AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Be Alert: బ్లూటూత్ హెడ్‌ఫోన్స్ వాడుతున్నారా? జాగ్రత్త.. 15 సెకన్లలోనే మీ ఫోన్ హ్యాక్ కావొచ్చు!

టెక్నాలజీ పెరిగే కొద్దీ సౌకర్యాలు ఎంత పెరుగుతున్నాయో, ముప్పు కూడా అంతే వేగంగా మన తలుపు తడుతోంది. మనం నిత్యం వాడే ఇయర్‌బడ్స్, బ్లూటూత్ హెడ్‌ఫోన్స్ ఇప్పుడు హ్యాకర్ల కొత్త ఆయుధాలుగా మారిపోయాయి. రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు లేదా ఆఫీసులో ప్రశాంతంగా పాటలు వింటున్నప్పుడు.. కేవలం 15 సెకన్లలోనే మీ పరికరాన్ని మరొకరు నియంత్రించగలరని మీకు తెలుసా?

Be Alert: బ్లూటూత్ హెడ్‌ఫోన్స్ వాడుతున్నారా? జాగ్రత్త.. 15 సెకన్లలోనే మీ ఫోన్ హ్యాక్ కావొచ్చు!
Bt Headphones
Nikhil
|

Updated on: Jan 22, 2026 | 9:42 PM

Share

వన్‌ప్లస్, షావోమి, సోనీ వంటి అగ్రశ్రేణి బ్రాండ్ల ఆడియో పరికరాల్లో ఒక భయంకరమైన సెక్యూరిటీ లోపం ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ లోపం ద్వారా మీ మాటలను రికార్డ్ చేయడమే కాకుండా, మీరు ఎక్కడున్నారో కూడా హ్యాకర్లు కనిపెట్టగలరట. అసలు ఈ ‘విస్పర్‌పెయిర్’ దాడి ఎలా జరుగుతుంది? దీని నుండి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలో తెలుసుకుందాం.

విస్పర్‌పెయిర్ అంటే..

బెల్జియంకు చెందిన కేయూ ల్యూవెన్ యూనివర్సిటీ పరిశోధకులు బ్లూటూత్ పరికరాల అనుసంధాన ప్రక్రియలో ఒక పెద్ద లోపాన్ని కనుగొన్నారు. దీనికి వారు ‘విస్పర్‌పెయిర్’ అని పేరు పెట్టారు. గూగుల్ అభివృద్ధి చేసిన ‘ఫాస్ట్ పెయిర్’ అనే టెక్నాలజీలో ఉన్న బలహీనతలను హ్యాకర్లు ఆసరాగా చేసుకుంటున్నారు. ఆండ్రాయిడ్ ఫోన్లు, క్రోమ్ ఓఎస్ పరికరాలకు బ్లూటూత్ ఇయర్‌బడ్స్‌ను సులభంగా కనెక్ట్ చేయడానికి ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. కానీ ఇదే ఇప్పుడు వినియోగదారుల ప్రాణాల మీదకు తెస్తోంది.

ఎలా హ్యాక్ చేస్తారు?

హ్యాకర్లు సుమారు 50 అడుగుల దూరంలో ఉండి కూడా మీ ఆడియో పరికరాన్ని నిశ్శబ్దంగా తమ ఫోన్‌కు లేదా లాప్‌టాప్‌కు కనెక్ట్ చేసుకోగలరు. మీ ఇయర్‌బడ్స్‌లోని మైక్రోఫోన్‌ను హ్యాకర్లు ఆన్ చేసి, మీ చుట్టూ జరుగుతున్న సంభాషణలను రహస్యంగా వినగలరు. మీరు వింటున్న పాటలను నిలిపివేసి, వారు కోరుకున్న ఆడియోను ప్లే చేయగలరు లేదా ఫోన్ కాల్స్‌ను డిస్టర్బ్ చేయగలరు. మీరు ఎక్కడెక్కడికి వెళ్తున్నారో మీ పరికరం ద్వారానే ట్రాక్ చేసే అవకాశం ఉంటుంది.

పరిశోధకుల నివేదిక ప్రకారం.. వన్‌ప్లస్, షావోమి, నథింగ్, జెబిఎల్, సోనీ, మార్షల్ వంటి ప్రముఖ బ్రాండ్ల ఆడియో పరికరాలు ఈ విస్పర్‌పెయిర్ దాడికి గురయ్యే అవకాశం ఉంది. విచారకరమైన విషయం ఏంటంటే.. గూగుల్ ప్రొడక్ట్స్ వాడని ఐఫోన్ వినియోగదారులు కూడా ఈ సైబర్ దాడి బారిన పడే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. సైబర్ నిపుణులు ఈ ముప్పు నుండి తప్పించుకోవడానికి కొన్ని కీలక సూచనలు చేస్తున్నారు. మీరు హెడ్‌ఫోన్స్ వాడనప్పుడు బ్లూటూత్ ఆఫ్‌లో ఉంచడం ఉత్తమం. దీనివల్ల హ్యాకర్లకు మీ పరికరం కనిపించే అవకాశం ఉండదు.

మీ ఫోన్ స్క్రీన్‌పై అకస్మాత్తుగా వచ్చే ఏవైనా పెయిరింగ్ రిక్వెస్ట్‌లను వెంటనే తిరస్కరించండి. రద్దీగా ఉండే ప్రాంతాల్లో కొత్తగా బ్లూటూత్ పరికరాలను పెయిరింగ్ చేయకపోవడం మంచిది. మీ ఇయర్‌బడ్స్‌కు సంబంధించిన మొబైల్ యాప్‌లో వచ్చే ఫర్మ్‌వేర్ అప్‌డేట్లను ఎప్పటికప్పుడు ఇన్ స్టాల్ చేసుకోండి. టెక్నాలజీ మన జీవితాన్ని సులభతరం చేస్తుంది కానీ, చిన్న అజాగ్రత్త పెద్ద ప్రమాదానికి దారి తీస్తుంది. ఈ విస్పర్‌పెయిర్ దాడుల నేపథ్యంలో మీ వ్యక్తిగత గోప్యతను కాపాడుకోవడానికి పైన చెప్పిన జాగ్రత్తలు తప్పక పాటించాలి.