
సన్ రైజర్స్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్రావు అరెస్ట్ అయ్యారు. జగన్మోహన్ రావుతోపాటు హెచ్సీఏ సభ్యులను సీఐడీ అరెస్ట్ చేసింది. ఐపీఎల్ టికెట్ల వివాదంలో విజిలెన్స్ నివేదిక ఆధారంగా సీఐడీ వారిని అరెస్ట్ చేసింది.హెచ్సీఏ ప్రెసిడెంట్ హోదాలో సన్ రైజర్స్ను జగన్మోహన్ రావు బెదిరించారని.. 20శాతం ఫ్రీగా టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో ఐపీఎల్ మ్యాచ్లో వీఐపీ గ్యాలరీకి తాళాలు వేయడంపై సీరియస్ అయిన ప్రభుత్వం.. విచారణకు ఆదేశించింది.
గత ఐపీఎల్ సీజన్లో ఎస్ఆర్హెచ్ – హెచ్సీఏ మధ్య టికెట్ల వివాదం నెలకొంది. ఎస్ఆర్హెచ్ 10శాతం టికెట్లు ఫ్రీగా ఇస్తామని చెప్పినప్పటికీ.. జగన్మోహన్ రావు 20శాతం ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే దీనికి ఎస్ఆర్హెచ్ యాజమాన్యం ఒప్పుకోలేదు. దీంతో తమకు అడిగినన్ని టికెట్లు ఇవ్వలేదంటూ వీఐపీ గ్యాలరీకి హెచ్సీఏ ప్రతినిధులు తాళం వేశారు. దీనిపై సన్రైజర్స్ మేనేజ్మెంట్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. హెచ్సీఏ తీరు మారకపోతే హైదరాబాద్ వదిలి వెళ్లిపోతామని హెచ్చరించింది. ఈ అంశంపై తీవ్రంగా స్పందించిన ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది.
విజిలెన్స్ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. టికెట్ల విషయంలో సన్రైజర్స్పై హెచ్సీఏ ఒత్తిడి తీసుకొచ్చిందని.. 20శాతం టికెట్లు ఇవ్వాలని బెదిరింపులకు గురిచేసిందని విజిలెన్స్ కమిటీ నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక ఆధారంగా సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ నేపథ్యంలోనే హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావుతో పాటు పలువురిని అరెస్ట్ చేసింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.