‘ఇసుకలో పేకమేడలు కట్టారా.. కేసీఆర్ కోసం హెలికాప్టర్ సిద్దం’: సీఎం రేవంత్

|

Feb 13, 2024 | 11:11 AM

ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును రీ-డిజైన్ పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చి అంచనాలు పెంచారని బీఆర్ఎస్ నేతలను సీఎం రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. సుమారు రూ. 38,500 కోట్లతో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు అంచనా.. ఇప్పటికి లక్షా 47వేల కోట్లకు చేరిందని.. భవిష్యత్తులో పూర్తి చేయాలంటే..

ఇసుకలో పేకమేడలు కట్టారా.. కేసీఆర్ కోసం హెలికాప్టర్ సిద్దం: సీఎం రేవంత్
Cm Revanth Reddy
Follow us on

ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును రీ-డిజైన్ పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చి అంచనాలు పెంచారని బీఆర్ఎస్ నేతలను సీఎం రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. సుమారు రూ. 38,500 కోట్లతో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు అంచనా.. ఇప్పటికి లక్షా 47వేల కోట్లకు చేరిందని.. భవిష్యత్తులో పూర్తి చేయాలంటే ఎంత ఖర్చు అవుతుందో చెప్పలేని పరిస్థితి ఏర్పడని అన్నారు సీఎం రేవంత్. ఇలా రూ. వేల కోట్లు ఖర్చు పెట్టి ప్రాజెక్ట్ కడితే.. కుంగిపోయిందని అన్నారు. ఇసుకలో పేకమేడలు కట్టారా అంటూ ప్రశ్నించారాయన. మేడిగడ్డ వెళ్లాక విజిలెన్స్ నివేదికను సభ్యులకు అందజేసి.. సభలో రెండు రోజుల్లో శ్వేతపత్రం విడుదల చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి.

కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించేందుకు మాజీ సీఎం, ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ రావాలని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మరోసారి కోరారు. ‘అందరం కలిసి వెళ్దామని బస్సులను సిద్దం చేశాం. కేసీఆర్ గారికి బస్సులో అంతదూరం ప్రయాణించడం ఇబ్బందిగా ఉంటే.. ఆయన కోసం బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో ప్రభుత్వ హెలికాప్టర్ సిద్దంగా ఉంది. తాజ్‌మహల్‌ అంతటి అద్భుతాన్ని.. కేసీఆర్‌ మేడిగడ్డలో ఆవిష్కరించారు. ఆ అద్భుతాన్ని కేసీఆర్‌ అక్కడికి వచ్చి వివరిస్తే బాగుంటుంది? అలాగే మేడిగడ్డకు రావాలంటూ హరీష్‌ రావును కూడా ఆహ్వానిస్తున్నాం’ అని సీఎం అన్నారు.

శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు..

మేడిగడ్డ సందర్శనకు శాసనసభ్యులందరూ రావాలని మంత్రి శ్రీధర్ బాబు అసెంబ్లీలో కోరారు. మేడిగడ్డలో ఏం జరిగిందో ప్రజలకు తెలియాలన్నారు. అన్ని పార్టీల సభ్యులకు ప్రాజెక్టును చూపించాలని నిర్ణయించామన్నారు. మేడిగడ్డపై విజిలెన్స్ నివేదిక వచ్చిందని తెలిపారు. బ్యారేజ్ నిర్మాణం, లోపాలు, అనేక అంశాలను విజిలెన్స్ అధికారులు తమ నివేదికలో వెల్లడించారన్నారు. గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్ల డబ్బు దుర్వినియోగం జరిగిందని శ్రీధర్ బాబు మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో కట్టిన ప్రాజెక్టులకు ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదని ఆయన గుర్తు చేశారు. అయితే శ్రీధర్ బాబు చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కాగా, స్పీకర్ సభను రేపటికి వాయిదా వేశారు.

బస్సుల్లో కాళేశ్వరానికి సీఎం బృందం..

మేడిగడ్డ సందర్శనకు సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రత్యేక బస్సుల్లో బయల్దేరారు. ఎంఐఎం సభ్యులు వీరి వెంట ఉన్నారు. ఈ పర్యటనకు బీఆర్ఎస్, బీజేపీ సభ్యులు దూరంగా ఉన్నారు. రోడ్డు మార్గాన మధ్యాహ్నం 3:30 గంటలకు చేరుకునే అవకాశం ఉంది. సీఎం రేవంత్, రాష్ట్ర మంత్రుల పర్యటన నేపధ్యంలో ప్రాజెక్టు సమీపాన పోలీసులు భద్రతను పటిష్టం చేశారు. సాయంత్రం 5-6 గంటల మధ్య పవర్ పాయింట్ ప్రెజెంటేషన్, ఆ తర్వాత సీఎం రేవంత్‌, మంత్రుల మీడియా సమావేశం ఉండనున్నాయి. ఇక రాత్రి 7 గంటలకు తిరిగి హైదరాబాద్ బయల్దేరనున్నారు సీఎం బృందం.