Team India: టీ20 ప్రపంచకప్‌ ఎఫెక్ట్‌.. పొట్టి ఫార్మాట్‌లో వీరి కెరీర్‌ ఇక ముగిసినట్లే

|

Nov 25, 2022 | 10:58 AM

దెబ్బకు దిగొచ్చిన బీసీసీఐ భారత జట్టులో ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా మొదట సెలెక్షన్‌ కమిటీని రద్దుచేసింది. అలాగే కొత్త సెలెక్టర్‌ పదవికి దరఖాస్తులు కూడా ఆహ్వానించింది.

Team India: టీ20 ప్రపంచకప్‌ ఎఫెక్ట్‌.. పొట్టి ఫార్మాట్‌లో వీరి కెరీర్‌ ఇక ముగిసినట్లే
Team India
Follow us on

ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా అవమానకరమైన రీతిలో ఇంటిదారి పట్టింది. ఇంగ్లండ్‌లో జరిగిన సెమీఫైనల్‌లో ఏకంగా 10 వికెట్ల తేడాతో ఓడిపోయింది. కనీసం పోరాటపటిమ లేకుండానే చేతులెత్తేసిన టీమిండియా మాజీ క్రికెటరర్లు, ఫ్యాన్స్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జట్టులో మార్పులు చేయాలంటూ, ఐపీఎల్‌ను బ్యాన్‌ చేయాలంటూ సోషల్‌ మీడియా వేదికగా పోస్టులు షేర్‌ చేశారు. దెబ్బకు దిగొచ్చిన బీసీసీఐ భారత జట్టులో ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా మొదట సెలెక్షన్‌ కమిటీని రద్దుచేసింది. అలాగే కొత్త సెలెక్టర్‌ పదవికి దరఖాస్తులు కూడా ఆహ్వానించింది. అంతేకాదు టీ20 ఫార్మాట్‌లో టీమిండియా కెప్టెన్సీ బాధ్యతల నుంచి రోహిత్‌ను తప్పించే అవకాశాలున్నాయని కూడా తెలుస్తోంది. ఈ బాధ్యతలను హార్దిక్ పాండ్యాకు అప్పగించే పనిలో బీసీసీఐ ఉన్నట్లు సమాచారం. కాగా టీ20 ప్రపంచకప్‌ ఓటమితో పొట్టి ఫార్మాట్‌లో ముగ్గురి ఆటగాళ్ల భవిష్యత్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి.

2024 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని వన్డే, టీ20 జట్లకు వేర్వేరు కెప్టెన్లను ఎంపిక చేయాలని బీసీసీఐ భావిస్తోంది. అంతేకాదు రాబోయే పొట్టి ప్రపంచకప్‌ కోసం బీసీసీఐ కొత్త జట్టును ఏర్పాటు చేయాలని ఇప్పటికే యోచిస్తున్నట్లు సమాచారం. దీని ప్రకారం జట్టులోని కొంతమంది సీనియర్ ఆటగాళ్లను క్రికెట్ ఫార్మాట్ నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకోనున్నారట. ఈ జాబితాలో ఈసారి టీ20 ప్రపంచకప్‌లో ఆడిన ముగ్గురు సీనియర్ ఆటగాళ్లు ఉన్నారు. అందులో మొదటగా వినిపిస్తున్న పేరు రవిచంద్రన్ అశ్విన్. ఈ టీ20 ప్రపంచకప్‌లో అశ్విన్ అన్ని మ్యాచ్‌లు ఆడాడు. అయితే కేవలం 6 వికెట్లు మాత్రమే తీశాడు. మరోవైపు, 36 ఏళ్ల అశ్విన్‌ను జట్టులోకి తీసుకోవడం వల్ల యుజ్వేంద్ర చాహల్ టోర్నీ మొత్తం రిజర్వ్‌ బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఈ నేపథ్యంలో రాబోయే టీ20 ప్రపంచకప్‌ ఎంపికకు అశ్విన్‌ను ఎట్టి పరిస్థితుల్లోకి పరిగణనలోకి తీసుకోరు. కేవలం వన్డే, టెస్ట్ జట్టులకే అతనిని పరిమితం చేయనున్నారు.

డీకే, షమీలకు నో ఛాన్స్‌..

కాగా 2021 టీ20 ప్రపంచకప్ తర్వాత టీ20 జట్టు నుంచి టీమిండియా పేసర్ మహ్మద్ షమీని తప్పించారు. అయితే ఈసారి జస్ప్రీత్ బుమ్రా అందుబాటులో లేకపోవడంతో మళ్లీ జట్టులోకి ఎంపికయ్యాడు. కానీ ఆస్ట్రేలియాలో 6 వికెట్లు మాత్రమే తీశాడు. దీంతో అతనికి ఉద్వాసన తప్పకపోవచ్చు. ఈ జాబితాలో వినిపిస్తోన్న మరో పేరు దినేశ్‌ కార్తీక్‌.. 2019 తర్వాత భారత జట్టుకు దూరమైన దినేష్ కార్తీక్ ఆశ్చర్యకరంగా పునరాగమనం చేశాడు. ఐపీఎల్‌లో ఆర్‌సీబీ తరఫున అద్భుతంగా రాణించి టీమిండియాలో ఫినిషర్‌గా అవకాశం దక్కించుకున్నాడు. కానీ టీ20 ప్రపంచకప్‌లో 4 మ్యాచ్‌లు ఆడిన డీకే 14 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో దినేష్ కార్తీక్ టీ20 కెరీర్ కూడా ముగిసిందని క్రికెట్‌ నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే టీమిండియా వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ స్థానం కోసం రిషబ్ పంత్, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అందువల్ల 37 ఏళ్ల డీకేకు రానున్న రోజుల్లో టీమ్ ఇండియాలో అవకాశం రాదని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..