
TS Lockdown: తెలంగాణ ప్రభుత్వం విధించిన లాక్డౌన్ రేపటితో ముగియనంది. మరోవైపు కరోనా కేసులు, లాక్ డౌన్ పై మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం కానుంది. అయితే తెలంగాణలో మరికొన్ని రోజులు లాక్డౌన్ పొడగించే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం తెలంగాణలో కరోనా పరిస్థితులు అదుపులోనే ఉన్నప్పటికీ మరికొన్ని రోజులు లాక్డౌన్ పొడగిస్తేనే మంచిదని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం కూడా లాక్ డౌన్ పొడగింపు పై సూచనలు చేయడంతో కేసీఆర్ సర్కార్ ఆ దిశగా నిర్ణయం తీసుకోనుంది.
ఇప్పటికే వ్యవసాయశాఖపై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రైతు బంధు సాయం జూన్ 15 నుంచి ప్రాంభించనున్నట్లు తెలిపారు. జూన్ 15 నుంచి 25 వరకు రైతుల అకౌంట్లలో జమ చేయనున్నారు. నాణ్యమైన విత్తనాలను రైతులకు అందుబాటులోకి తేవాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. కల్తీ విత్తనాల మీద ఉక్కుపాదం మోపాలన్నారు. జిల్లాల వ్యాప్తంగా కల్తీ విత్తన తయారీదారుల మీద దాడులు జరపాలని.. కల్తీ విత్తనదారులను వలవేసి పట్టుకోవాలని, ఎంతటి వారినైనా పీడీ యాక్టుకింద అరెస్టు చేసి చట్టబపరమైన చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
చిత్తశుద్దితో పనిచేసి కల్తీ విత్తన విక్రయ ముఠాలను పట్టుకున్న వ్యవసాయ శాఖ, పోలీసు శాఖ, అధికారులను గుర్తించి వారికి ఆక్సిలరీ ప్రమోషన్, రాయితీలతో పాటు ప్రభుత్వం సేవా పతకం అందచేస్తుందని సీఎం స్పష్టం చేశారు. ఈ సమావేశంలో చర్చించిన అంశాలపై కేబినెట్ భేటీలో తుది నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈ సమావేశంలో లాక్డౌన్ సహా ప్రస్తుతం రాష్ట్రంలో వ్యవసాయం పరిస్థితి, కొనసాగుతున్న ధాన్యం సేకరణ, విత్తనాలు, ఎరువుల లభ్యత, కల్తీ విత్తనాల నిరోధానికి చర్యలు తదితర అంశాలపై చర్చించనున్నారు. ఈ భేటీలో మంత్రులతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఇతర అధికారులు కూడా పాల్గొననున్నారు.