AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Punjab vs Mumbai : సర్ఫరాజ్ ఖాన్ మెరుపులు వృథా..పంజాబ్ బౌలర్ల దెబ్బకు ముంబై కోట బద్దలు

Punjab vs Mumbai : జైపూర్‌లోని జైపురియా విద్యాలయ గ్రౌండ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో ముంబై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ముంబై బౌలర్ల ధాటికి పంజాబ్ బ్యాటర్లు తడబడ్డారు. రమణ్‌దీప్ సింగ్ (72), అన్‌మోల్‌ప్రీత్ సింగ్ (57) మాత్రమే పోరాడటంతో పంజాబ్ 45.1 ఓవర్లలో 216 పరుగులకే ఆలౌట్ అయింది.

Punjab vs Mumbai : సర్ఫరాజ్ ఖాన్ మెరుపులు వృథా..పంజాబ్ బౌలర్ల దెబ్బకు ముంబై కోట బద్దలు
Punjab Vs Mumbai
Rakesh
|

Updated on: Jan 08, 2026 | 5:46 PM

Share

Punjab vs Mumbai : విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో పెను సంచలనం నమోదైంది. దేశవాళీ క్రికెట్ రారాజుగా వెలుగొందుతున్న ముంబై జట్టుకు పంజాబ్ షాకిచ్చింది. గెలుపు ముంగిట బోల్తా పడ్డ ముంబై, కేవలం 1 పరుగు తేడాతో అనూహ్య ఓటమిని మూటగట్టుకుంది. శ్రేయస్ అయ్యర్, సర్ఫరాజ్ ఖాన్ వంటి స్టార్ ప్లేయర్లు ఉన్నా కూడా..ఆఖరి నిమిషంలో పంజాబ్ బౌలర్లు చూపించిన తెగువకు ముంబై బ్యాటర్లు చేతులెత్తేశారు.

జైపూర్‌లోని జైపురియా విద్యాలయ గ్రౌండ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో ముంబై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ముంబై బౌలర్ల ధాటికి పంజాబ్ బ్యాటర్లు తడబడ్డారు. రమణ్‌దీప్ సింగ్ (72), అన్‌మోల్‌ప్రీత్ సింగ్ (57) మాత్రమే పోరాడటంతో పంజాబ్ 45.1 ఓవర్లలో 216 పరుగులకే ఆలౌట్ అయింది. ముంబై బౌలర్లలో ముషీర్ ఖాన్ 3 వికెట్లతో రాణించగా, శివం దూబే, శశాంక్ అట్టార్డే తలా రెండు వికెట్లు తీశారు.

217 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబైకి శుభారంభం దక్కింది. ముషీర్ ఖాన్, అంగ్‌క్రిష్ రఘువంశీ మొదటి వికెట్‌కు 57 పరుగులు జోడించారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సర్ఫరాజ్ ఖాన్ కేవలం 20 బంతుల్లో 62 పరుగులు చేసి పంజాబ్‌ను భయపెట్టాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా 45 పరుగులతో రాణించడంతో ముంబై విజయం ఖాయమని అందరూ భావించారు. ఒక దశలో ముంబై 4 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. అంటే చేతిలో 6 వికెట్లు ఉన్నాయి.. చేయాల్సింది కేవలం 25 పరుగులు మాత్రమే!

గెలుపు ముంగిట ఉన్న ముంబైకి పంజాబ్ బౌలర్లు నరకం చూపించారు. గుర్నూర్ బ్రార్, మయాంక్ మార్కండే నిప్పులు చెరిగే బంతులతో విరుచుకుపడ్డారు. 191 పరుగుల వద్ద ఐదో వికెట్ పడగా, అక్కడి నుంచి ముంబై స్కోరు బోర్డు కదలడం కష్టమైంది. ముంబై మిగిలిన 6 వికెట్లను కేవలం 24 పరుగుల వ్యవధిలోనే కోల్పోయింది. ఆఖరి బ్యాటర్లు కనీసం ఒక్క పరుగు తీసి మ్యాచ్‌ను డ్రా చేయలేకపోయారు. దీంతో 215 పరుగుల వద్ద ముంబై ఆలౌట్ అయి, కేవలం ఒకే ఒక్క పరుగుతో ఓటమిని చవిచూసింది.

పంజాబ్ విజయంలో గుర్నూర్ బ్రార్(4 వికెట్లు), మయాంక్ మార్కండే(4 వికెట్లు) కీలక పాత్ర పోషించారు. మ్యాచ్ చేజారిపోతుందనుకున్న దశలో వీరు చూపించిన పోరాట పటిమ పంజాబ్‌కు అద్భుత విజయాన్ని అందించింది. హర్‌ప్రీత్ బ్రార్, హర్నూర్ సింగ్‌లు తలా ఒక వికెట్ తీసుకున్నారు. బలమైన ముంబై లైనప్‌ను ఇంత తక్కువ స్కోరు వద్ద కట్టడి చేయడం విజయ్ హజారే ట్రోఫీ చరిత్రలోనే ఒక గొప్ప మలుపుగా నిలిచిపోతుంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.