AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vaibhav Suryavanshi : 14 ఏళ్లకే పద్మవ్యూహాన్ని ఛేదించిన అభిమన్యుడు..రాష్ట్రపతి చేతుల మీదుగా వైభవ్‎కు ప్రతిష్టాత్మక అవార్డు

Vaibhav Suryavanshi : బీహార్‌కు చెందిన 14 ఏళ్ల క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీ కెరీర్‌లో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. క్రికెట్ మైదానంలో పరుగుల వరద పారిస్తున్న ఈ చిచ్చరపిడుగును భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్‎తో గౌరవించింది.

Vaibhav Suryavanshi : 14 ఏళ్లకే పద్మవ్యూహాన్ని ఛేదించిన అభిమన్యుడు..రాష్ట్రపతి చేతుల మీదుగా వైభవ్‎కు ప్రతిష్టాత్మక అవార్డు
Vaibhav Suryavanshi
Rakesh
|

Updated on: Dec 26, 2025 | 11:52 AM

Share

Vaibhav Suryavanshi : బీహార్‌కు చెందిన 14 ఏళ్ల క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీ కెరీర్‌లో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. క్రికెట్ మైదానంలో పరుగుల వరద పారిస్తున్న ఈ చిచ్చరపిడుగును భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్‎తో గౌరవించింది. ఢిల్లీలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా వైభవ్ ఈ అవార్డును అందుకున్నారు. అతి చిన్న వయసులోనే అంతర్జాతీయ స్థాయిలో రికార్డులు సృష్టిస్తూ, దేశం గర్వించేలా చేసినందుకు గాను రాష్ట్రపతి వైభవ్‌ను ప్రత్యేకంగా అభినందించారు.

ఈ అవార్డు ప్రదానోత్సవం కోసం వైభవ్ బుధవారమే ఢిల్లీ చేరుకున్నారు. ఈ కారణంగానే ఆయన విజయ్ హజారే ట్రోఫీలో మణిపూర్‌తో జరిగిన మ్యాచ్‌కు దూరమవ్వాల్సి వచ్చింది. అవార్డు అందుకున్న తర్వాత వైభవ్ త్వరలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూడా కలవనున్నారు. కేవలం 14 ఏళ్లకే అండర్-19 వరల్డ్ కప్, ఐపీఎల్, విజయ్ హజారే ట్రోఫీ ఇలా ప్రతి చోటా తనదైన ముద్ర వేసిన వైభవ్, ఇప్పుడు దేశ అత్యున్నత బాల పురస్కారం అందుకోవడం బీహార్ క్రీడాకారులకే కాకుండా యావత్ భారత యువతకు స్పూర్తిదాయకంగా నిలిచింది.

రెండు రోజుల క్రితమే వైభవ్ సూర్యవంశీ విజయ్ హజారే ట్రోఫీలో సరికొత్త చరిత్ర సృష్టించారు. అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 36 బంతుల్లోనే సెంచరీ బాది, లిస్ట్-ఏ క్రికెట్ చరిత్రలో అతి చిన్న వయసులో సెంచరీ చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పారు. తద్వారా 1986లో పాకిస్థాన్ ఆటగాడు జహూర్ ఇలాహీ పేరిట ఉన్న 39 ఏళ్ల రికార్డును వైభవ్ తుడిచిపెట్టేశారు. ఆ మ్యాచ్‌లో 84 బంతుల్లో 16 ఫోర్లు, 15 సిక్సర్లతో ఏకంగా 190 పరుగులు చేసి ఏబీ డివిలియర్స్, జోస్ బట్లర్ వంటి దిగ్గజాల రికార్డులను కూడా వెనక్కి నెట్టారు.

వైభవ్ సాధించిన రికార్డులు ఇక్కడితో ఆగిపోలేదు. సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో మహారాష్ట్రపై అజేయమైన సెంచరీ (108*) బాది, ఆ టోర్నీలో సెంచరీ చేసిన అత్యంత పిన్న వయస్కుడిగా నిలిచారు. అలాగే ఐపీఎల్ చరిత్రలో కేవలం 14 ఏళ్ల 32 రోజుల వయసులోనే హాఫ్ సెంచరీ బాది రియాన్ పరాగ్ రికార్డును చెరిపివేశారు. అండర్-19 ఆసియా కప్‌లో యూఏఈపై 14 సిక్సర్లతో 171 పరుగులు చేసి, యూత్ వన్డేల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్‌గా ఆస్ట్రేలియా ప్లేయర్ మైఖేల్ హిల్ రికార్డును బద్దలు కొట్టారు. వైభవ్ ధాటికి భారత అండర్-19 జట్టు 433 పరుగుల భారీ స్కోరును సాధించి చరిత్ర సృష్టించింది.

బీహార్ వంటి రాష్ట్రం నుంచి వచ్చి, సరైన వసతులు లేకపోయినా తన పట్టుదలతో ఈ స్థాయికి చేరడం నిజంగా అద్భుతం. వైభవ్ సూర్యవంశీ కేవలం ఒక క్రికెటర్ మాత్రమే కాదు, లక్షలాది మంది యువతకు ఒక ఆశ కిరణం. కఠిన శ్రమ, ఆత్మవిశ్వాసం ఉంటే ఏ వయసులోనైనా అసాధ్యాలను సుసాధ్యం చేయొచ్చని ఆయన నిరూపిస్తున్నారు. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకోవడం ఆయన కెరీర్‌లో ఒక మైలురాయి మాత్రమే. భవిష్యత్తులో టీమిండియా తరపున వైభవ్ మరిన్ని చారిత్రాత్మక విజయాలు సాధిస్తారని క్రికెట్ విశ్లేషకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.