CWG 2026 : ఫైనల్లో ఓడినా హీరోనే.. భారత్కు సిల్వర్ అందించిన మణిపూర్ కుర్రాడు
CWG 2026 : కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత బాక్సర్ జదుమణి సింగ్ పురుషుల 55 కేజీల విభాగంలో రజత పతకం గెలిచి సత్తా చాటాడు. మణిపూర్ నుంచి ప్రపంచ వేదిక వరకు అతని పోరాట గాథ అభిమానులను ఆకట్టుకుంటోంది. భారత్ పతకాల వేటలో మరో విజయాన్ని నమోదు చేసింది.

CWG 2026 : గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత బాక్సింగ్ స్టార్ జదుమణి సింగ్ మరోసారి తన టాలెంటును నిరూపించుకున్నాడు. శనివారం జరిగిన పురుషుల 55 కేజీల విభాగం ఫైనల్ పోరులో అద్భుతమైన ప్రదర్శన చేసి భారత్కు రజత పతకాన్ని అందించాడు. ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియాకు చెందిన జై డిక్సన్తో తలపడిన జదుమణి, తొలి రౌండ్ను 3-2తో కైవసం చేసుకుని ఆధిపత్యం ప్రదర్శించాడు. అయితే ఆ తర్వాత జరిగిన రెండవ రౌండ్లో వెనుకబడి, చివరికి 0-5 తేడాతో ఓటమి పాలయ్యాడు. దీంతో జై డిక్సన్ స్వర్ణం గెలవగా, జదుమణి సింగ్ రజతంతో సరిపెట్టుకున్నాడు.
చదువు వదిలి బాక్సింగ్ వైపు పయనం
మణిపూర్లోని ఇరోయిషెంబా గ్రామానికి చెందిన జదుమణి సింగ్ జీవన ప్రయాణం చాలా ఆసక్తికరంగా సాగింది. చిన్నతనంలో అతనికి ఫుట్బాల్ అంటే ఎంతో ప్రాణం ఉండేది. అయితే చదువుపై శ్రద్ధ పెట్టాలని కుటుంబ సభ్యులు ఒత్తిడి చేయడంతో, ఇంట్లో తెలియకుండా దొంగతనంగా ఆటకు వెళ్లేవాడు. ఆ సమయంలో అతని మావయ్య అతనికి బాక్సింగ్ క్రీడను పరిచయం చేశారు. ప్రారంభంలో కాస్త సంకోచించినప్పటికీ ఆ తర్వాత బాక్సింగ్నే తన కెరీర్గా ఎంచుకున్నాడు. మణిపూర్లో తీవ్ర జాతి హింస చెలరేగిన సమయంలో కూడా అతని కుటుంబం ఆలోచనా విధానాన్ని మార్చుకుని, జదుమణి శిక్షణ ఆగిపోకుండా సపోర్టుగా నిలిచింది.
విమర్శకుల నోళ్లు మూయించిన రికార్డు విజయం
సంవత్సరం 2025లో గ్రేటర్ నోయిడాలో జరిగిన వరల్డ్ బాక్సింగ్ కప్ ఫైనల్స్లో 50 కేజీల విభాగంలో రజత పతకం గెలిచిన తర్వాత, జదుమణి 55 కేజీల విభాగానికి మారేందుకు ఒక రిస్క్ నిర్ణయం తీసుకున్నాడు. అతని ఎత్తు తక్కువగా ఉండటం వల్ల పెద్ద బాక్సర్ల ముందు నిలబడలేడని విమర్శకులు తీవ్రంగా విమర్శించారు. అయితే ఆ విమర్శలన్నింటినీ జదుమణి తన పంచ్లతో తిప్పికొట్టాడు. నేషనల్ ఛాంపియన్గా నిలిచి బెస్ట్ బాక్సర్ టైటిల్ సొంతం చేసుకోవడమే కాకుండా, కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడలకు భారత జట్టులో చోటు దక్కించుకుని విమర్శకుల నోళ్లు మూయించాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
