AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ ఒక్కడుంటే బాగుండు.. టీమిండియా చెత్త ఆట తర్వాత అందరికీ గుర్తొస్తున్న ఒకే ఒక్కడు!

ప్రస్తుతం టీమిండియా పేలవమైన ప్రదర్శనతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో వరుస ఓటములతో అభిమానులు నిరాశ చెందారు. ఇలాంటి క్లిష్ట సమయంలో ఒక ప్లేయర్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందని, అతని యాంకర్ రోల్, మ్యాచ్ గెలిపించే అప్రోచ్ టీమ్‌కి ఎంత అవసరమో 2024 టీ20 ప్రపంచ కప్ ఫైనల్ వంటి ప్రదర్శనలు రుజువు చేస్తున్నాయని క్రికెట్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

ఆ ఒక్కడుంటే బాగుండు.. టీమిండియా చెత్త ఆట తర్వాత అందరికీ గుర్తొస్తున్న ఒకే ఒక్కడు!
Team India Missing Kohli
SN Pasha
|

Updated on: Jul 10, 2026 | 2:50 PM

Share

ప్రస్తుతం టీమిండియా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. పసికూన ఐర్లాండ్‌పై రెండు టీ20ల సిరీస్ ఓడిపోయినప్పుడు కూడా ఇంత తీవ్ర స్థాయిలో విమర్శలు రాలేదు. సర్లే అప్పుడప్పుడు అవుతూనే ఉంటుంది అని లైట్ తీసుకున్నారు. కానీ, ఇంగ్లాండ్‌తో సిరీస్‌ను మాత్రం భారత క్రికెట్ అభిమానులు సీరియస్‌గా తీసుకున్నారు. తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. గెలవాల్సిన రెండో మ్యాచ్‌లో చెత్త బౌలింగ్‌తో చేజేతులా ఓడిపోయారు, మూడో టీ20లో 76 పరుగులకే ఆలౌట్, 100కి పైగా పరుగుల తేడాతో ఓటమి, ఇక తాజాగా గురువారం జరిగిన నాలుగో టీ20లో 9 వికెట్ల తేడాతో పరాజయం. మూడ్నేళ్ల కింద టీ20 వరల్డ్ కప్ గెలిచి ఛాంపియన్‌గా నిలిచిన టీమ్ ఈ విధంగా ఓడిపోతుంటే ఏ ఒక్కరు కూడా దీన్ని జీర్ణించుకోలేపోతున్నారు.

టీమ్‌పై విమర్శలు.. కోహ్లీపై ప్రశంసలు

ఇంత చెత్తగా ఆడుతున్నారేంటని జట్టుని, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌ని సోషల్ మీడియా వేదికగా ఏకిపారేస్తున్నారు. ఒక వైపు టీమిండియాపై విమర్శలతో పాటు మరో వైపు ఆ ఒక్కడు ఉన్నప్పుడు ఎంత బాగుడేంది, ఇప్పుడు అతను టీమ్‌లో ఉంటే బాగుండు అంటూ దాదాపు ప్రతి భారత క్రికెట్ అభిమాని అనుకుంటున్నాడు. ఇంతకీ ఆ ఒక్కడు ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎస్.. మీ గెస్ కరెక్టే.. అతనే ది కింగ్, ది ఛేజ్ మాస్టర్.. విరాట్ కోహ్లీ. అతను ఉన్నంత కాలం టీమిండియా క్లిష్టపరిస్థితుల్లో ఉంటే ఆదుకునే వాడని, అతని యాంకర్ రోల్‌తో జట్టును ఓటమి కోరల్లోని లాగేసి.. విజయతీరాలకు చేర్చేవాడని అంటున్నారు.

మ్యాచ్‌లు గెలిపించే కోహ్లీ అప్రోచ్..

సరిగ్గా ఆలోచిస్తే.. అలాంటి ఇన్సింగ్స్‌లు విరాట్ కోహ్లీ ఎన్నో ఆడాడు. అందుకు ఒక అద్భుతమైన ఉదాహరణ చెప్పుకోవాలంటే.. 2024 టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ గురించి చెప్పుకోవచ్చు. ఫైనల్‌ ముందు వరకు వరుసగా విఫలం అవుతూ వచ్చిన కోహ్లీ.. ఫైనల్ మ్యాచ్‌లో మాత్రం కచ్చితంగా పరుగులు చేయాలనే బలమైన సంకల్పంతో దిగాడు. ఆరంభంలోనే బౌండరీలతో విరుచుకుపడుతూ వేగంగా పరుగులు చేశారు. 5 బంతుల్లోనే 14 రన్స్ చేశాడు. కానీ మరో ఎండ్‌లో వరుసగా మూడు వికెట్లు పడటంతో తన గేరు మార్చాడు. చివరి వరకు క్రీజ్‌లో ఉండి 76 పరుగులతో టీమిండియాకు మంచి స్కోర్ వచ్చేలా ఆడాడు. వరల్డ్ కప్ ఫైనల్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.

అలా ఆడే ప్లేయర్ ఇప్పుడు టీమ్‌లో కనిపించడం లేదని, కోహ్లీని టీమిండియా కచ్చితంగా మిస్ అవుతుందని క్రికెట్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. పైగా అప్పట్లో విరాట్ కోహ్లీ స్ట్రైక్ రేట్‌పై కూడా కొంతమంది విమర్శలు చేసేవారు. ఇప్పుడు అదే విషయంపై కొంతమంది క్రికెట్ దిగ్గజాలే స్పందిస్తున్నారు. ప్రతీసారి అగ్రెసివ్ ఇంటెంట్‌తో మీరు 10లో 9 మ్యాచ్‌లు గెలవలేరని, కానీ కోహ్లీ అప్రోచ్‌తో మీరు కచ్చితంగా 10లో 9 మ్యాచ్‌లు గెలుస్తారని, అప్పట్లో కోహ్లీ స్ట్రైక్ రేట్‌ను విమర్శించిన వారికి ఇప్పుడు సరైన సమాధానం లభించిందంటూ చురకలు కూడా అంటిస్తున్నారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us