Sanju Samson Prize Money : సెమీస్, ఫైనల్స్లో శివతాండవం..సంజూ శాంసన్కు ఎంత గిట్టిందో తెలుసా ?
Sanju Samson Prize Money : 2026 టీ20 వరల్డ్ కప్లో సంజూ శాంసన్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా నిలిచారు. 321 పరుగులు చేసిన ఆయనకు రూ. 21 లక్షల ప్రైజ్ మనీ దక్కింది. భారత్ వరుసగా రెండోసారి ఛాంపియన్గా నిలిచింది.ఈ చారిత్రాత్మక గెలుపులో కేరళ స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒక అద్భుతమైన చరిత్రను లిఖించాడు.

Sanju Samson Prize Money : అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన 2026 టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ విజయకేతనం ఎగురవేసింది. ఈ చారిత్రాత్మక గెలుపులో కేరళ స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒక అద్భుతమైన చరిత్రను లిఖించాడు. టోర్నీ ఆరంభంలో అసలు ప్లేయింగ్ ఎలెవన్లో చోటు దక్కుతుందో లేదో అన్న సందిగ్ధంలో ఉన్న సంజూ.. అవకాశం వచ్చిన ప్రతిసారీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 5 మ్యాచ్ల్లోనే 321 పరుగులు చేసి టీమ్ ఇండియాను విశ్వవిజేతగా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ అసాధారణ ప్రదర్శనకు గానూ అతడిని ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు వరించింది.
జింబాబ్వేతో మ్యాచ్లో రీఎంట్రీ చేసిన సంజూ, వెస్టిండీస్తో జరిగిన చావోరేవో పోరులో 97 పరుగులతో అజేయంగా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత సెమీఫైనల్లో ఇంగ్లాండ్పై 89 పరుగులు, ఫైనల్లో న్యూజిలాండ్పై 89 పరుగులు చేసి రికార్డు సృష్టించాడు. టీ20 వరల్డ్ కప్ చరిత్రలోనే అత్యంత కీలకమైన సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్ల్లో వరుసగా హాఫ్ సెంచరీలు బాదిన ఆటగాడిగా సంజూ నిలిచాడు. ఇన్నింగ్స్ ఆద్యంతం సిక్సర్లతో విరుచుకుపడుతూ కివీస్ బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టాడు.
ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా నిలిచిన సంజూ శాంసన్కు ఐసీసీ 25,000 అమెరికన్ డాలర్ల ప్రైజ్ మనీని ప్రకటించింది. మన భారత కరెన్సీలో దీని విలువ సుమారు రూ.21 లక్షలు. ఇక ఫైనల్ మ్యాచ్లో 4 వికెట్లతో చెలరేగి కివీస్ వెన్ను విరిచిన జస్ప్రీత్ బుమ్రా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. బుమ్రాకు అవార్డు రూపంలో సుమారు రూ.8.4 లక్షలు అందాయి. వ్యక్తిగత అవార్డులతో పాటు భారత జట్టుకు మొత్తం రూ.27.48 కోట్ల భారీ ప్రైజ్ మనీ దక్కింది. రన్నరప్గా నిలిచిన న్యూజిలాండ్కు రూ.14.65 కోట్లు లభించాయి.
టీ20 వరల్డ్ కప్ చరిత్రలో వరుసగా రెండుసార్లు (2024, 2026) టైటిల్ నెగ్గిన తొలి దేశంగా భారత్ ప్రపంచ రికార్డు సృష్టించింది. ఫైనల్లో భారత్ సాధించిన 255/5 స్కోరు.. వరల్డ్ కప్ ఫైనల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు కావడం విశేషం. బదులుగా కివీస్ జట్టు కేవలం 159 పరుగులకే కుప్పకూలడంతో భారత్ 96 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. సంజూ శాంసన్ ఫామ్, దూబే మెరుపులు, బుమ్రా స్పెల్స్ వెరసి భారత్ మరోసారి ప్రపంచ క్రికెట్ రారాజుగా అవతరించింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
