
Vaibhav Sooryavanshi: వచ్చే మార్చి 28న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య పోరుతో ఐపీఎల్ 19వ సీజన్ ప్రారంభం కానుంది. అయితే, అందరి దృష్టి మార్చి 30న గువహటి వేదికగా జరగనున్న రాజస్థాన్ రాయల్స్ (RR), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మ్యాచ్పై పడింది. రాజస్థాన్ జట్టుకు రెండో హోమ్ గ్రౌండ్గా ఉన్న గువహటిలో ఈ పోరు జరగనుంది. ఈ మ్యాచ్కు ముందే రాజస్థాన్ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ, చెన్నై ఆటగాడు ఆయుష్ మాత్రే సమక్షంలో సీఎస్కేకు బహిరంగ సవాల్ విసిరాడు.
నమన్ అవార్డుల కార్యక్రమంలో భాగంగా జరిగిన ఒక చర్చా కార్యక్రమంలో వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మాత్రే పాల్గొన్నారు. వీరిద్దరూ అండర్-19 క్రికెట్లో కలిసి ఆడిన స్నేహితులే అయినప్పటికీ, ఐపీఎల్ వేదికగా మాత్రం ప్రత్యర్థులుగా మారారు. ఈ క్రమంలో వైభవ్ మాట్లాడుతూ, “నేను రాజస్థాన్ జట్టులోకి వచ్చినప్పటి నుంచి చెన్నై జట్టు వరుసగా రెండుసార్లు ఓడిపోయింది. ఈసారి ఆ స్కోరు 4-0 అవుతుంది” అంటూ తన ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించాడు.
ఐపీఎల్ 2025 సీజన్లో రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ రెండుసార్లు తలపడగా, ఆ రెండు మ్యాచ్ల్లోనూ రాజస్థానే విజయం సాధించింది. మార్చి 30, 2025న జరిగిన మొదటి పోరులో రాజస్థాన్ 6 పరుగుల తేడాతో గెలవగా, మే 20న జరిగిన రెండో మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ముఖ్యంగా రెండో మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ కేవలం 33 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 57 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఐపీఎల్ నిబంధనల ప్రకారం గ్రూప్ దశలో ప్రతి జట్టు మరో జట్టుతో రెండుసార్లు తలపడుతుంది. గత ఏడాది సాధించిన రెండు విజయాలకు తోడు, ఈ ఏడాది కూడా రెండు మ్యాచ్ల్లో గెలిచి మొత్తంగా 4-0 ఆధిక్యాన్ని సాధిస్తామని వైభవ్ ధీమా వ్యక్తం చేస్తున్నాడు. ధోనీ మార్గదర్శకత్వంలో నడిచే చెన్నై సూపర్ కింగ్స్ ఈ సవాల్కు మైదానంలో ఎలా సమాధానం చెబుతుందో చూడాలి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..