ఫోన్ లేకుండానే నోటిఫికేషన్లు చూసేయొచ్చా? శాంసంగ్ నుంచి మతిపోగొట్టే గ్యాడ్జెట్
Samsung AI Glasses.. స్మార్ట్ఫోన్ స్క్రీన్ను చేతిలో పట్టుకునే రోజులు క్రమంగా మారుతున్నాయి. సమాచారాన్ని నేరుగా కళ్ల ముందే చూపించే సాంకేతికతపై దిగ్గజ సంస్థలు దృష్టి పెడుతున్నాయి. ఈ జాబితాలో Samsung కూడా చేరింది. ఫోన్ నోటిఫికేషన్లు, సందేశాలు, నావిగేషన్ వివరాలను కళ్లద్దాలపైనే చూపించేలా కొత్త AI Glassesను రూపొందిస్తున్నట్లు సమాచారం. ఇది రాబోయే రోజుల్లో టెక్ ప్రపంచంలో కీలక మార్పుగా మారొచ్చు.

కళ్లద్దాలు పెట్టుకుంటే చాలు.. ఫోన్లోకి వచ్చిన సమాచారం కళ్ల ముందే కనిపిస్తే ఎలా ఉంటుంది? ఈ ఆలోచనను నిజం చేసే దిశగా Samsung అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. 0.2 అంగుళాల కంటే చిన్న మైక్రోడిస్ప్లేతో కొత్త స్మార్ట్ AI Glassesను తీసుకొచ్చేందుకు కంపెనీ ప్రయత్నిస్తోంది. అయితే ఈ సాంకేతికత మార్కెట్లోకి రావడానికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది.
కళ్లద్దాలపైనే ఫోన్ సమాచారం!
Samsung అభివృద్ధి చేస్తున్న AI Glassesలో అత్యంత కీలకమైన అంశం మైక్రోడిస్ప్లే. ఇది 0.2 అంగుళాల కంటే చిన్నదిగా ఉండే అవకాశం ఉంది. ఫోన్కు వచ్చే నోటిఫికేషన్లు, మెసేజ్లు, నావిగేషన్ రూట్ మ్యాప్లు, ఐకాన్స్ వంటి ప్రాథమిక సమాచారాన్ని కళ్లద్దాల అద్దాలపై ప్రొజెక్ట్ చేసేలా దీన్ని రూపొందిస్తున్నట్లు సమాచారం. దీంతో ప్రతి చిన్న సమాచారం కోసం ఫోన్ను బయటకు తీయాల్సిన అవసరం ఉండదు. నడుస్తూ, ప్రయాణిస్తూ ఇతర పనులు చేసుకుంటూనే అవసరమైన వివరాలను కళ్ల ముందే చూసుకునే వీలు కలుగుతుంది.
రెండు కళ్లకా.. ఒక్క కంటికా?
ఈ కళ్లద్దాల కోసం OLEDoS లేదా LEDoS సాంకేతికతలను Samsung పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. తక్కువ తయారీ ఖర్చుతో మంచి నాణ్యత అందించే White OLEDoS వైపు కంపెనీ మొగ్గు చూపే అవకాశం ఉంది. అయితే డిస్ప్లే రెండు కళ్లకు కనిపించేలా ఉంటుందా? ఒక్క కంటికి మాత్రమే ఉంటుందా? అనేది ఇంకా స్పష్టం కాలేదు. కళ్లద్దాలు చిన్న పరిమాణంలో ఉండేలా చూసుకుంటూనే, ఎక్కువ సమాచారాన్ని చూపించే ఆప్టికల్ వ్యవస్థను రూపొందించడం Samsungకు పెద్ద సవాలుగా మారనుంది.
ఈ విభాగంలో Meta ఇప్పటికే Ray-Ban Smart Glassesతో ముందంజలో ఉంది. Samsung ప్రాజెక్ట్ ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్నట్లు సమాచారం. మైక్రోడిస్ప్లే అభివృద్ధి, నాణ్యతా పరీక్షల ఆధారంగా పనులు సాగనున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే 2027 చివర్లో లేదా 2028 మధ్యలో ఈ కళ్లద్దాలు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.
