AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Boggula Srinivas: బొగ్గుల శ్రీనివాస్‌ది హత్యే.. కేసును చేధించిన పోలీసులు

రోడ్డు ప్రమాదంగా కనిపించిన ప్రముఖ రచయిత, యూట్యూబర్ బొగ్గుల శ్రీనివాస్ మృతి కేసు సంచలన మలుపు తీసుకుంది. ఆర్థిక లావాదేవీల వివాదం నేపథ్యంలో స్నేహితుడే రూ.5 లక్షల సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లు పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. పాలేరు రిజర్వాయర్‌లో కారుతో పాటు మృతదేహాన్ని పడేసి ప్రమాదంలా చిత్రీకరించిన కుట్రను టెక్నికల్ ఆధారాలతో పోలీసులు ఛేదించారు.

Boggula Srinivas: బొగ్గుల శ్రీనివాస్‌ది హత్యే.. కేసును చేధించిన పోలీసులు
Boggula Srinivas
N Narayana Rao
| Edited By: |

Updated on: Feb 22, 2026 | 2:43 PM

Share

ప్రముఖ రచయిత, యూట్యూబర్ బొగ్గుల శ్రీనివాస్ హత్య కేసులో మిస్టరీ వీడింది. ఇది రోడ్డు ప్రమాదం కాదని, ఆర్థిక లావాదేవీల వివాదం నేపథ్యంలో జరిగిన సుపారీ హత్య అని పోలీసులు స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు వద్ద జరిగిన కారు ప్రమాదంలో శ్రీనివాస్ మృతి చెందారు. అయితే కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి నాలుగు స్పెషల్ టీమ్స్‌తో దర్యాప్తు చేపట్టారు. ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏసీపీ తిరుపతి రెడ్డి వివరాలు వెల్లడించారు. శ్రీనివాస్‌కు “బొగ్గుల BBQ” పేరుతో జీఎస్టీ లైసెన్స్ ఉంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు వేణు మాధవ్ రెడ్డి, శ్రీనివాస్ ఇద్దరూ సిల్వర్ జూబ్లీ కాలేజీలో చదువుకున్నారు. పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో మళ్లీ పరిచయం ఏర్పడింది. వేణు మాధవ్ రెడ్డి ‘మేకా ప్రాజెక్ట్స్’ అనే కంపెనీ స్థాపించి సబ్ కాంట్రాక్టర్‌గా పని చేస్తున్నాడు. శ్రీనివాస్‌కు ఉన్న జీఎస్టీ లైసెన్స్‌ను ఉపయోగించి ఫేక్ ఇన్వాయిసులు, సేల్స్ ఫైల్ చేసి లాభాలు పొందవచ్చని వేణు మాధవ్ సూచించినట్లు పోలీసులు తెలిపారు. తన లైసెన్స్ వినియోగానికి 50 శాతం లాభం ఇవ్వాలని శ్రీనివాస్ కోరాడు. 2022 నుంచి 2025 వరకు జీఎస్టీ ఫైలింగ్ ద్వారా సుమారు రూ.90 లక్షల లాభం వచ్చినట్లు గుర్తించారు. లాభాల పంపకం విషయంలో ఇద్దరి మధ్య వివాదం చెలరేగింది. ఇదే సమయంలో జీఎస్టీ మోసానికి సంబంధించి శ్రీనివాస్‌కు నోటీసులు రావడంతో వివాదం మరింత తీవ్రమైంది.

తనకు ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తానని నమ్మించి శ్రీనివాస్‌ను హైదరాబాద్ నుంచి కారులో తీసుకెళ్లారు. నకిరేకల్ – జనగామ మార్గంలో కత్తులు, ఐరన్ రాడ్లతో దాడి చేసి హత్య చేశారు. అనంతరం పాలేరు రిజర్వాయర్‌లో కారుతో పాటు శ్రీనివాస్‌ను పడేసి రోడ్డు ప్రమాదంలా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఫోన్ సిగ్నల్స్, సాంకేతిక ఆధారాలతో పోలీసులు కేసును ఛేదించారు. ప్రధాన నిందితుడు వేణు మాధవ్ రెడ్డి సుపారీ గ్యాంగ్‌కు రూ.5 లక్షలు ఇచ్చి హత్య చేయించినట్లు తేలింది. ఈ కేసులో వేణు మాధవ్ రెడ్డి, కోటేశ్వరరావు, షేక్ హఫీజ్, అజ్మత్ అలీని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ హత్య వెనుక ఎలాంటి రాజకీయ కారణాలు లేవని, కేవలం ఆర్థిక లావాదేవీల వివాదమే కారణమని ఏసీపీ స్పష్టం చేశారు.

Also Read: గృహలక్ష్మి లబ్ధిదారులకు తీపి కబురు చెప్పిన రేవంత్ సర్కార్.. 

Follow Us