AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆపరేషన్‌ సింధూర్‌ తర్వాత టెర్రర్‌ స్లీపర్‌ సెల్స్‌ యాక్టీవ్‌ కాబోతున్నాయా..? ఏపీ, తెలంగాణ అలెర్ట్‌

భారత్-పాకిస్తాన్‌ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న నేపథ్యంలో ఏపీ, తెలంగాణ అలెర్ట్‌ అయ్యాయి. రాబోయే ఎలాంటి పరిస్థితులైనా తట్టుకునేలా అన్ని శాఖల అధికారులను సన్నద్ధం చేస్తున్నాయి. అందులోనూ.. గత అనుభవాల దృష్యా హైదరాబాద్‌లోని స్లీపర్‌ సెల్స్‌ యాక్టీవ్‌పై తెలగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్పెషల్‌ ఫోకస్‌ పెట్టడం ఆసక్తి రేపుతోంది.

ఆపరేషన్‌ సింధూర్‌ తర్వాత టెర్రర్‌ స్లీపర్‌ సెల్స్‌ యాక్టీవ్‌ కాబోతున్నాయా..? ఏపీ, తెలంగాణ అలెర్ట్‌
High Security
Follow us
Balaraju Goud

|

Updated on: May 07, 2025 | 11:06 PM

ఆపరేషన్‌ సింధూర్‌ తర్వాత టెర్రర్‌ స్లీపర్‌ సెల్స్‌ యాక్టీవ్‌ కాబోతున్నాయా? నిఘా వర్గాల హెచ్చరికలతో స్లీపర్‌ సెల్స్‌పై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాయా? గత అనుభవాల దృష్ట్యా స్లీపర్‌ సెల్స్‌పై హైదరాబాద్‌ పోలీసు యంత్రాంగం డేగ కన్నేస్తోంది. మిస్‌ వరల్డ్‌ పోటీలు.. యుద్ధ సంకేతాలతో భాగ్యనగరం పోలీసులను ముఖ్యమంత్రి రేవంత్‌ అలెర్ట్‌ చేశారు. ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేలా తెలుగు రాష్ట్రాలు సన్నద్ధమవుతున్నాయి

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత దేశంలో మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు ఇప్పటికే హెచ్చరికల జారీ చేశాయి. దాంతో.. కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమై.. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా భద్రత కట్టుదిట్టం చేయాలని, బలగాలు అప్రమత్తంగా ఆదేశించింది. ఈ క్రమంలోనే.. దేశంలో అలెర్ట్‌ కొనసాగుతోంది. పహల్గామ్‌లో ముష్కర కర్కశకాండ వెనుక లోకల్‌ స్లీపర్‌సెల్స్‌ హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. స్లీపర్‌ సెల్స్‌ హెల్ప్‌ లేకుండా ఇలాంటి దాడి చేయడం అసాధ్యమని భద్రతా వర్గాలు కూడా భావిస్తున్నాయి.

అందుకు అనుగుణంగానే.. ఉగ్రవాదులు.. వారికి సహకరించినవారి ఇళ్లపై భారత ఆర్మీ ఇప్పటికే ఉక్కుపాదం మోపింది. ఇప్పుడు ఏకంగా.. ఆపరేషన్‌ సింధూర్‌తో POKలోని ఐదు ఉగ్ర స్థావరాలతోపాటు పాకిస్తాన్‌లోని నాలుగు టెర్రర్‌ క్యాంపులపై ఎయిర్‌ స్ట్రైక్‌ చేసి పాక్‌ ఉగ్రమూకల పీచమణిచింది. అయితే, గతంలో దేశంలో ఎక్కడ ఉగ్ర కుట్రలు బయటపడ్డా వాటికి సంబంధించిన లింకులు హైదరాబాద్‌లోని స్లీపర్‌ సెల్స్‌కు కనెక్ట్‌ అయిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది.

ఒకవైపు మిస్‌ వరల్డ్‌ పోటీలు.. మరోవైపు వార్‌ ఇండికేషన్స్‌తో హైదరాబాద్‌పై తెలంగాణ ప్రభుత్వం స్పెషల్‌ ఫోకస్‌ పెట్టింది. ఆపరేషన్ సింధూర్, అనంతర పరిణామాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క సమీక్ష చేశారు. తెలంగాణలో భద్రత కట్టుదిట్టం చెయ్యాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ప్రధానంగా.. ఎయిర్‌పోర్ట్‌లు, విదేశీ రాయబార కార్యాలయాల దగ్గర భద్రత పెంచాలన్నారు. హైదరాబాద్ సహా తెలంగాణ అంతటా నిఘా వ్యవస్థ పటిష్టానికి ఆదేశించారు. కేంద్ర రక్షణ రంగ సంస్థల దగ్గర మరింత భద్రత పెంచాలన్నారు. తెలంగాణ పర్యటనకు వచ్చిన టూరిస్టులకు తగిన రక్షణ కల్పించాలని స్పష్టం చేశారు.

అలాగే.. అత్యవసర పరిస్థితి ఎదురైతే నిత్యావసరాలకు ఇబ్బంది లేకుండా ఆహార నిల్వలు తగినంత ఉండేలా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. డెడికేటెడ్ మానిటరింగ్‌తో ఎప్పటికప్పుడు రిపోర్ట్‌లు ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. తక్షణ నిర్ణయాలకు వీలుగా 24/7 అందుబాటులో అందుబాటులో ఉంటామని సీఎం, డిప్యూటీ సీఎం తెలిపారు. అటు.. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో నిఘా వ్యవస్థ పనితీరును సీఎం రేవంత్‌రెడ్డి పరిశీలించారు. హైదరాబాద్ నగరంలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలన్నారు.

మరోవైపు.. ఆపరేషన్ సింధూర్ తర్వాత పరిస్థితులు, సన్నద్ధతపై అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని వివిధ శాఖల ఉన్నతాధికారులకు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా.. విశాఖలోని తూర్పు నౌకాదళ కమాండ్ పరిధితో పాటు ఏపీలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న కీలకమైన రక్షణ రంగ సంస్థల దగ్గర భద్రత, తీరప్రాంత రక్షణపైనా చర్చించారు. ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కునేలా అన్ని స్థాయిల్లోనూ అధికారులు, సంస్థలు సిద్ధంగా ఉండాలన్నారు. ప్రభుత్వాల సన్నద్ధతపై కేంద్రం చేసిన సూచనలను పూర్తిగా అమలు చేయాలని.. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ముఖ్యంగా తీర ప్రాంత జిల్లాల్లో భద్రతపై ప్రధానంగా దృష్టి పెట్టాలని మెరైన్ పోలీసులను ఆదేశించారు. నౌకాదళం, కోస్ట్‌గార్డు ఇతర రక్షణ దళాలతో సమాచారం పంచుకోవాలన్నారు. తిరుమల లాంటి ప్రదేశాల్లో ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.

మొత్తంగా.. భారత్-పాకిస్తాన్‌ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న నేపథ్యంలో ఏపీ, తెలంగాణ అలెర్ట్‌ అయ్యాయి. రాబోయే ఎలాంటి పరిస్థితులైనా తట్టుకునేలా అన్ని శాఖల అధికారులను సన్నద్ధం చేస్తున్నాయి. అందులోనూ.. గత అనుభవాల దృష్యా హైదరాబాద్‌లోని స్లీపర్‌ సెల్స్‌ యాక్టీవ్‌పై రేవంత్‌ సర్కార్‌ స్పెషల్‌ ఫోకస్‌ పెట్టడం ఆసక్తి రేపుతోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..