాజా పరిణామాల నేపథ్యంలో అభ్యర్థిని మార్చనున్నట్లు ప్రచారం జరుగుతోంది. సాయంత్రంలోగా దీనిపై స్పష్టత రానుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..