Telangana: అన్నదాతకు కష్టం అనేది దరిచేరదిక.. అన్నీ అరచేతుల్లోనే..
వ్యవసాయం ఇప్పుడు స్మార్ట్ టెక్నాలజీ వైపు అడుగులు వేస్తోంది. రైతులకు అవసరమైన సమాచారం తక్షణమే అందేలా కేంద్ర ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత పలు డిజిటల్ సాధనాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. పంటల నిర్వహణ నుంచి వాతావరణ హెచ్చరికల వరకు సమగ్ర సమాచారం ఇప్పుడు మొబైల్లోనే అందుతోంది.

ఆరుగాలం కష్టపడినా అన్నదాతకు పంట ఇంటికి చేరేవరకూ ఎన్నో సవాళ్లు. చీడపీడలు, జంతువులు బాధలు.. తీరా పంట చేతికొచ్చాక గిట్టుబాటు ధర లేకపోవడం.. ఇలాంటి ఎన్నో సమస్యలు దాటుకొని సాగుచేస్తారు రైతులు. అందుకే ఇప్పుడు రైతుకు అండగా నిలిచేందుకు ఏఐ సిద్ధమైంది. సాగులో కష్టం తగ్గించి, లాభం పెంచే దిశగా వ్యవసాయ రంగం సరికొత్త పుంతలు తొక్కుతోంది. గతంలో ఏదైనా సలహా కోసం వ్యవసాయ అధికారుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పుణ్యమా అని పంట సాగు నుంచి పథకాల వివరాల వరకు అన్నీ అరచేతిలో ఉన్న మొబైల్లోనే లభిస్తున్నాయి. ప్రభుత్వ పథకాలపై రైతులకు వచ్చే సందేహాలను తీర్చేందుకు కేంద్రం Kisan e-Mitra అనే ఏఐ చాట్బాట్ను అందుబాటులోకి తెచ్చింది. పీఎం కిసాన్, కిసాన్ క్రెడిట్ కార్డ్, ఫసల్ బీమా వంటి పథకాల వివరాలను ఇది అందిస్తుంది. విశేషమేమిటంటే, మన తెలుగు సహా 11 భాషల్లో ఇది మాట్లాడుతుంది. ఇప్పటివరకు లక్షలాది మంది రైతులు దీని ద్వారా తమ సమస్యలకు పరిష్కారం పొందారు.
పంటకు తెగులు సోకితే ఏ మందు వాడాలో తెలియక తికమకపడే రోజులు పోయాయి. National Pest Surveillance System యాప్ ద్వారా పంటకు సోకిన వ్యాధిని ఫోటో తీసి అప్లోడ్ చేస్తే చాలు.. ఏఐ వ్యవస్థ సెకన్లలో ఆ వ్యాధిని విశ్లేషించి, తగిన నివారణ చర్యలను సూచిస్తుంది. అంతేకాదు, రుతుపవనాల గమనాన్ని ఏఐ ద్వారా విశ్లేషించి, వర్ష సూచనలను ముందే SMS రూపంలో రైతులకు పంపిస్తున్నారు. దీనివల్ల విత్తనాలు వేయడానికి, ఎరువులు చల్లడానికి సరైన సమయాన్ని రైతులు ఎంచుకోగలుగుతున్నారు. అలాగే, ఫసల్ బీమా యోజన క్లెయిమ్ స్థితిని కూడా చాట్ సేవల ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు. పెరుగుతున్న టెక్నాలజీతో రైతుకు అవగాహన పెరగడమే కాకుండా, సాగులో రిస్క్ తగ్గుతుంది. ఈ డిజిటల్ అండతో అన్నదాత మరింత లాభదాయకమైన సాగు దిశగా అడుగులు వేస్తున్నాడు.
