
హైదరాబాద్, ఆగస్టు 14: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన భూముల వేలాన్ని అడ్డుకుంటామని పిలుపునిచ్చారు కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఆసైన్డ్ భూముల వేలం అత్యంత బాధ్యతారాహిత్యమని, కేవలం ఆదాయ సమీకరణ కోసం చేపట్టిన భూములను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. సోమవారం హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి బీఆర్ఎస్పై ధ్వజమెత్తారు. రాబోయే ఎన్నికలకు నిధుల సమీకరణలో భాగంగానే బీజేపీ ప్రభుత్వం భూములను విచక్షణ రహితంగా విక్రయిస్తోందని కిషన్ రెడ్డి ఆరోపించారు.
బడుగు, బలహీన వర్గాలకు కేటాయింటిచ అసైన్డ్ భూములను సైతం బీఆర్ఎస్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ లావాదేవీల కోసం లాక్కొంటోందని అంటూ దుయ్యబట్టారు. భూముల వేలం పాటతో ఇప్పటికే రూ. 7000 కోట్లు సంపాదించుకున్నారన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కై భూములు పంచుకుంటున్నాయని కిషన్ రెడ్డి ఆరోపించారు. ప్రజలకు ఉపయోగపడే సైన్స్ సిటీకి భూమి ఇవ్వమంటే ఇవ్వడం లేదని, కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కోసం 10 ఎకరాలు భూమి ఇచ్చారని విమర్శించారు. వైఎస్ హయాంలో భూములు అమ్మితే విమర్శించిన మంత్రి కేటీఆర్, అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్లే భూములు అమ్ముతున్నారని విమర్శించారు.
భవిష్యత్ తరాలకు ఉపయోగపడాల్సిన భూములను అమ్ముకుంటూ పోవడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణను అప్పుల కుప్పగా మారుస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ ఆస్తులను అమ్మడం అంటే, రాష్ట్రాన్ని అమ్మడమేనని అభివర్ణించారు. సంపదను సృష్టించకుండా, ఆస్తులను అమ్ముకుంటూ పోతే వ్యవస్థలన్నీ కుప్పకూలుతాయని అన్నారు. ఇలా భూములు అమ్ముకోవడం కోసమే ముఖ్యమంత్రి 80 వేల పుస్తకాలు చదివారా? అన్నారు.
ప్రభుత్వ పాఠశాలలకు భూమలు ఇవ్వాలని ఎన్నో రోజులుగా డిమాండ్ చేస్తుంటే అందుకు సమాధానం ఇవ్వట్లేదు అని అన్నారు. భూములు అమ్ముకుంటూ పోతే ఎకరం కూడా మిగలదు అని విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలోకి వచ్చాక మరో మాట మాట్లాడం దారుణం అన్నారు. దేశంలోనే నెంబర్ వన్ అని చెప్పుకునే కేసీఆర్ భూములను ఎందుకు అమ్ముతున్నారని ప్రశ్నించారు. రైల్వే టెర్మినల్స్కు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వడం లేదని విమర్శించారు. సైనిక్ స్కూ్ల్ ఏర్పాటు చేస్తామంటే ఈ ప్రభుత్వం ముందుకు రాలేదని విమర్శించారు. ట్రైబల్ మ్యూజియం ఏర్పాటుకు భూములు కేటాయించామని అడిగితే ఆరేళ్ల తర్వాత అర ఎకరం స్థలం ఇచ్చారన్నారు. వ్యాపారస్తులకు ప్రభుత్వ భూములను కట్టబెట్టే ప్రయత్నం చేస్తోందని కిషన్ రెడ్డి ఆరోపించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..