Telangana: అదేంటీ..? 20 ఏళ్లుగా విధులకు గైర్హాజరైన టీచర్‌కు పోస్టింగ్‌.. విద్యాశాఖ నిర్వాకం

తెలంగాణ విద్యాశాఖపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ ఉపాధ్యాయుడు 20 ఏళ్లుగా స్కూల్‌లో విధులకు హాజరుకాకపోయినా తిరిగి పోస్టింగ్‌ ఇవ్వడం తీవ్ర వివాదాస్పదమైంది. ఏళ్ళ తరబడి టీచర్లు కనిపించకుండా పోతున్నా అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడంలేదని విద్యాశాఖను..

Telangana: అదేంటీ..? 20 ఏళ్లుగా విధులకు గైర్హాజరైన టీచర్‌కు పోస్టింగ్‌.. విద్యాశాఖ నిర్వాకం
SGT teacher
Follow us

|

Updated on: Mar 31, 2023 | 10:04 AM

తెలంగాణ విద్యాశాఖపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ ఉపాధ్యాయుడు 20 ఏళ్లుగా స్కూల్‌లో విధులకు హాజరుకాకపోయినా తిరిగి పోస్టింగ్‌ ఇవ్వడం తీవ్ర వివాదాస్పదమైంది. ఏళ్ళ తరబడి టీచర్లు కనిపించకుండా పోతున్నా అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడంలేదని విద్యాశాఖను విమర్శిస్తున్నారు. వివరాల్లోకెళ్తే.. జగిత్యాల జిల్లాలో ఓ సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ 2003 నుంచి విధులకు హాజరవ్వడం లేదు. ఈ విషయాన్ని ఇటీవలే గుర్తించిన అధికారులు సదరు ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోకపోవడం విశేషం. పైగా అతను తిరిగి విధుల్లో చేరతానని పెట్టుకున్న అర్జీని గుట్టు చప్పుడు కాకుండా ఆమోదించారు కూడా. ఈ వ్యవహారంపై అధికారుల వింత ప్రవర్తన మరింత విస్తుగొలిపేలా ఉంది. షోకాజ్‌ నోటీసు ఇచ్చామని, అతను విధుల్లో చేరతానని చెప్పాడని అంటున్నారు. విధుల్లో చేరిన తర్వాత విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని అధికారులు అంటున్నారు . దీనిపై పాఠశాల విద్య డైరెక్టర్‌ను వివరణ కోరితే స్పందించకపోవడం కొసమెరుపు.

ఇలా ఏళ్ళకు ఏళ్ళు పాఠశాల ముఖమే చూడని టీచర్లు ఒకరిద్దరు కాదు 2005 నుంచి గాలిస్తే వంద మందికిపైగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పాఠశాలకు సక్రమంగారాకుంటే విద్యార్ధులను పరీక్షలకు అనుమతించరు. అటువంటిది ఏళ్ళ తరబడి టీచర్‌ స్కూల్‌నే వదిలేస్తే కనీసంగా ఎవరూ పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉందని ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులను అలా ఎలా వదిలేస్తారని విమర్శిస్తున్నారు. సాధారణంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు సెలవు పెట్టాలంటే ముందుగా దరఖాస్తు చేసుకోవాలి. అవసరమైతే మళ్ళీ సెలవును పొడిగించుకోవాలి.. లేదంటే గైర్హజరుగానే భావిస్తారు. నల్గొండ, హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో టీచర్లు సెలవు పెట్టిన దాఖలాల్లేవు. ఏడాది కన్పించకుండా పోతే సదరు టీచర్‌కు విద్యా శాఖ అధికారులు షోకాజ్‌ నోటీసు ఇవ్వాలి. కానీ ఏళ్లకు ఏళ్ళు కన్పించకుండా పోయినా ఒక్క షోకాజ్‌ నోటీసు ఇవ్వకపోవడంపై విద్యాశాఖ నిర్లక్ష్యం ఏమేర ఉందో తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.