అయ్యో బిడ్డా.. చింత గింజలు గొంతులో ఇరుక్కొని బాలుడు మృతి!
ఆదిలాబాద్లో విషాద ఘటన చోటుచేసుకుంది. చింతకాయలు తింటున్న ఏడేళ్ల బాలుడు మంగేశ్ గొంతులో చింత గింజలు ఇరుక్కొని ఊపిరాడక మృతి చెందాడు. కుటుంబ సభ్యులు వెంటనే రిమ్స్ ఆసుపత్రికి తరలించి సీపీఆర్ చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. వైద్యులు బాలుడు మృతిచెందినట్లు ప్రకటించారు. ఘటనపై పోలీసులు వివరాలు సేకరించారు.

ఆదిలాబాద్లో విషాద ఘటన చోటుచేసుకుంది. చింత గింజలు గొంతులో ఇరుక్కొని ఊపిరాడక ఏడేళ్ల బాలుడు మృత్యువాత పడ్డాడు. పట్టణ శివారు ప్రాంతంలోని కేఆర్కే కాలనీలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ఆడుకుంటూ చింతకాయలు తింటున్న సమయంలో ప్రమాదం చోటుచేసుకోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కేఆర్కే కాలనీకి చెందిన మంగేశ్ అనే ఏడేళ్ల బాలుడు ఇంటి వద్ద ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో చింతకాయలు తింటూ వాటిలోని గింజలను నములుతున్నాడు. అయితే అనుకోకుండా గింజలు ఒకేసారి గొంతులో ఇరుక్కుపోయినట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు. దీంతో బాలుడికి శ్వాస తీసుకోవడం తీవ్రంగా ఇబ్బందిగా మారింది.
బాలుడి పరిస్థితిని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతడిని ఆదిలాబాద్లోని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు బాలుడికి అత్యవసర చికిత్స అందించేందుకు ప్రయత్నించారు. సీపీఆర్ చేసినప్పటికీ బాలుడి పరిస్థితిలో ఎలాంటి మెరుగుదల కనిపించలేదు. చివరకు బాలుడు మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. చిన్నారి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఆడుకుంటూ ఉండగానే ఇలా ప్రాణాలు కోల్పోవడంతో స్థానికంగా విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనకు సంబంధించిన వివరాలను సేకరించారు. బాలుడి మృతికి దారితీసిన పరిస్థితులపై విచారణ చేపట్టినట్లు సమాచారం.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
