కృత్రిమ మేథ కాదు.. కృత్రిమ క్షోభ.. గ్లోబు నెత్తిన AI గుదిబండ.. దించేదెలా?
చారాణా కోడికి బారానా మసాలా అంటారే అదే అవుతోంది ఇక్కడ..! మనకు పావలా సౌకర్యాన్ని ఇచ్చినట్టే ఇచ్చి బ్యాక్ ఎండ్ నుంచి రూపాయి నష్టాన్ని మిగులుస్తోంది ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్. ఆ నష్టంలో కనిపించే నష్టం కొంతే అయినా, కనిపించని నష్టం కొండంత. కానీ, కృత్రిమ మేథతోనే జిందగీలను ముడిపెట్టి.. ఆ మాయలోనే మన ట్వంటీఫోర్ సెవెనూ తగలేసుకుంటున్న మనకు.. దాంతో కలిగే డ్యామేజెస్ గురించి ఆలోచించే తీరికే లేకుండా పోయింది. కానీ, జర లోతుకెళ్లి చూస్తే, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ అనే కత్తి రెండో వైపున ఎంత పదునుందో తెలుస్తోంది. కృత్రిమ మేధ (AI) మనకు సౌకర్యాన్ని ఇస్తున్నట్లు కనిపించినా, దాని వెనుక భారీ రహస్య నష్టాలున్నాయి. ఇది మానవ మేధస్సును మొద్దుబార్చి, ఆలోచనా శక్తిని తగ్గిస్తోంది. అపారమైన శక్తిని, నీటిని వినియోగిస్తూ పర్యావరణాన్ని దెబ్బతీస్తోంది. AIపై అతిగా ఆధారపడటం దీర్ఘకాలంలో మన భవిష్యత్తుకు పెనుముప్పుగా మారుతోంది. కనిపించే లాభాలకంటే, కనిపించని నష్టాలే ఎక్కువ. కలిగే కష్టనష్టాలు అపారమని తేలుస్తుంది. అవేంటో తెలుసుకుందాం.

ఒకవైపే చూడు. రెండోవైపు చూడాలనుకోకు.. తట్టుకోలేవు.. అని బాలయ్య డైలాగ్ను గుర్తు చేస్తోంది మనలను అక్రమించేసిన ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్. టెక్నో ప్రపంచాన్నే కాదు, సాదాసీదా జిందగీల్ని కూడా కబ్జా చేసి.. మనకు తెలీకుండానే మన నుంచి మనల్ని లాగేసుకుంటున్న కృత్రిమ మేథ.. ఇప్పుడిప్పుడే తన డార్క్ షేడ్స్ని పరిచయం చేస్తోంది. ఏఐ.. పూర్తిగా చంద్రముఖిగా మారిపోయేలోగా మనలను, మన లైఫ్స్టైల్నే కాదు, మన పర్యావరణాన్నీ ఎంతెంత చిత్తు చేస్తోంది అని లెక్కలేసుకుని నోరెళ్లబెడుతున్నారు ఎక్స్పర్ట్స్. కృత్రిమ మేథ కారణంగా లాంగ్రన్లో ముంచుకొచ్చే ప్రమాదాలపై ఇప్పుడిప్పుడే ఒక అంచనా అయితే ఏర్పడింది.
ఇదిగో ఒక్క క్షణం ఆగు.. చాట్జీపీటీని అడిగి చెబుతా..!
అరె గ్రోక్.. ఇది తింటే ఒంట్లో ఎన్ని క్యాలరీలు పెరుగుతాయో చెప్పు..!
బుర్రంతా గోక్కుంటావెందుకు.. చేతిలో జెమినీ ఏఐ ఉండగా..!
ఇదీ యవ్వారం. ఆబాలగోపాలమూ ఇదే తంతు. కొత్త బంగారు లోకంలో తేలిపోతోంది ప్రపంచమంతా. అడగండి చెబుతా అంటూ అడిగిందే తడవుగా అరక్షణంలో ఆన్సరిచ్చే అద్భుతంగా చెలామణి అవుతోంది ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్. ఆరు నుంచి అరవై దాకా అన్ని వయసులకూ ఫ్రీగానే దొరుకుతోంది ఇన్ఫర్మేటివ్ సర్వీస్. కేజీ స్టూడెంట్కి హోమ్వర్ అదే చేస్తుంది.. ప్రోగ్రామ్ డిజైనర్కి కోడింగూ అదే రాసిపెడుతోంది.. చివరకు కోర్టులిచ్చే జడ్జిమెంట్లను కూడా అదే చదివి చెబుతోంది. అవసరాన్ని బట్టి మానిప్యులేట్ చేస్తోంది కూడా. అన్ని ఏజ్ గ్రూపులను, అన్ని సెక్టార్స్నీ, అన్ని కార్నర్స్నీ ఇన్ఫ్లుయెన్స్ చేసింది.
ఫలితం ఏంటంటే.. పిల్లలు పేరెంట్స్ మీద, స్టూడెంట్స్ టీచర్ల మీద, అసలు తన మెదడు మీద తనే డిపెండవడాన్ని పూర్తిగా మర్చిపోయాడు మనిషి. ఏఐ గాడు ఏదిస్తే అదే పరమాణ్ణం అవుతోంది. అంత ర్యాపిడ్గా జొరబడింది మన జిందగీల్లోకి. మన అవసరాల్ని తీర్చినట్టే తీర్చి మన ఆలోచనలను క్యాప్చర్ చేస్తోంది. అల్టిమేట్గా మనకు ఆలోచించే అవసరాన్నే లేకుండా చేస్తోంది.. మన మెదళ్లను మొద్దుబారుస్తోంది. ఫైనల్గా.. మెదడున్నా లేనట్టే అవుతోంది. మెదడు లేని మనిషి ఆవిష్కారమవుతాడు. ఇది ఏఐతో మానవాళికి జరిగే మొట్టమొదటి అతిపెద్ద నష్టం.
చేతిలో ఆండ్రాయిడ్ ఫోన్ వచ్చిన కొత్తల్లో ప్రపంచం మన పిడికెట్లో ఇమిడిపోయినట్టు.. ఏం ఫీల్రా మామా.. అని తెగ ఖుషీ అయిపొయ్యాం. కానీ, టెక్నాలజీ ముదిరి.. అది ఏఐగా మారి.. మనిషిని ఆసాంతం మింగేస్తుందని ఎవరైనా ఊహించారా? ఎదర బతుకంతా చిందరబందరే అని ఇప్పుడిప్పుడే కదా జ్ఞానోదయమవుతోంది? అవును, ఏఐతో కనిపించే ఎడ్వాంటేజెస్ కంటే కనిపించని డ్యామేజ్లే ఎక్కువ. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్తో ఎనర్జీ లాస్, పర్యావరణానికి లాస్, హ్యూమన్ ఇంటలిజెన్స్ లాస్! పైగా… మనకు ఫ్రీగానే దొరుకుతున్నట్టు కనిపిస్తున్న ఏఐని మెయింటెయిన్ చెయ్యడం భరించలేనంత భారం అవుతోందని ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నాయి కంపెనీలు. సో… ఏఐ అనే అందమైన అబద్ధం వెనుక విస్తుగొలిపే నిజాలు చాలానే ఉన్నాయన్నమాట..!
బ్రౌజర్ ఆన్ చేసి, సెర్చింజన్ బార్ మీద.. ఒక్క పదమో ఒక వాక్యమో రాసి.. మనక్కాల్సిన ఆన్సర్ కోసం ఆర్డరేస్తాం. కానీ, ఇంటర్నెట్లో బిలియన్ల కొద్దీ వెబ్ పేజీలను ఆసాంతం చదివి, జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకన్లో మనకు జవాబిచ్చేస్తుంది. కానీ, ఆ అరక్షణంలో చాలా ఎక్సర్సైజే చేస్తుంది గూగుల్ తల్లి. ఆటోమేటిక్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్లను నెట్లోకి పంపి, కొత్తగా అప్లోడ్ చేసిన వెబ్సైట్లను శోధించి, డేటాబేస్ను జల్లెడపట్టి, గూగుల్ ఇండెక్స్తో సరిపోల్చుకుని ఆ తర్వాతే ఫైనల్ ఆన్సర్ను మన ముందుంచుతుంది. శక్తివంతమైన కంప్యూటర్ సర్వర్లు, భారీ డేటా సెంటర్లు, ఏఐ టెక్నాలజీ సాయం.. ఇవన్నీ ఉంటేనే ఈ మొత్తం ప్రాసెస్ సజావుగా నడిచేది.
ఏఐ టూల్స్.. ఇలా డౌన్లోడ్ చేస్తే అలా వచ్చిపడతాయి. కొన్నిరోజులు, కొన్ని ఎంట్రీల వరకు ఫ్రీఫ్రీఫ్రీ అంటారు. ఆ తర్వాత వందో వెయ్యో ఫీజు కట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు. విచ్చలనిడిగా వాడేసుకోవచ్చు. నిజానికి, పైకి కనిపించేంత చవకైనవేమీ కాదు ఏఐ టూల్స్. చాలా ఖర్చుతో కూడుకున్న పని. ధనాన్ని, ఇంధనాన్ని విపరీతంగా తినేస్తుంది ఈ కృత్రిమమేథ.
వైజాగ్లో మాసివ్ ఏఐ డేటా సెంటర్ వస్తోంది అనగానే, మొదట్లో ఆనందపడ్డాం. కానీ, దానికి కావల్సిన నీళ్లు, విద్యుత్ లాంటి వనరులను ఎలా సమకూర్చాలి అనేది ప్రభుత్వాలకు పెద్ద సవాల్గా మారిందిగా? ఎందుకంటే, మామూలు సెర్చింజన్లతో పోలిస్తే, AI ఆధారిత సెర్చింజన్లకు, వాటి డేటా భద్రతకు పదింతలు ఎక్కువ ఇంధనం, ఎక్కువ నీరు అవసరమవుతుంది.
జెమినీ ఏఐని ఒక మోస్తరు ప్రశ్న అడిగితే, స్పందించడానికి 0.24 వాట్ అవర్స్ పవర్ని వాడుతుంది. ఇది 9 సెకన్ల పాటు టీవీ చూడ్డానికి సమానమైన కరెంట్తో సమానం. దీంతో పాటు 26 మిల్లీ లీటర్ల నీరు ఖర్చు అవుతుంది. అంతేకాదు, ఒక సెర్చ్కి జవాబిచ్చేలోగా 0.03 గ్రాముల కార్బన్ డైఆక్సైడ్ విడుదలవుతుంది. అంటే, ఖర్చుకు ఖర్చు, దీనికి బోనస్గా కర్బన ఉద్గారాలతో పర్యావరణానికి ముప్పు. ఇక చాట్ GPTలోనే గత ఏడాది రోజుకు 320 కోట్ల ప్రశ్నలు అడిగినట్టు ఓ లెక్కుంది. ఈ లెక్కన, ప్రపంచవ్యాప్తంగా ప్రతీ క్షణం, కోట్లాది మంది నెటిజన్లు, వేల కోట్ల సెర్చ్లు.. వీటిని ప్రాసెస్ చేసే సర్వర్లు వేడెక్కి, పర్యావరణంలో ప్రతికూల మార్పులొస్తాయి. ఇదంతా మనకు తెలీకుండా సైలెంట్గా జరిగిపోతున్న డ్యామేజ్.
అడిగింది చిన్న ప్రశ్నే కావొచ్చు. కానీ, డేటా మొత్తాన్నీ శోధిస్తేనే కదా సరైన ఆన్సరొచ్చేది? పైగా, కోట్లాది సెర్చ్లను ప్రాసెస్ చేస్తున్న AI టూల్స్.. ఫ్యూచర్లో మరీ ఖరీదెక్కిపోతాయని ఫికర్ పట్టుకుంది కంపెనీలకు. ఏఐ వాడకం అనేది ఒక వ్యసనంగా మారింది జనాలకు. అవసరం ఉన్నా లేకపోయినా ఫోటోలు, వీడియోలు క్రియేట్ చేయడం మరీ ఎక్కువైంది. దీంతో, డేటా సెంటర్స్ మీద బరువు పెరిగి, అనర్థాలకు దారితీస్తుందనేది మరో భయం. సో, ఇప్పుడు ఏఐ మనకు పెద్ద రిలీఫ్గా కనిపించినా, లాంగ్రన్లో రఫ్ అండ్ టఫ్గా మారే ప్రమాదముందా?
ఏదైనా ఫోన్ హ్యాక్ ఐతే, కాసేపు హైరానా పడతాం, వెంటనే తేరుకుని టోల్ఫ్రీ నంబరుకు ఫోన్ చేసి, కంప్లయింట్ రాసిస్తాం. జరిగిన నష్టంలో ఎంతోకొంత పూడ్చుకుంటాం. కానీ, ఫోను కాదు మనిషే హ్యాకైతే..? అవును, ఏఐ టెక్నాలజీ ఎంత ర్యాపిడ్గా అప్డేట్ అవుతోందంటే, మనిషినే ఆక్రమించేంత వేగంగా.. ఇప్పటికే, సోషల్ మీడియాలో మన మూమెంట్స్ని ఫాలో అవుతూ, మన అభిరుచులను, మన ఆలోచనలను క్యాప్చర్ చేసింది కృత్రిమ మేథ. మనకేం కావాలో మనకంటే ముందే తెలుసుకుని, దాని రూట్లోనే మనల్ని నడిపిస్తోంది. ఫ్యూచర్లో మనిషినే హ్యాక్ చేసి, మరమనిషిగా మార్చేసే ఛాన్స్ కూడా ఉంది. అంతటి పెనుముప్పు దాపురించకముందే ఏఐని కంట్రోల్లోకి తెచ్చుకోవాలని ప్రపంచదేశాలు కసరత్తు చేస్తున్నాయి. కానీ, అంతకుముందే ఏఐతో జరిగే దారుణాలు చాలా ఉన్నాయి.
ఇప్పుడు కాదు, ఆరేడేళ్ల కిందటే, మన జీవితంలో ఒక భాగమైంది ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్. ఇప్పుడు వెనక్కు రాలేనంత ఊబిలోకి దింపేసింది. షాపింగ్, ఫుడ్ డెలివరీ, జీపీఎస్ లాంటి కొన్ని యాప్స్ ఏఐ టెక్నాలజీతోనే నడిచేవి. ఇప్పుడైతే, పెళ్లి కార్డుల నుంచి ప్రాజెక్ట్ వర్కుల దాకా అన్ని పనులకూ ఏఐనే నమ్ముకుంటున్నాం. డాక్టరిచ్చిన ప్రిస్క్రిప్షన్ను, స్కాన్ రిపోర్ట్ను కూడా అప్లోడ్ చేసి.. చాట్జీపీటీ నుంచే సెకండ్ ఒపీనియన్ తీసుకుంటున్నాం. ఏదైనా సుస్తీ చేస్తే, ఏ బిళ్లలు వేసుకోవాలో కూడా ఏఐనే అడుక్కుంటున్నాం. సో, డాక్టర్ని కూడా రీప్లేస్ చేస్తానంటోంది మాయదారి ఏఐ. కానీ, అది చెప్పేదంతా నిజం కాదని, గుడ్డిగా నమ్మితే మునిగేపోతామని ఎంతమందికి తెలుసు?
స్మార్ట్ఫోన్ వాడకం పెరిగి, ఇప్పటికే మనిషి మెదడు సగం చచ్చిపోయింది. కనీసం ఫ్యామిలీ మెంబర్ల ఫోన్ నంబర్లు కూడా గుర్తుపెట్టుకోలేనంతగా ఫోన్ల మీద ఆధారపడిపోతున్నాం. ప్రతీ దానికీ కాలిక్యులేటర్ వాడి, నాలుగో ఎక్కం కూడా మర్చిపోతున్నాం. కాంపాస్ ఓపెన్ చేస్తే తప్ప ఏ దిక్కు ఎటువైపుందో తెలుసుకోలేకపోతున్నాం. ఆ రేంజ్లో మన మెదడును మొద్దుబారిపోయింది. కానీ, ఇదంతా ఏఐ పూర్తిగా వాడుకలోకి రాకముందు పరిస్థితి. ఇప్పుడైతే, ఆలోచించడమే పూర్తిగా మానేశామా? AI వాడకంతో బుర్రకు పనిచెప్పడమే ఆపేశామా? జ్ఞాపకశక్తిని మెరుగుపర్చుకోడానికి, ఐక్యూ లెవల్స్ పెంచుకోడానికి గతంలో సుడోకు అనీ, పదవినోదం అనీ ఫజిల్స్ మీద టైమ్ స్పెండ్ చేసేవాళ్లు. ఇప్పుడు కనీసం మెదడు యాక్టివేషన్లో ఉందో లేదో కూడా తెలీని పరిస్థితి. ఇలాగే, ఒరిజినల్ మేథస్సు మూలకు పడేసి, కృత్రిమ మేథస్సు మీదే పూర్తిగా ఆధారపడితే, మనిషి ఫ్యూచర్ ఏమౌతుంది? అవసరానికి మించి సమాచారాన్ని సేకరించి బుర్రలో పెట్టుకుంటే కూడా కొత్తరకమైన సమస్యలు తలెత్తుతాయా?
కేవలం సమాచారం కోసం కాకుండా ఏఐ చాట్బాట్లను ఒక స్నేహితుడిగా, సహచరిగా కూడా వాడ్డం మొదలైంది. వర్చువల్ క్యారెక్టర్లను డిజైన్ చేసుకుని, ఏఐతో ఎంటర్టైన్మెంట్ని కూడా తీసుకుంటోంది ఇవాళ్టి యంగిస్థాన్. ఏదైనా, కష్టమొచ్చిస్తే ఏఐతో చెప్పుకుని, ఏఐతోనే ఓదార్పు పొందుతున్నారు. ఇది అమూల్యమైన మానవ సంబంధాలకే ప్రమాదకరం. కావల్సిన సమాచారాన్ని తీసుకోవడం సరే, అంతకంటే ముందు, మన వ్యక్తిగత సమాచారాన్ని ఏఐకి అప్పగిస్తున్నాం అనే విషయాన్ని ఈజీగా మర్చిపోతున్నాం. ఎందుకంటే, పర్సనల్ డేటాను ఏఐ టూల్స్కు షేర్ చేస్తే మన బతుకులు డేంజర్లో పడ్డట్టే అని పోలీసులే హెచ్చరిస్తున్నారు.
కృత్రిమ మేథను ఎంత స్మార్ట్గా వాడితే అంత బెటర్ అనే ఫార్ములా కూడా ఒకటుంది. ఇవాళ నేను ఏ డ్రస్ వేసుకుంటే బావుంటాను? విమానంలో వెళ్లి కూరగాయలు కొనొచ్చా? ఇలాంటి పనికిమాలిన, అసంబద్ధమైన, ఆకతాయి ప్రశ్నలను తగ్గించుకుంటే బెటర్. ఏఐని మితంగా వాడుకుంటూ.. విలువైన అత్యవసరమైన సందేహాలకు మాత్రం పరిమితమైతే.. మనకు మనమే మేలు చేసుకున్నవాళ్లమవుతాం. అవసరం లేనప్పుడు బ్రౌజర్లో ఏఐని ఆఫ్ చేయడం, లో ‘వెబ్ రిజల్ట్స్ ఓన్లీ’ అనే ఆప్షన్ని సెలక్ట్ చేసుకోవడం లాంటివి చేస్తే, ఏఐ మీద భారాన్ని తగ్గి, విద్యుత్, నీళ్లు ఆదా అవుతాయి. పైగా, మనం అడిగే ప్రశ్నలు బ్రీఫ్గా ఆన్సర్లు వచ్చేలా ఉంటే, ఏఐ చాట్బాట్లకు పని తగ్గించినట్టే. సో, ఇచ్చే ప్రాంప్ట్ స్మార్ట్గా ఉంటే, తీసుకునే ఔట్పుట్ తక్కువగా ఉంటే ఏఐ వాడకం కంట్రోల్లో ఉన్నట్టే అంటున్నారు ఎక్స్ఫర్ట్స్.
ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ను మించిన మహా మాయ ఇంకోటుంది. పేరు.. OI.. ఆర్గనాయిడ్ ఇంటెలిజెన్స్. మనిషి కణజాలంతో ఏకంగా కృత్రిమ మెదడును క్రియేట్ చేసే దిశగా సైంటిస్టులు అడుగులు వేస్తున్నారు. ఈ ఎక్స్పరిమెంట్ సక్సెస్ అయితే, భవిష్యత్తులో బయోలాజికల్ కంప్యూటింగ్, హైబ్రిడ్ ఇంటెలిజెన్స్ లాంటి కొత్త పోకడలు మొదలవుతాయి. సిలికాన్ చిప్లకు బదులు సజీవ కణాలను ప్రాసెసర్లుగా మార్చి, తక్కువ కరెంట్తో, తక్కువ డేటాతోనే ఓఐ సాధ్యమవుతుందట. ఇది ఏఐ కంటే కోట్ల రెట్లు వేగంగా పనిచేస్తుందట. అంటే, మనిషి మేథస్సును మించిపోయే మహాశక్తి రాబోతోంది. కృత్రిమ మేథతో ముప్పు కాదు, మహా ముప్పు పొంచి ఉందన్నమాట..
నాకు నచ్చిన ఒక టీవీ సీరియల్ని నాలుగువారాలు మిస్సయ్యా. దయచేసి, ఆ నాలుగు ఎపిసోడ్స్లో స్టోరీ ఏమైంది.. ఏ మలుపులు తిరిగింది.. చెప్పవా ప్లీజ్? అని ఒక ఇంటావిడ వినమ్రంగా అడిగితే, ఏదో సీరియల్ నుంచి ఏదో కథ చెప్పి మోసగించిందట చాట్ జీపీటీ. కోపమొచ్చి రిమోట్ నేలకేసి కొట్టిందట ఆ ఇల్లాలు. సిల్లీగా ఉన్నా, నిజానికి మన మధ్య ఇదేగా జరుగుతోంది? ఏఐ మనకేదో కొత్త విషయం నేర్పిస్తోందనుకుంటాం. కానీ, అదంతా వట్టి భ్రమ. నిజానికి మన నుంచే ఏఐ నేర్చుకుంటోంది. మన డొమైన్స్లో మనమిచ్చే సమాచారాన్నే తీసుకుని మనకే తిరిగిస్తోంది. పైగా, ఏఐ ఇంకా లెర్నింగ్ స్టేజ్లోనే ఉంది. ఇప్పుడు మేలుకుంటేనే బైటపడగలం. లేదంటే ఏఐ అనే ఊబిలో ఇంకా ఇంకా కూరుకుపోవడం గ్యారంటీ. అలాగని ఏఐ టెక్నాలజీలో వెనుకబడితే మనకే ప్రమాదం. ఆయువుపట్టులాంటి ఐటీ చీకటైపోతుంది. కోట్లాదిమంది జీవితాలు బుగ్గయిపోతాయి. అందుకే, టెక్నాలజీ అంటే.. పులి మీద స్వారీ లాంటిదే. ఒక్కసారి ఎక్కామా.. దిగే ఛాన్సుండదు. ఏఐ మీద డిపెండబులిటీని తగ్గించుకుని, స్మార్ట్గా వాడ్డం ఒక్కటే మన ముందున్న మార్గం..!
మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
