Virat Kohli : కింగ్ కోహ్లీ ఈజ్ బ్యాక్.. ఇంగ్లాండ్ వన్డే సిరీస్తో మైదానంలోకి విరాట్, నెట్టింట సీక్రెట్ ట్రైనింగ్ పిక్స్ వైరల్
Virat Kohli : గాయం నుంచి పూర్తిగా కోలుకున్న విరాట్ కోహ్లీ ఇంగ్లాండ్తో వన్డే సిరీస్లో రీఎంట్రీకి సిద్ధమయ్యాడు. ఫిట్నెస్ టెస్ట్ క్లియర్ చేసిన తర్వాత అతడి సీక్రెట్ ట్రైనింగ్ వీడియో వైరల్గా మారింది. జులై 14 నుంచి ప్రారంభమయ్యే సిరీస్పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Virat Kohli : భారత క్రికెట్ అభిమానులకు అదిరిపోయే వార్త అందింది. గాయం కారణంగా గత కొన్ని రోజులుగా ఆటకు దూరమైన టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టడానికి సర్వం సిద్ధం చేసుకున్నాడు. ఇంగ్లాండ్తో జరగబోయే వన్డే సిరీస్ ద్వారా కోహ్లీ రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అయితే, అధికారికంగా జట్టుతో చేరడానికి ముందే కోహ్లీ చేసిన ఒక సీక్రెట్ ట్రైనింగ్ సెషన్కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలో కోహ్లీ గ్రౌండ్లోకి వస్తూ అభిమానులకు అభివాదం చేయడం కనిపిస్తోంది. కోహ్లీని మళ్లీ క్రికెట్ కిట్లో చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
ఈ ఏడాది ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టును వరుసగా రెండోసారి ఛాంపియన్గా నిలిపి కోహ్లీ చరిత్ర సృష్టించాడు. అయితే, లీగ్ మ్యాచ్లు ఆడుతున్న సమయంలోనే కోహ్లీ తీవ్రంగా గాయపడ్డాడు. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ఆడే సమయానికి ఆయన పూర్తి ఫిట్నెస్తో లేనప్పటికీ జట్టు కోసం బరిలోకి దిగాడు. ఆ తర్వాత గాయం తిరగబెట్టడంతో ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన వన్డే సిరీస్కు కోహ్లీ పూర్తిగా దూరమయ్యాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ టూర్కు ఎంపికైనప్పటికీ, ఆయన ఆడటం అనేది ఫిట్నెస్ టెస్ట్పైనే ఆధారపడి ఉంటుందని బోర్డు పేర్కొంది. ఈ క్రమంలోనే కోహ్లీ తాజాగా ఫిట్నెస్ పరీక్షకు హాజరై సక్సెస్ఫుల్గా పాస్ అయ్యాడు.
నెట్టింట హల్చల్ చేస్తున్న కోహ్లీ ప్రాక్టీస్ వీడియోలో మరొక ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. టీమిండియా మాజీ క్రికెటర్, మాజీ కోచ్ సంజయ్ బంగర్ సమక్షంలో కోహ్లీ ఈ ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. బ్యాటింగ్ టెక్నిక్స్తో పాటు ఫిట్నెస్పై వీరిద్దరూ మైదానంలో చాలా సేపు సుదీర్ఘంగా చర్చించుకున్నారు. అయితే ఈ వీడియో ఇప్పటిది కాదని, కోహ్లీ ఇంగ్లాండ్ వెళ్లడానికి కొన్ని రోజుల ముందు మహారాష్ట్రలోని ఒక స్థానిక స్టేడియంలో రికార్డ్ అయిందని తెలుస్తోంది. రీఎంట్రీలో దుమ్ములేపడమే లక్ష్యంగా కింగ్ కోహ్లీ అంతలా శ్రమించడం చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
.@imVkohli scheduled a net session with Sanjay Bangar in Alibaug! 🏏 pic.twitter.com/peezX2FDhx
— ViratGang.in (@ViratGangIN) July 2, 2026
ప్రస్తుతం భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ల టీ20 సిరీస్ నడుస్తోంది. అయితే, దురదృష్టవశాత్తూ మొదటి మ్యాచ్ వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయింది. ఇక రెండో టీ20 మ్యాచ్ శనివారం జరగనుంది. ఈ మ్యాచ్లో భారత 15 ఏళ్ల యువ బ్యాటింగ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వండర్ కిడ్ బ్యాటింగ్ను చూడటానికి ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ టీ20 సిరీస్ ముగిసిన వెంటనే అందరి కళ్లు వన్డే సిరీస్పైనే పడనున్నాయి.
ఫిట్నెస్ టెస్ట్ క్లియర్ చేసిన తర్వాత విరాట్ కోహ్లీ ఇప్పటికే లండన్ చేరుకున్నాడు. అక్కడ జరుగుతున్న ఐసీసీ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మహిళల జట్ల మధ్య జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్ను చూడటానికి కోహ్లీ స్వయంగా స్టేడియానికి వచ్చాడు. ఆయనతో పాటు భార్య, నటి అనుష్క శర్మ కూడా ఉన్నారు. స్టేడియంలో వీరిద్దరూ కూర్చుని భారత మహిళల జట్టును ప్రోత్సహిస్తున్న విజువల్స్ నెటిజన్లను ఆకట్టుకున్నాయి. భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ జులై 14 నుంచి ప్రారంభం కానుంది. రెండో వన్డే జులై 16న, ఆఖరి వన్డే జులై 19న జరగనున్నాయి.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
