AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వ్యూస్, లైక్స్ అక్కర్లేదు.. నాకు ట్రోఫీలే కావాలి! గంభీర్ కౌంటర్ ఎవరికి?

శ్రీలంకతో రెండో టెస్టుకు ముందు టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ర్యాంకింగ్స్, వ్యూస్, లైక్స్ కంటే ట్రోఫీలు గెలవడమే తన లక్ష్యమన్నారు. భారత జట్టు ప్రస్తుతం పరివర్తన దశలో ఉందని, యువ ఆటగాళ్లకు సమయం అవసరమని చెప్పారు. మూడు టెస్టుల సిరీస్ ఆదర్శమని అభిప్రాయపడ్డారు.

వ్యూస్, లైక్స్ అక్కర్లేదు.. నాకు ట్రోఫీలే కావాలి! గంభీర్ కౌంటర్ ఎవరికి?
Gautam Gambhir
SN Pasha
|

Updated on: Aug 22, 2026 | 7:00 PM

Share

భారత క్రికెట్‌లో తాను పాపులారిటీ కోసం పోటీ పడటం లేదని టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్పష్టం చేశారు. ర్యాంకింగ్స్, సోషల్ మీడియా విమర్శలు, వ్యూస్, లైక్స్ వంటి వాటి గురించి తాను ఆలోచించనని.. తన పని జట్టును విజయాల వైపు నడిపించి ట్రోఫీలు గెలిపించడమేనని తేల్చి చెప్పారు. శ్రీలంకతో కొలంబోలో జరగనున్న రెండో టెస్టుకు ముందు నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో గంభీర్ ఈ వ్యాఖ్యలు చేశారు.

ట్రోఫీలు గెలవడమే లక్ష్యం

‘ట్రోఫీలు గెలవడమే నా పని. నేను నమ్మేది అదొక్కటే. వీక్షణలు, లైక్‌ల గురించి నేను పట్టించుకోను అని గంభీర్ స్పష్టం చేశారు. జట్టు ప్రదర్శనపై బయట నుంచి వచ్చే విమర్శలకు ప్రతిసారీ స్పందించడం తన బాధ్యత కాదని అన్నారు. ర్యాంకింగ్స్ కంటే మైదానంలో జట్టు చూపించే ప్రదర్శనకే ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్ వంటి సీనియర్ ఆటగాళ్లు టెస్టు క్రికెట్‌కు దూరమైన నేపథ్యంలో భారత జట్టు ప్రస్తుతం కీలక పరివర్తన దశలో ఉంది. శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టగా, దేవదత్ పడిక్కల్ మూడో స్థానంలో తన స్థానాన్ని పటిష్టం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. యువ స్పిన్నర్ మానవ్ సుతార్ కూడా శ్రీలంక పర్యటనలో ఆకట్టుకుంటున్నాడు.

మనం పరివర్తన దశలో ఉన్నాం. ఇందులో ఒడిదుడుకులు సహజం. కానీ మనం సరైన దిశలో ఎక్కడ వెళ్తున్నామో మనకు తెలుసు అని గంభీర్ అన్నారు. ఒక్కటి రెండు మ్యాచ్‌ల ఫలితాలను ఆధారంగా చేసుకుని ఆటగాళ్లను అంచనా వేయడం సరికాదని, కొత్త ఆటగాళ్లకు తమను తాము నిరూపించుకునేందుకు సమయం ఇవ్వాలని ఆయన అభిప్రాయపడ్డారు.

మానవ్ సుతార్‌పై ప్రశంసలు

శ్రీలంకతో గాలేలో జరిగిన తొలి టెస్టులో భారత్ 165 పరుగుల తేడాతో విజయం సాధించి రెండు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో మానవ్ సుతార్ తన రెండో టెస్టులోనే 10 వికెట్లు పడగొట్టి ప్రత్యేకంగా ఆకట్టుకున్నాడు. కొత్త తరం ఆటగాళ్లు క్రమంగా తమ సామర్థ్యాన్ని చూపిస్తున్నారని గంభీర్ పేర్కొన్నారు. కొలంబో టెస్టులో బౌలింగ్ కూర్పుపై కూడా గంభీర్ స్పందించారు. 20 వికెట్లు తీయగల అత్యుత్తమ బౌలింగ్ దళాన్ని ఎంపిక చేయడమే మా లక్ష్యం అని చెప్పారు. కుల్దీప్ యాదవ్ మంచి బౌలర్ అని, అయితే తుది నిర్ణయం మ్యాచ్ పరిస్థితులు, కెప్టెన్ అవసరాలపై ఆధారపడి ఉంటుందని తెలిపారు.

మూడు టెస్టుల సిరీస్‌లు..

రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కంటే మూడు టెస్టుల సిరీస్‌నే తాను ఆదర్శంగా భావిస్తున్నట్లు గంభీర్ చెప్పారు. ఒక జట్టు తొలి టెస్టులో ఓడిపోయినా తిరిగి పుంజుకునేందుకు మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో మెరుగైన అవకాశం ఉంటుందని వివరించారు. ప్రస్తుతం భారత్ 1-0 ఆధిక్యంలో ఉండటంతో కొలంబో టెస్టు సిరీస్ ఫలితాన్ని నిర్ణయించనుంది. ఈ నేపథ్యంలో కొత్త జట్టు పరివర్తన దశలో ఎంతవరకు ముందుకు వచ్చిందో నిరూపించుకోవడానికి ఈ మ్యాచ్ కీలకంగా మారింది. గంభీర్ మాత్రం బయట చర్చల కంటే మైదానంలో విజయాలే అసలు సమాధానం అనే వైఖరితో ముందుకు సాగుతున్నారు.

Follow Us