Munugode By Poll: కమలం Vs కాంగ్రెస్‌.. మునుగోడులో రసవత్తరంగా మారిన రాజకీయం.. 

మునుగోడు బైపోల్‌కి నోటిఫికేషన్‌ రాకముందే రాజకీయం రంజుగా మారింది. ఆపరేషన్‌ ఆకర్ష్‌ పేరుతో కేడర్‌ను ఆకర్షించే పనిలో పడ్డారు నేతలు. చండూర్‌లో ప్రచారంతో హోరెత్తించారు కోమటిరెడ్డి రాజగోపాల్‌.

Munugode By Poll: కమలం Vs కాంగ్రెస్‌.. మునుగోడులో రసవత్తరంగా మారిన రాజకీయం.. 
Bjp Vs Congress

Updated on: Sep 07, 2022 | 7:41 AM

Munugode By Elections: మునుగోడు ఉప ఎన్నికను సీరియస్‌గా తీసుకున్న కోమటిరెడ్డి రాజగోపాల్‌.. నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. అయితే కాంగ్రెస్‌ కార్యకర్తలు మాత్రం దండయాత్రకు దిగుతున్నారు. చండూరులో కమలం వర్సెస్‌ హస్తం వార్‌ పీక్‌కి వెళ్లింది.

మునుగోడు బైపోల్‌కి నోటిఫికేషన్‌ రాకముందే రాజకీయం రంజుగా మారింది. ఆపరేషన్‌ ఆకర్ష్‌ పేరుతో కేడర్‌ను ఆకర్షించే పనిలో పడ్డారు నేతలు. చండూర్‌లో ప్రచారంతో హోరెత్తించారు కోమటిరెడ్డి రాజగోపాల్‌. ఈ క్రమంలో కొంతమంది కార్యకర్తలు బీజేపీలో చేరారు. అక్కడి వరకు అంతా బాగానే ఉంది. రాజగోపాల్ ప్రసంగిస్తుండగా కాంగ్రెస్‌ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడే ఉన్న బీజేపీ కేడర్‌ వారిని అడ్డుకుంది. ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. నువ్వెంత అంటే.. నువ్వెంత అనుకున్నారు. చినికి చినికి గాలివానగా మారిన వాగ్వాదం తోపులాటకు దారితీసింది. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది.

తన స్పీచ్‌కి అడ్డు తగిలిన కాంగ్రెస్‌ కార్యకర్తలపై రాజగోపాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మొరిగే వారిని పట్టించుకోవద్దని.. బీజేపీ నేతలకు సూచించారు. సంయమనం పాటించాలన్నారు. తాటాకు చప్పుళ్లకి భయపడేదే లేదన్నారు రాజగోపాల్‌. భారతదేశం మొత్తం మునుగోడు ఉపఎన్నిక వైపే చూస్తోందన్నారు. బీజేపీ గెలుపు చారిత్రక అవసరం అన్నారు. మునుగోడు ప్రజలు తననే గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. మొత్తానికి ఉద్రిక్తతల మధ్యే ప్రసంగాన్ని ముగించారు రాజగోపాల్‌. ఉప సమరం ఇప్పుడే ఇలా ఉంటే.. ముందు ముందు ఇంకే స్థాయిలో ఉంటుందోనన్న చర్చ నడుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..