
ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ కప్లో టీమిండియా మాజీ సారథి, సీనియర్ ఆటగాడు ధోనీ బ్యాటింగ్ తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. కీలకమైన సమయంలోనూ ధోనీ స్లోగా బ్యాటింగ్ చేయడం… భారీ షాట్స్ కొట్టకుండా ఆడటం చాలామందికి నచ్చలేదు. ఆఫ్ఘనిస్థాన్, ఇంగ్లాండ్, బంగ్లాదేశ్ జట్లతో జరిగిన మ్యాచ్లలో ధోనీ స్టయిల్ ఆఫ్ బ్యాటింగ్ క్రికెట్ లవర్స్తో పాటు అతడి ఫ్యాన్స్ను కూడా నిరాశపరిచింది. సంజయ్ మంజ్రేకర్, సచిన్, లక్ష్మణ్ లాంటి పలువురు మాజీ ఆటగాళ్లు సైతం ధోని ఆటతీరుపై పెదవి విరిచారు.
కానీ ధోనీకి ఉన్న అపారమైన ఫ్యాన్ బేస్ గురించి అందరికి తెలిసిందే. విపరీతమైన ట్రోల్స్ రావడంతో మాజీలు.. ధోనిపై తమ వ్యాఖ్యలను రివర్స్ టర్న్ చేస్తున్నారు. నిన్న సంజయ్ మంజ్రేకర్ ధోనిపై పాజిటీవ్ కామెంట్స్ చేసిన విషయం మరవక ముందే..తాజాగా క్రికెట్ గాడ్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ కూడా ధోనిపై ప్రశంసలు కురిపించారు.
బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో మాత్రం ధోనీ బ్యాటింగ్ చేసిన విధానం సరైందే అని సచిన్ టెండూల్కర్ కామెంట్ చేయడం.. అతడి ఫ్యాన్స్ దిల్ కుష్ చేసే విషయం. ఆ మ్యాచ్లో అందరూ ధోనీ నుంచి బిగ్ షాట్స్ ఆశించారనే విషయాన్ని అంగీకరించిన సచిన్… ధోనీ మాత్రం యువ ఆటగాళ్లకు ఆ అవకాశం ఇవ్వాలని భావించాడని అభిప్రాయపడ్డాడు. జట్టు కోసం ధోనీ ఆలోచించిన తీరు సరైందే అని సచిన్ తెలిపాడు. ధోనీ తన ఆట కంటే జట్టు ప్రయోజనాలే ముఖ్యమని అన్నాడు. కొహ్లి సైతం మ్యాచ్ అనంతరం ధోనిని వెనకేసుకురావడం విశేషం. కాగా ఈ వరల్డ్ కప్ అనంతరం ధోని రిటైర్మెంట్ ప్రకటిస్తాడని వార్తలు వస్తున్నాయి.