కార్ మైలేజ్ పెంచుకోవాలా? ఈ చిన్న మార్పులతో డబ్బులు మిగిలించుకోవచ్చు!
ఇంధన ధరలు పెరుగుతున్న నేపథ్యంలో కారు మైలేజ్ పెంచుకోవడం వాహనదారులకు అవసరం. డ్రైవింగ్ అలవాట్లలో మార్పులు, సరైన నిర్వహణతో ఇంధనాన్ని ఆదా చేయవచ్చు. అనవసరమైన బరువు తగ్గించడం, ట్రాఫిక్లో ఇంజిన్ ఆఫ్ చేయడం, ఏసీని మితంగా వాడటం వంటి చిట్కాలతో మైలేజ్ను గణనీయంగా మెరుగుపరచవచ్చు.

ఇంధన ధరలు పెరుగుతున్న నేపథ్యంలో కార్ మైలేజ్ ఎలా పెంచుకోవాలన్నదే చాలా మంది వాహనదారుల ప్రధాన ఆందోళనగా మారింది. నిపుణుల ప్రకారం డ్రైవింగ్ అలవాట్లు, వాహనం నిర్వహణలో కొన్ని సాధారణ మార్పులు చేస్తే మైలేజ్ గణనీయంగా మెరుగుపడే అవకాశం ఉంది. మొదటిగా స్మూత్ డ్రైవింగ్ చాలా కీలకం. అకస్మాత్తుగా వేగం పెంచడం (హార్డ్ యాక్సిలరేషన్), హఠాత్తుగా బ్రేక్ వేయడం వల్ల ఇంధన వినియోగం పెరుగుతుంది. స్థిరమైన వేగంతో డ్రైవ్ చేయడం ద్వారా ఇంజిన్పై ఒత్తిడి తగ్గి మైలేజ్ మెరుగవుతుంది. ముఖ్యంగా నగర ట్రాఫిక్లో ముందుచూపుతో డ్రైవింగ్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
టైర్ ప్రెజర్ను సరిగా ఉంచడం మరో ముఖ్యమైన అంశం. టైర్లలో గాలి తక్కువగా ఉంటే ఇంజిన్కు ఎక్కువ పని పడుతుంది, దీంతో ఇంధన వినియోగం పెరుగుతుంది. కనీసం నెలకు ఒకసారి టైర్ ప్రెజర్ చెక్ చేయడం మంచిది. అలాగే, వాహనానికి క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేయించడం ద్వారా ఇంజిన్ పనితీరు మెరుగుపడి మైలేజ్ పెరుగుతుంది. అవసరం లేని బరువు కారులో పెట్టుకోవడం కూడా మైలేజ్ను ప్రభావితం చేస్తుంది. బూట్లో అనవసరమైన సామాను ఎక్కువగా ఉంచితే ఇంధన వినియోగం పెరుగుతుంది. అలాగే ట్రాఫిక్లో ఎక్కువసేపు నిలిచినప్పుడు ఇంజిన్ ఆఫ్ చేయడం ద్వారా కూడా ఇంధనం ఆదా చేయవచ్చు.
ఎయిర్ కండిషనర్ను మితంగా ఉపయోగించడం కూడా కీలకం. ఎక్కువసేపు ఫుల్ ఏసీతో డ్రైవ్ చేస్తే మైలేజ్ తగ్గుతుంది. సాధ్యమైనంత వరకు మోస్తరు స్థాయిలో ఏసీ వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. మొత్తంగా చూస్తే డ్రైవింగ్ స్టైల్లో చిన్న మార్పులు, సరైన నిర్వహణ పాటిస్తే కార్ మైలేజ్ను 10 నుంచి 20 శాతం వరకు పెంచుకోవచ్చని ఆటోమొబైల్ నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
