
ఆదిభట్ల, మే 15: రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని కొంగరకలన్ గ్రామంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గ్రామంలోని పి.ఎస్.ఆర్ శ్లోక కన్వెన్షన్ హాల్ వెనుక భాగంలో ఉన్న డెకరేషన్ సామాగ్రి గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. గోదాంలో పెద్ద మొత్తంలో ప్లాస్టిక్ వస్తువులు, చెక్క సామాగ్రి, అలంకరణకు ఉపయోగించే పదార్థాలు నిల్వ ఉండటంతో మంటలు క్షణాల్లోనే వ్యాపించాయి. భారీగా ఎగిసిపడుతున్న మంటలతో పాటు దట్టమైన నల్లటి పొగలు ఆ ప్రాంతాన్ని కమ్మేశాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అగ్నిప్రమాదం కారణంగా గోదాంలో భారీ ఆస్తినష్టం సంభవించినట్లు తెలుస్తోంది.
అయితే ప్రమాదానికి గల అసలు కారణాలు ఇంకా తెలియరాలేదు. షార్ట్ సర్క్యూట్ కారణమా? లేక ఇతర కారణాల వల్ల మంటలు చెలరేగాయా? అనే కోణంలో పోలీసులు, ఫైర్ అధికారులు విచారణ చేపట్టారు.ఇటీవల ఎండాకాలం తీవ్రత పెరగడంతో రాష్ట్రవ్యాప్తంగా అగ్నిప్రమాదాలు తరచుగా చోటుచేసుకుంటున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు, విద్యుత్ షార్ట్సర్క్యూట్లు, నిర్లక్ష్యంగా నిల్వ ఉంచిన మంటలు అంటుకునే వస్తువులు ప్రమాదాలకు కారణమవుతున్నాయి.
ముఖ్యంగా గోదాంలు, పరిశ్రమలు, ప్లాస్టిక్ నిల్వ కేంద్రాల్లో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. అధికారులు ఇప్పటికే ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. విద్యుత్ వైరింగ్ను తరచుగా తనిఖీ చేయడం, మంటలు అంటుకునే వస్తువులను జాగ్రత్తగా నిల్వ ఉంచడం, అగ్నిమాపక పరికరాలు అందుబాటులో ఉంచుకోవడం వంటి జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని చెబుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.