
పెంపుడు శునకాలు చనిపోతే వాటికి సంప్రదాయ పద్ధతుల్లో అంత్యక్రియలు నిర్వహించిన వారిని చూస్తుంటాం. అలాగే దశదిశ కర్మలు నిర్వహించే వారిని చూస్తుంటాం. కానీ ఖమ్మంకు చెందిన ఓ కుటుంబం మాత్రం తాను పెంచుకున్న శునకం తాలూకూ స్మృతులు మరిచిపోలేకపోతోంది. కుటుంబంలో ఓ బిడ్డలా చూసుకున్న శునకానికి వర్ధంతి నిర్వహించి దానికి ప్రత్యేక పూజలు సైతం చేశారు.
వివరాల్లోకి వెళితే.. ఖమ్మం జిల్లా రవాణాశాఖ అధికారి తొట కిషన్ రావు 2015 అక్టోబరు 2న పుట్టిన పుష్ బ్రీడ్కు చెందిన శునకాన్ని హైదరాబాద్లో కొనుగోలు చేసి ఇంటికి తెచ్చుకున్నారు. అనంతరం దానికి రెక్స్ అని నామకరం చేసి కుటుంబ సభ్యులతో సమానంగా చూసుకున్నారు. ఈ క్రమంలో ప్రతీ ఏడాది అక్టోబరు 2న పుట్టిన రోజు కూడా నిర్వహిస్తూ వచ్చారు. అయితే ఈ క్రమంలోనే ఆ శునకం అనారోగ్యంతో 2021 జూలై 20న మరణించింది.
శునకం మరణించిన రోజు మనుషులకు నిర్వహించే మాదిరిగానే అంత్యక్రియలు నిర్వహించిన కుటుంబం ఆ తర్వాతి కార్యక్రమాలను కూడా శాస్త్రోక్తంగా పూర్తి చేసింది.
ఆ తర్వాత వర్ధంతిని సైతం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా గురువారం రెండో వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. రెక్స్ను ఖననం చేసిన చోట, ఇంట్లో దాని చిత్రపటం వద్ద పూజలు చేసి నివాళి అర్పించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..